నేపాల్ వరదలపై పోప్ లియో ఆవేదన
నేపాల్ వరదలపై పోప్ లియో ఆవేదన
నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా ప్రాణనష్టం, విధ్వంసం గురించి తెలిసి పరిశుద్ధ లియో XIV పాపు గారు తీవ్రంగా విచారం వ్యక్తం చేసారు.బాధితులకు తన ఆధ్యాత్మిక సాన్నిధ్యం ఉంటుందని హామీ ఇస్తూ, గల్లంతైన వందలాది మంది కోసం గాలిస్తున్న సహాయక బృందాల కోసం ప్రార్థించారు.
గురువారం పంపిన టెలిగ్రామ్లో, పరిశుద్ధ లియో XIV పాపు గారు మృతుల ఆత్మలకు దేవుని కరుణ లభించాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతిని తెలిపారు.
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల ఇప్పటివరకు 579 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.హిమాలయ హిమానీనదంలో కొంత భాగం కూలిపోవడం వల్ల ఈ విపత్తు సంభవించిందని భావిస్తున్నారు. దీనివల్ల నేపాల్-చైనా సరిహద్దు వెంబడి ఉన్న నదీ వ్యవస్థలోకి ఆకస్మికంగా నీటి ప్రవాహం దూసుకువచ్చింది. ఈ కూలిపోవడం వల్ల కలిగిన శక్తి ఎంత ఎక్కువగా ఉందంటే, దాని ఫలితంగా వచ్చిన ప్రకంపనలను మొదట్లో భూకంపంగా పొరపాటు పడ్డారని శాస్త్రవేత్తలు తెలిపారు.
అధికారిక నివేదికల ప్రకారం నేపాల్ మరియు చైనా సరిహద్దు పరిధిలో మరణాల సంఖ్య 579 కి చేరింది. అంతకుముందు తొలి రోజుల్లో ఈ సంఖ్య 350 కి పైగా నమోదైంది.విదేశీ పర్యాటకులు, యాత్రికులతో కలిపి సుమారు 1,924 మందికి పైగా ఇప్పటికీ ఆచూకీ లేకుండా పోయారు. ఈ వరదల్లో చిక్కుకుని దాదాపు 320 మందికి పైగా భారతీయులు గల్లంతయ్యారు.
నేపాల్ సైన్యం (Nepal Army) అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి 'త్రిశూలి 3ఎ హైడ్రోపవర్ ప్రాజెక్ట్' సొరంగంలో (Tunnel) చిక్కుకుపోయిన 350 మంది కార్మికులను ప్రాణాలతో కాపాడింది. వీరిలో 63 మంది భారతీయులు ఉన్నారు.
వరదలు సంభవించిన నదీ ప్రాంతంలో ఎగువన మట్టి, రాళ్లతో ఒక కృత్రిమ సరస్సు (Barrier Lake) ఏర్పడింది. ఇది ఏ క్షణమైనా బద్దలైతే దిగువ ప్రాంతాలకు మళ్లీ భారీ ముప్పు పొంచి ఉందనే ఆందోళనతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Article and Design BY M Kranthi Swaroop
