మరింత మంది యువతను చేరుకునేందుకు సహకరించండి: ఆసియా డిజిటల్ మిషనరీలకు WYD సియోల్ పిలుపు

మరింత మంది యువతను చేరుకునేందుకు సహకరించండి
సెప్టెంబర్ 12, 2026న క్వెజోన్ సిటీలో జరిగిన తొలి ఆసియా కతోలిక డిజిటల్ మిషనరీల సమ్మేళనంలో WYD సియోల్ 2027 గ్లోబల్ కమ్యూనికేషన్స్ విభాగాధిపతి స్టెఫానీ సన్ ప్రసంగించారు.

2027లో సియోల్‌లో జరగనున్న ప్రపంచ యువజన దినోత్సవానికి (WYD) దక్షిణ కొరియాకు ప్రత్యక్షంగా రాలేని లక్షలాది మంది యువతకు కూడా ఈ మహోత్సవ సందేశాన్ని చేరవేయడంలో సహకరించాలని ఆసియా డిజిటల్ మిషనరీలకు WYD సియోల్ 2027 నిర్వాహకులు పిలుపునిచ్చారు.

WYD సియోల్ 2027 స్థానిక నిర్వాహక కమిటీ గ్లోబల్ కమ్యూనికేషన్స్ బాధ్యతలను నిర్వహిస్తున్న స్టెఫానీ సన్ మాట్లాడుతూ, సాధ్యమైనంత ఎక్కువ మంది యువతను సియోల్‌కు తీసుకురావడం మాత్రమే తమ ముందున్న సవాలు కాదని, అక్కడికి రాలేని యువతకు కూడా ప్రపంచ యువజన దినోత్సవ అనుభవాన్ని చేరవేయడం ముఖ్యమని అన్నారు.

సెప్టెంబర్ 12న మెట్రో మనీలాలోని క్వెజోన్ సిటీలో జరిగిన తొలి ఆసియా కతోలిక డిజిటల్ మిషనరీల సమ్మేళనంలో ఆమె ప్రసంగించారు. దూరం, ప్రయాణ ఖర్చులు, ఇతర అడ్డంకుల కారణంగా 2027 ఆగస్టు 3 నుంచి 8 వరకు జరిగే ప్రపంచ యువజన దినోత్సవంలో అనేకమంది యువత ప్రత్యక్షంగా పాల్గొనలేరని ఆమె తెలిపారు.

“ఎంతమంది యువతను కొరియాకు తీసుకురాగలమన్నది మాత్రమే ప్రశ్న కాదు. ప్రపంచ యువజన దినోత్సవ అనుభవాన్ని ఇప్పటికే తమ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎంత దూరం వరకు తీసుకెళ్లగలమన్నదే అసలు ప్రశ్న” అని ఆమె అన్నారు.

సియోల్ నుంచి సందేశాన్ని స్వీకరించే ప్రేక్షకులుగా మాత్రమే తమను తాము చూడకుండా, తమ సొంత భాషలు, సంస్కృతులు, సమాజాల ద్వారా ప్రపంచ యువజన దినోత్సవ సందేశాన్ని ఇతరులకు చేరవేసే వారిగా డిజిటల్ మిషనరీలు తమ పాత్రను గుర్తించాలని ఆమె పిలుపునిచ్చారు.

ప్రత్యక్ష ప్రసారం పెద్ద సంఖ్యలో ప్రజలను చేరుకోగలదని, అయితే కష్టాల్లో ఉన్న ఒక యువకుడి పక్కన కూర్చోలేదని, స్థానిక భాషలో అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని, ఒక నిర్దిష్ట విచారణ లేదా సమాజంలోని వాస్తవికతలను అర్థం చేసుకోలేదని సన్ పేర్కొన్నారు. స్థానిక డిజిటల్ మిషనరీలు తాము సేవచేసే ప్రజల విశ్వాసాన్ని ఇప్పటికే పొందినందున, వారు ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించగలరని అన్నారు.

“ప్రజలను చేరుకోవడానికి, సాక్షులుగా నిలవడానికి మధ్య ఉన్న తేడా ఇదే” అని ఆమె అన్నారు.

యోహాను 16:33లోని “ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను” అనే వాక్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని సియోల్ ప్రపంచ యువజన దినోత్సవం జరగనుంది. సత్యాన్ని అన్వేషించడం, ప్రేమను ఆచరించడం, శాంతిని నిర్మించడం అనే మూడు నిర్దిష్ట ప్రతిస్పందనల ద్వారా కొరియా శ్రీసభ ఈ ధైర్యాన్ని అర్థం చేసుకుంటోందని సన్ వివరించారు.

విభజిత దేశంగా కొనసాగుతున్న కొరియాకు శాంతి అంశం ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉందని ఆమె పేర్కొన్నారు. 1953లో కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందంతో కొరియా ద్వీపకల్పంలో పోరాటం నిలిచిపోయినప్పటికీ, ఆ ఘర్షణను అధికారికంగా ముగించే శాంతి ఒప్పందం ఇప్పటికీ కుదరలేదని తెలిపారు.

క్రైస్తవులు ఎన్నడూ జనాభాలో మెజారిటీగా లేని సంస్కృతిలో నిర్వహించబడుతున్న తొలి ప్రపంచ యువజన దినోత్సవంగా సియోల్ 2027 నిలవనుందని ఆమె పేర్కొన్నారు. 1995లో మనీలాలో జరిగిన ప్రపంచ యువజన దినోత్సవం తరువాత ఆసియాలో నిర్వహించనున్న రెండో WYD ఇదని తెలిపారు.

ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచ యువజన దినోత్సవంలో డిజిటల్ మిషనరీల పాత్ర గణనీయంగా అభివృద్ధి చెందిందని సన్ వివరించారు. 2023 లిస్బన్ ప్రపంచ యువజన దినోత్సవంలో కతోలిక ప్రభావశీలులు, డిజిటల్ మిషనరీల కోసం తొలిసారిగా ప్రత్యేక దివ్యబలిపూజ నిర్వహించగా, 2025లో రోమ్‌లో జరిగిన జూబిలీ సందర్భంగా డిజిటల్ మిషన్ ఇతివృత్తంతో కతోలిక ప్రభావశీలులు సమావేశమయ్యారని తెలిపారు.

సియోల్ 2027లో ప్రపంచ యువజన దినోత్సవ వారంలో డిజిటల్ మిషనరీల కోసం ప్రత్యేక సమావేశం, ఉత్సవాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన నమోదు ప్రక్రియ 2026 అక్టోబర్‌లో ప్రారంభమవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

సియోల్ నుంచి అందించే కంటెంట్‌ను కేవలం స్వీకరించేవారిగా కాకుండా, WYD సమాచార ప్రసార వ్యూహాన్ని రూపొందించడంలో భాగస్వాములుగా ఉండాలని ఆసియా డిజిటల్ మిషనరీలను సన్ కోరారు. వివిధ దేశాలు, భాషల్లో ప్రజల విశ్వాసాన్ని పొందిన వ్యక్తులను గుర్తించడం, స్థానికంగా ఏ విధమైన సమాచార ప్రసారం సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడం, ఆసియా అంతటా చేరుకోగల కంటెంట్‌ను కలిసి రూపొందించడం నిర్వాహకుల లక్ష్యమని ఆమె వివరించారు.

ఆగస్టులో విడుదలైన WYD ఇతివృత్త గీతం ఈ విధానానికి ఒక ఉదాహరణ అని ఆమె అన్నారు. యువత ఆ గీతాన్ని పంచుకోవడం, నేర్చుకోవడం, తమ సొంత గీతంగా స్వీకరించడం ద్వారా అది మరింత విస్తృతంగా ప్రజలకు చేరుకుందని తెలిపారు.

అదేవిధంగా, 2024 నుంచి WYD సిలువ, మరియ మాత ప్రతిరూపం ఆసియాలోని వివిధ ప్రాంతాలతో పాటు దక్షిణ కొరియాలో ఒక మేత్రాసనం నుంచి మరో మేత్రాసనానికి ప్రయాణిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

“యాత్రికులు సియోల్‌కు వచ్చే వరకు సిలువ అక్కడే వేచి ఉండదు. అది వారి వద్దకే వెళుతుంది” అని సన్ అన్నారు.

ఇంకా ఎవరిని చేరుకోలేకపోతున్నాం, స్థానికంగా మాత్రమే చేయగలిగిన కార్యాలు ఏమిటి, సియోల్ నుంచి ఎలాంటి సహాయం అవసరం అనే అంశాలపై డిజిటల్ మిషనరీలు ఆలోచించాలని ఆమె కోరారు.

WYD 2027కు ముందే ఈ భాగస్వామ్యం ప్రారంభం కావాలని పేర్కొన్న సన్, 2027 ప్రారంభంలో ఆన్‌లైన్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రణాళికలు ఉన్నట్లు తెలిపారు.

ఆసియా డిజిటల్ మిషనరీల సమ్మేళనానికి బైబిల్ స్ఫూర్తిగా నిలిచిన అపొస్తలుల కార్యములు 4:20లోని వాక్యాన్ని గుర్తుచేస్తూ, “మేము చూసినవాటిని, విన్నవాటిని గురించి మాట్లాడకుండా ఉండలేము” అని ఆమె అన్నారు.

“ప్రతి ఒక్కరూ సియోల్‌కు ప్రయాణించలేకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, సాక్ష్యమివ్వాలి” అని స్టెఫానీ సన్ పిలుపునిచ్చారు.

Telugu Survey Popup Image