FABC ప్లీనరీ సమావేశానికి పరిశుద్ధ పోప్ లియో XIV ప్రత్యేక దూతగా భారతీయ కార్డినల్ గ్రాసియాస్ నియామకం

కార్డినల్ గ్రాసియాస్ నియామకం
2026 జూలై 20 నుంచి 26 వరకు ఇండోనేషియాలోని జకార్తాలో జరగనున్న FABC 12వ ప్లీనరీ సమాఖ్య సమావేశానికి, బొంబాయి మాజీ అగ్రపీఠాధిపతి మహా పూజ్య కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియాస్‌ను పరిశుద్ధ పోప్ లియో XIV తన ప్రత్యేక దూతగా నియమించారు.

పరిశుద్ధ పోప్ లియో XIV, భారతదేశంలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన బొంబాయి మాజీ అగ్రపీఠాధిపతి మహా పూజ్య కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియాస్‌ను, 2026 జూలై 20 నుంచి 26 వరకు ఇండోనేషియాలోని జకార్తాలో జరగనున్న Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమాఖ్య సమావేశానికి తన ప్రత్యేక దూతగా నియమించారు.

కార్డినల్ గ్రాసియాస్‌కు పంపిన లేఖలో, ఆసియాలో శ్రీసభ నిరంతర అభివృద్ధి చెందాలని పరిశుద్ధ పోప్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. క్రైస్తవ విశ్వాసానికి సాక్ష్యంగా నిలవడంలో, మానవ గౌరవాన్ని పరిరక్షించి ప్రోత్సహించడంలో ఆసియా పోషిస్తున్న విశిష్ట పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఆసియాలో శ్రీసభ పరిచర్యను గురించి ఆలోచిస్తూ, నేటి ప్రపంచ వాస్తవాలతో పీఠాధిపతులు, విశ్వాసులు సజీవ అనుబంధాన్ని కొనసాగించాలని పరిశుద్ధ పోప్ లియో XIV ప్రోత్సహించారు.

"మన కాలపు సేవలో మీ చేతులు మురికివుతాయేమోనని ఎన్నడూ భయపడకండి," అని ఆయన పేర్కొన్నారు. మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లకు శ్రీసభ ప్రార్థన, వివేకం, పట్టుదలతో ప్రతిస్పందించాలని పిలుపునిచ్చారు.

శ్రీసభ చేపట్టే ప్రతి కార్యానికి దేవుడే కేంద్రబిందువుగా ఉండాలని, అలాగే ప్రతి నిర్ణయంలో మానవ వ్యక్తి గౌరవమే ప్రధాన ప్రమాణంగా నిలవాలని పరిశుద్ధ పోప్ నొక్కిచెప్పారు. ముఖ్యంగా పేదలు, రోగులు, వలసదారులు, చిన్నారులు వంటి సమాజపు అంచులకు నెట్టివేయబడినవారే మరింత న్యాయసమ్మతమైన, కరుణామయమైన సమాజ నిర్మాణానికి కేంద్రబిందువుగా గుర్తించబడాలని ఆయన అన్నారు.

కీర్తన 85:11ను ఉదహరిస్తూ, "ప్రేమ, సత్యం కలుసుకునే ప్రపంచం, న్యాయం, శాంతి ఏకమయ్యే సమాజం" కోసం కృషి చేయాలని పరిశుద్ధ పోప్ పిలుపునిచ్చారు.

విభజనలు, స్వార్థ ప్రయోజనాలతో నడిచే సంస్థగా కాకుండా, ఐక్యతను నిర్మించే శ్రీసభగా ఎదగాలని ఆయన ప్రోత్సహించారు.

"ఈ కాలపు బాబేలు గోపురాలను నిర్మించే శిల్పులుగా కాకుండా, ఐక్యతను నిర్మించే సేవకులుగా మనం మారాలి. నాశనానికి గురయ్యే గోపురాలను నిర్మించేవారిగా కాదు; రాబోయే దేవుని రాజ్యానికి సేవచేసేవారిగా ఉండాలి," అని పరిశుద్ధ పోప్ లియో XIV అన్నారు.

2006 నుంచి 2025 వరకు భారతదేశంలోని బొంబాయి అగ్రపీఠాధిపతిగా సేవలందించిన కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియాస్, ఆసియాలో శ్రీసభ అభివృద్ధికి చేసిన విశిష్ట సేవలతో పాటు, ప్రాంతీయ, విశ్వవ్యాప్త శ్రీసభ నాయకత్వంలో పోషించిన కీలక పాత్ర ద్వారా విశేష గుర్తింపు పొందారు. ఆయన గతంలో భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడిగా, అలాగే వాటికన్‌కు చెందిన పలు కీలక సలహా సంఘాల సభ్యునిగా కూడా సేవలందించారు.

పరిశుద్ధ పోప్ ప్రత్యేక దూతగా, కార్డినల్ గ్రాసియాస్ ప్లీనరీ సమాఖ్య సమావేశంలో జరిగే ప్రధాన దివ్యబలి వేడుకలకు అధ్యక్షత వహించడంతో పాటు, సమావేశంలో పాల్గొనే పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, ధార్మిక సంఘాల సభ్యులు, లౌకిక విశ్వాసులకు పరిశుద్ధ పోప్ లియో XIV శుభాకాంక్షలు, సాన్నిహిత్య సందేశాన్ని అందజేయనున్నారు.

"సమాఖ్య పరివర్తనకు పిలుపు మరియు ఆసియాలో వారధులుగా, వారధులను నిర్మించేవారిగా ఉండే శ్రీసభ పరిచర్య" అనే ఇతివృత్తంతో నిర్వహించనున్న FABC 12వ ప్లీనరీ సమాఖ్య సమావేశం, ఆసియా నలుమూలల నుంచి పీఠాధిపతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఖండవ్యాప్తంగా శ్రీసభలో ఐక్యత, సంభాషణ, సువార్త ప్రకటనా సేవలను మరింత బలోపేతం చేయడంపై లోతైన మథనానికి వేదిక కానుంది.