జూబిలీ సంవత్సరంలో 3.3 కోట్లకు పైగా యాత్రికులు రోమ్‌ను సందర్శించారు

జూబిలీ సంవత్సరంలో  3.3 కోట్లకు పైగా యాత్రికులు రోమ్‌ను సందర్శించారు 

పవిత్ర జూబిలీ సంవత్సరంలో ప్రపంచంలోని 185 దేశాల నుంచి దాదాపు 33.5 మిలియన్ (3.35కోట్ల ) యాత్రికులు రోమ్‌కు వచ్చారు అని సువార్త ప్రచార విభాగం (Dicastery for Evangelization) ప్రో-ప్రిఫెక్ట్ మరియు జూబిలీకి అధికారిక సమన్వయకర్త అగ్రపీఠాధిపతులు మహా పూజ్య రినో ఫిసికెల్లా గారు వెల్లడించారు. జనవరి 5,సోమవారం వాటికన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ గణాంకాలను విడుదల చేశారు. 

జనవరి 6న సెయింట్ పీటర్స్ బసిలికా పవిత్ర ద్వారం మూసివేయడంతో పోప్ లియో XIV అధికారికంగా జూబ్లీని ముగించనున్నందున, గత సంవత్సరం గురించి ఆయన ఈ గణాంకాలను పంచుకున్నారు.

మహా పూజ్య రినో ఫిసికెల్లా గారు మాట్లాడుతూ "జూబిలీ సమయంలో మొత్తం ప్రపంచమే రోమ్‌కు వచ్చింది” అని  అన్నారు. రోమా ట్రె విశ్వవిద్యాలయం సుమారు 31 మిలియన్ల యాత్రికులు వస్తారని అంచనా వేయగా, అంచనాలను  మించి విశ్వాసులు వచ్చారని ఆయన తెలిపారు.

 62% యాత్రికులు యూరోపియన్ ఖండం నుండి వచ్చారు, ఇటలీ పాల్గొనేవారి సంఖ్య పరంగా మొదటి స్థానంలో ఉంది. ఉత్తర అమెరికా రెండవ అత్యధిక ప్రాతినిధ్యం వహించిన ఖండం, 17% యాత్రికులు ఉన్నారు. ఇటలీ తర్వాత ఎక్కువగా వచ్చిన దేశాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, స్పెయిన్, బ్రెజిల్, పోలాండ్.

జూబిలీ వేడుకలకు సహాయపడ్డ  7,000 మంది స్వచ్ఛంద సేవకుల సేవలను మహా పూజ్య  రినో ఫిసికెల్లా గారు ప్రత్యేకంగా ప్రశంసించారు.

Article and design by 

M kranthi swaroop