మరియ భర్తయగు పునీత యోసేపుగారి మహోత్సవం

మరియ భర్తయగు పునీత యోసేపుగారి మహోత్సవం

యోసేపు’ అంటే ‘కలుపుకొను’ లేదా ‘దేవుడు సమృద్ది చేయును’ అని అర్ధం. యోసేపు కన్యమరియమ్మకు జ్ఞానభర్త, యేసుకు సాకుడుతండ్రి.

 1847లో పునీత యోసేపుగారి మహోత్సవమును 9వ భక్తినాధ జగద్గురువులు ప్రారంభించారు. క్రీ.శ. 1869-70లో జరిగిన ప్రధమ వాటికన్ మహాసభలో, 9వ భక్తినాధ జగద్గురువులు పునీత యోసేపుగారిని “విశ్వశ్రీసభ పాలక పోషకుడు”గా ప్రకటించారు. అలాగే, శ్రీసభ “ఆస్తిపాస్తులకు సంరక్షకులు”గా ప్రకటించారు. క్రీ.శ. 1955లో 12వ భక్తినాధ జగద్గురువులు యోసేపుగారిని “కార్మికుల పాలకుడు”గా గౌరవించారు.1989లో రెండవ జాన్ పౌలు జగద్గురువు యోసేపు “రక్షకుని సంరక్షుకుడు” అని గౌరవించారు.

యోసేపు బెత్లేహేములో జన్మించారు. పరిశుద్ధాత్మ సహాయంతో యేసు ప్రభువు ప్రాణం పరలోకం నుండి మరియ గర్భంలోకి మార్చబడింది. (లూకా 1:​30-35). గాబ్రియేలు దేవదూత శుభవర్తమానాన్ని మరియమ్మగారికి అందించక మునుపే మరియ యోసేపుకు ప్రధానం చేయబడింది.

ప్రభువుదూత మాటప్రకారం మారుమాటలాడక మరియను చేర్చుకున్నారు. యోసేపు గారు విధేయత తో పరిశుద్దతకు పూర్తిగా లోబడి దైవాజ్ఞలను తు.చ. తప్పక పాటించారు . ఇదే వారి విశ్వసనీయత, విజ్ఞత, ఘనత. యోసేపు యేసును పెంచే బాధ్యతను తీసుకొని ఆయనకు తండ్రి అయ్యాడు.

గొప్ప విశ్వాసం, విరక్తత్వం, విధేయత, శ్రమైకజీవితం, బాధ్యతాపాలన, వివేకం, వివేచనం, మితవ్యయం, మితభాషిత్వం, తననుతాను తగ్గించుకొనడం, దయ, దానధర్మగుణం, ఆపదలోనున్న వారిని ఆదుకోవడం, నిగర్వం, నిశ్చలత, నిరాడంబరత్వం ఇలా మంచి గుణాలన్నీ పుణికిపుచ్చుకున్న మహా మనిషి  పునీత యోసేపు గారు.

- గురుశ్రీ గోపు ప్రవీణ్ OFM

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer