మాదకద్రవ్యాల వ్యసనంతో దెబ్బతిన్న జీవితాలను పునరుద్ధరిస్తూ వారధులు నిర్మిస్తున్న శ్రీలంక చెరసాల సేవ

చెరసాల సే
జకార్తాలో జరుగుతున్న FABC ప్లీనరీ సమావేశం "సినడల్ పరివర్తనకు పిలుపు – ఆసియాలో వారధులు మరియు వారధుల నిర్మాణకర్తలుగా ఉండే శ్రీసభ సేవ" అనే అంశంపై ఆలోచనలు సాగిస్తున్న ఈ సందర్భంగా, శ్రీలంకలోని చవనోడ్ సిసిస్టర్స్ అఫ్ ది క్రాస్ సంఘం నిర్వహిస్తున్న చెరసాల సేవ వారధుల నిర్మాణానికి ఒక ఆచరణాత్మక సాక్ష్యంగా నిలుస్తోంది.

మాదకద్రవ్యాల వ్యసనంతో దెబ్బతిన్న జీవితాలను పునరుద్ధరిస్తూ వారధులు నిర్మిస్తున్న శ్రీలంక చెరసాల సేవ

Federation of Asian Bishops' Conferences (FABC) 12 వ ప్లీనరీ సమావేశం ఇండోనేషియాలోని జకార్తాలో "సినడల్ పరివర్తనకు పిలుపు – ఆసియాలో వారధులు మరియు వారధుల నిర్మాణకర్తలుగా ఉండే శ్రీసభ సేవ" అనే అంశంతో జరగనున్న నేపథ్యంలో, శ్రీలంకలోని చవనోడ్ లో సిస్టర్స్ అఫ్ ది క్రాస్ సంఘం నిర్వహిస్తున్న చెరసాల సేవ నిజమైన వారధుల నిర్మాణానికి ఒక స్పష్టమైన సాక్ష్యంగా నిలుస్తోంది. దేశంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వ్యసన సంక్షోభం మధ్య, ఈ కన్యస్త్రీలు ఖైదీలకు కరుణతో కూడిన సహచర్యం, ఆధ్యాత్మిక మార్గదర్శనం, పునరావాస సహాయం అందిస్తూ, దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడమే కాకుండా, మానవ గౌరవాన్ని కాపాడుతూ, బాధితులను వారి కుటుంబాలతో, సమాజంతో, దేవునితో మళ్లీ అనుసంధానించే సేవ చేస్తున్నారు.

సిస్టర్స్ అఫ్ ది క్రాస్ సంఘం ప్రొవిన్షియల్ కౌన్సిలర్ సిస్టర్ మౌరీన్ పియెరిస్, SCC అభిప్రాయం ప్రకారం, వారధుల నిర్మాణం ఆలకించడం ద్వారా ప్రారంభమవుతుంది.

శ్రీలంక మధ్య ప్రాంతంలోని కాండీలోని దుంబారా చెరసాలలో సేవలందిస్తున్న సిస్టర్ పియెరిస్ మాట్లాడుతూ, తమ సంఘం నిర్వహిస్తున్న చెరసాల సేవలో భాగంగా మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాల కారణంగా చెరసాలలో శిక్ష అనుభవిస్తున్న మహిళలను తరచూ కలుసుకుంటామని తెలిపారు. వారిలో చాలామంది మంచి కుటుంబాల నుంచి వచ్చినవారే కాకుండా, కొందరు ప్రముఖ కతోలిక విద్యాసంస్థల్లో చదువుకున్నవారని ఆమె పేర్కొన్నారు. దీనివల్ల మాదకద్రవ్యాల వ్యసనం సామాజిక, ఆర్థిక, మత పరమైన సరిహద్దులను దాటి ప్రతి వర్గాన్నీ ప్రభావితం చేస్తోందని ఆమె వివరించారు.

ప్రతి వారం కన్యస్త్రీలు ఖైదీలకు మతబోధన తరగతులు నిర్వహిస్తూ, వారితో కలిసి ప్రార్థిస్తూ, వారి జీవిత అనుభవాలను ఓపికగా ఆలకించడానికి సమయం కేటాయిస్తారు.

"ఈ కలయికలు మా కోసం వారధుల నిర్మాణానికి పవిత్రమైన సందర్భాలుగా మారాయి," అని సిస్టర్ పియెరిస్ అన్నారు.

అనేక మంది మహిళలు తమ దెబ్బతిన్న కుటుంబ సంబంధాలు, భావోద్వేగ గాయాలు, కుటుంబ విభేదాలు, ఒంటరితనం, స్నేహితుల ప్రభావం, తప్పు నిర్ణయాలు ఎలా వారిని మాదకద్రవ్యాల వ్యసనంలోకి నెట్టాయో పంచుకుంటారని ఆమె చెప్పారు. ప్రతి కథ వెనుక ఒకే కోరిక దాగి ఉంటుందని, అది ఆమోదం, అర్థం చేసుకోవడం, ప్రేమను పొందాలనే తపన అని ఆమె పేర్కొన్నారు.

ఒక వ్యక్తి నిజంగా తన మాట వినబడుతోందనే అనుభూతిని పొందినప్పుడే స్వస్థత ప్రారంభమవుతుందని తన సేవా అనుభవం తనకు నేర్పిందని సిస్టర్ పియెరిస్ చెప్పారు.

ప్రార్థన, పవిత్ర గ్రంథ ధ్యానం, మతబోధన, వ్యక్తిగత సహచర్యం ద్వారా అనేక మంది ఖైదీలు తమ వ్యక్తిత్వం వ్యసనం లేదా గత తప్పిదాలతో నిర్ణయించబడదని, తాము దేవుని బిడ్డలుగా గౌరవప్రదమైన జీవితానికి పిలువబడ్డామని తిరిగి గ్రహించడం ప్రారంభిస్తున్నారని ఆమె వివరించారు.

ఈ సేవ చెరసాల గోడలకే పరిమితం కాదు. కన్యస్త్రీలు ఖైదీల కుటుంబాలను సందర్శిస్తూ, సయోధ్యను ప్రోత్సహిస్తూ, సాధ్యమైనప్పుడల్లా వారి పిల్లల విద్యకు కూడా సహాయం చేస్తున్నారని సిస్టర్ పియెరిస్ తెలిపారు. ఈ విధంగా వ్యసనం కారణంగా దెబ్బతిన్న తల్లీబిడ్డల, కుమార్తెలు–తల్లిదండ్రుల, మాజీ ఖైదీలు–సమాజం మధ్య సంబంధాలను తిరిగి నిర్మించడానికి వారు కృషి చేస్తున్నారు.

అయితే, చెరసాల నుంచి విడుదలైన తర్వాత కూడా సవాళ్లు కొనసాగుతూనే ఉంటాయి.

చాలామంది మాజీ ఖైదీలు తిరిగి అదే పరిస్థితుల్లోకి వెళ్తుంటారు, అవే ఒకప్పుడు వారిని వ్యసనంలోకి నెట్టాయి. కుటుంబ సభ్యుల తిరస్కారం, ఉపాధి అవకాశాల కొరత, సమాజపు ముద్ర కారణంగా వారు తిరిగి సాధారణ జీవితంలో కలవడం చాలా కష్టంగా మారుతోంది.

"పునరుద్ధరణ అనేది వ్యక్తిగత సంకల్పం మీద మాత్రమే ఆధారపడదు," అని సిస్టర్ పియెరిస్ అన్నారు. "స్వస్థత వైపు సాగుతున్న వారి ప్రయాణంలో తోడుగా నడిచే సమాజాలు అవసరం."

ఈ చెరసాల సేవ, ఆలకించడం, భాగస్వామ్యం, సహచర్యం, ఐక్యత ద్వారా కలిసి నడవాలనే FABC సినడల్ పిలుపుకు ప్రతిరూపమని ఆమె వివరించారు. చెరసాల సేవ అనేది కేవలం ఖైదీలను సందర్శించడం మాత్రమే కాదని, సమాజం తరచూ మరచిపోయే వ్యక్తులతో కలిసి నడుస్తూ, వారికి తిరిగి నిరీక్షణను అందించడమేనని ఆమె పేర్కొన్నారు.

ఈ సేవకు కాండీ మేత్రాసనం తరఫున చెరసాల సేవ గురువుగా సేవలందిస్తున్న గురుశ్రీ జాన్ స్టీఫెన్ సహకరిస్తున్నారు. కాండీ పీఠాధిపతి వాలెన్స్ మెండిస్ ఆయనను ఖైదీలకు ఆధ్యాత్మిక సేవలందించేందుకు నియమించారు.

తన పాస్టోరల్ అనుభవాన్ని పంచుకుంటూ గురుశ్రీ స్టీఫెన్ మాట్లాడుతూ, అనేక మంది ఖైదీలు లోతైన భావోద్వేగ గాయాలతో జీవిస్తున్నప్పటికీ, దేవుని వాక్యాన్ని స్వీకరించేందుకు ఎంతో మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉంటారని చెప్పారు.

ప్రార్థన, దివ్య రహస్యాలు, నిరంతర పాస్టోరల్ సహచర్యం ద్వారా అనేక మంది ఖైదీలు నిజమైన పరివర్తనను అనుభవిస్తూ, క్షమాపణ, అంతరంగ స్వస్థత, జీవితంలో కొత్త దిశను వెతుకుతున్నారని ఆయన తెలిపారు.

"దేవుని కరుణకు అందనివారు ఎవరూ లేరు," అని గురుశ్రీ స్టీఫెన్ అన్నారు.

చెరసాల సేవ అనేది నిరీక్షణను పునరుద్ధరించే, మానవ గౌరవాన్ని ధృవీకరించే, ఖైదీలు నూతన లక్ష్యంతో తిరిగి సమాజంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధం చేసే సేవ అని ఆయన వివరించారు.

పెరుగుతున్న మాదకద్రవ్యాల వ్యసన సమస్యను ఏ ఒక్క సంస్థ మాత్రమే పరిష్కరించలేదని సిస్టర్ పియెరిస్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు, కుటుంబాలు, మతసంఘాలు, పౌర సమాజ సంస్థలు కలిసి నివారణ, పునరావాసం, తిరిగి సమాజంలో కలిసే ప్రక్రియను బలోపేతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

అలాగే చెరసాల సేవ, పాస్టోరల్ సహచర్యం, కుటుంబాలకు అందించే మద్దతు, పునరుద్ధరణ పొందుతున్న వ్యసన బాధితులను ఆహ్వానించే విచారణ సమాజాల ద్వారా శ్రీసభ పోషిస్తున్న పాత్రను కూడా ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఆసియా పీఠాధిపతులు "వారధులు మరియు వారధుల నిర్మాణకర్తలుగా" మారే తమ పిలుపుపై ఆలోచించేందుకు సిద్ధమవుతున్న ఈ సమయంలో, దుంబారా చెరసాలలో జరుగుతున్న ఈ సేవ ఆ లక్ష్యానికి ఒక ఆచరణాత్మక రూపమని సిస్టర్ పియెరిస్ పేర్కొన్నారు.

"ప్రతి సంభాషణ, ప్రతి ప్రార్థన, ప్రతి సహచర్యం, ప్రతి పునరుద్ధరించబడిన సంబంధం ఒక వారధిగా మారుతుంది — వ్యసనం నుంచి స్వస్థత వైపు, తిరస్కరణ నుంచి ఆమోదం వైపు, నిరాశ నుంచి నిరీక్షణ వైపు నడిపించే వారధిగా," అని ఆమె అన్నారు.

నిజమైన వారధుల నిర్మాణం గొప్ప కార్యక్రమాలతో ప్రారంభం కాదని, స్వస్థత, సయోధ్య, నూతన జీవితం వైపు మరొక వ్యక్తితో కలిసి నడవాలనే సిద్ధతతోనే ప్రారంభమవుతుందని తన అనుభవం స్పష్టంగా తెలియజేస్తోందని ఆమె ముగించారు.