పునీత శ్రామిక జోజప్ప గారి పండుగ
పునీత శ్రామిక జోజప్ప గారి పండుగ
యోసేపు(జోజప్ప)గారు, కన్య మరియమ్మ భర్త, యేసుకు సాకుడు తండ్రి. అతను దావీదు వంశస్థుడు. పాలస్తీనా, గలిలీయ ప్రాంతములోని నజరేతు నివాసి. శ్రామికుడు, ధార్మికుడు. దయగలవాడు, దైవచిత్తానికి విధేయుడు. అతను నీతిమంతుడు అని మత్తయి 1:19లో చదువుచున్నాము. నీతిమంతుడనగా చట్టాన్ని ప్రేమించి, గౌరవించే వ్యక్తి. దేవుని చిత్తాన్ని పాటించేవాడు. యోసేపు గొప్ప విశ్వాసి, ప్రార్ధనాపరుడు. మరియ యేసులను మిక్కిలిగా ప్రేమించాడు. పవిత్రాత్మ వలన గర్భము దాల్చిన మరియమ్మను భార్యగా చేకున్నాడు. యేసును కన్న కుమారునిలా చూసుకున్నాడు. వారి సంరక్షణకు, పోషణకు నిత్యము తపన పడ్డాడు, ఎంతగానో శ్రమించాడు.
యోసేపు వృత్తి వండ్రంగి. యూద సంస్కృతిలో చేతపని గౌరవ ప్రదముగా భావించ బడేది. ఆ వృత్తితోనే తిరు కుటుంబాన్ని పోషించాడు. తన చేతి పనిద్వారా, నుదుటి చెమట ద్వారా, తిరు కుటుంబానికి అండగా ఉన్నాడు. తన శారీరక శ్రమద్వారా, దేవుని రక్షణ ప్రణాళికలో భాగస్తుడయ్యాడు. యోసేపు తన పనిని ఎంతగానో ఇష్టపడ్డాడు. ఎప్పుడుకూడా అలసటను చూపలేదు. ఒక విశ్వాసిగా, పనిని సద్గుణముగా, విలువైనదానిగా, గౌరవనీయమైనదిగా మార్చాడు. తన పనిలో ఎల్లప్పుడు సంతృప్తిని పొందాడు. ప్రతీ పని విలువైనదే. యోసేపు రెండురెట్లు పనిచేసాడు. వండ్రంగిగా, నిజాయితీగా సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించాడు. అలాగే యేసును పెంచడములో, మరియమ్మతో కలిసి పనిచేసాడు. ఈ ప్రపంచములో కుటుంబాన్ని పోషించడం, పిల్లలను పెంచడము రెండూ విలువైన పనులే! తండ్రిగా తన పాత్రను పరిపూర్ణముగా పోషించాడు.
యేసుకూడా, యోసేపునుండి వండ్రంగి పనిని నేర్చుకున్నారు. తన బహిరంగ ప్రేషితకార్య ప్రారంభము వరకు, యోసేపు పనిలో సహాయముగా ఉన్నారు. యేసు “వండ్రంగి కుమారుడు” అని మత్త 13:55లో, “యోసేపు కుమారుడు” అని లూకా 3:23; 4:32; యోహాను 1:45; 6:42లో పిలువ బడినాడు. యేసు “వండ్రంగి” గా మార్కు 6:3లో పిలువ బడినాడు.
-Fr praveen Gopu
by M kranthi Swaroop