కార్డినల్ పూల అంతోని ఆసియా పీఠాధిపతులకు పిలుపు: నిజమైన నాయకత్వం అధికారంలో కాదు, సేవలో ఉంది
దేవుని ప్రజలకు నాయకత్వం వహించేందుకు పిలువబడిన పీఠాధిపతి గౌరవం లేదా అధికారాన్ని వెదకకుండా, వినయంతో, త్యాగస్ఫూర్తితో సేవ చేయాలని భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు కార్డినల్ పూల అంతోని జకార్తాలో జరుగుతున్న Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆసియా పీఠాధిపతులకు పిలుపునిచ్చారు.
జూలై 25న అపొస్తలుడైన పరిశుద్ధ యాకోబు పండుగ సందర్భంగా జరిగిన పవిత్ర దివ్యబలిలో ప్రసంగించిన కార్డినల్ పూల అంతోని, లోక సంబంధమైన అధికారం, ప్రతిష్ఠలపై ఆధారపడిన నాయకత్వానికి బదులుగా, క్రీస్తు స్వయంత్యాగ ప్రేమలో పాతుకుపోయిన నాయకత్వాన్ని ఆసియా శ్రీసభ నాయకులు స్వీకరించాలని కోరారు.
యాకోబు, యోహానుల తల్లి తన కుమారులకు దేవుని రాజ్యంలో గౌరవ స్థానాలు ఇవ్వాలని యేసును కోరిన సువార్త ఘట్టాన్ని ప్రస్తావిస్తూ, గుర్తింపు, భద్రత కోసం తపనపడడం మానవ సహజ స్వభావమేనని కార్డినల్ పూల అంతోని అన్నారు. అయితే యేసు తన శిష్యులను నాయకత్వం యొక్క నిజమైన అర్థం వైపు మళ్లించారని ఆయన వివరించారు.
"అపొస్తలిక బాధ్యత అనేది ఆక్రమించాల్సిన సింహాసనం కాదు; స్వీకరించాల్సిన పాత్ర. అది ముందుగా కనిపించే పదవి గురించి కాదు; క్రీస్తు స్వయంత్యాగంలో భాగస్వాములవడం గురించి," అని కార్డినల్ పూల అంతోని అన్నారు.
"నేను త్రాగబోయే పాత్రను మీరు త్రాగగలరా?" అని యేసు అడిగిన ప్రశ్నను ప్రస్తావిస్తూ, శ్రీసభలో నిజమైన నాయకత్వం త్యాగం, సేవల నుండి విడదీయరానిదని ఆయన పీఠాధిపతులకు గుర్తుచేశారు.
"మీలో గొప్పవాడిగా ఉండదలచినవాడు మీ సేవకుడై ఉండాలి" అనే క్రీస్తు బోధనను ఉదహరిస్తూ, వినయంతో నిర్వహించినప్పుడే పీఠాధిపతి అధికారానికి నిజమైన సువార్త సాక్ష్యం లభిస్తుందని కార్డినల్ పూల అంతోని నొక్కిచెప్పారు.
అధికారం అనేది మూలంగా సేవేనని పరిశుద్ధ పిత ఫ్రాన్సిస్ బోధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, పీఠాధిపతి కేవలం శ్రీసభ సంస్థలను నిర్వహించే వ్యక్తిగా కాకుండా, దేవుని ప్రజలకు సన్నిహితంగా ఉండేందుకు పిలువబడ్డాడని ఆయన అన్నారు. Evangelii Gaudium పత్రాన్ని ఉటంకిస్తూ, శ్రీసభ బయటకు వెళ్లి, ప్రజలతో కలిసి నడుస్తూ, ఫలాలు పండిస్తూ, సువార్తను ప్రకటించడంలో ఆనందించాలని ఆయన గుర్తుచేశారు.
"ఆసియా శ్రీసభకు నాయకత్వం అంటే దూరం నుంచి పర్యవేక్షించడం కాదు; సువార్త ప్రచార సాన్నిహిత్యం. స్వకేంద్రిత పరిపాలన కాదు; సేవాపర పరివర్తన," అని ఆయన చెప్పారు.
శ్రీసభ నాయకులు హోదా కోసం పోరాడటం, పదవులను కాపాడుకోవడం, ప్రభావాన్ని విజయంగా భావించడం వంటి ప్రలోభాలకు లోనుకాకూడదని కార్డినల్ పూలా హెచ్చరించారు. "సేవ చేయించుకోవడానికి కాదు, సేవ చేయడానికి మరియు అనేకుల విమోచన కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చిన" క్రీస్తునే ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
మత వైవిధ్యంతో కూడిన సమాజంలో అల్పసంఖ్యాకులుగా జీవిస్తున్న ఆసియా కతోలికులు పేదరికం, వలసలు, ఆర్థిక అసమానతలు, రాజకీయ ఘర్షణలు, పర్యావరణ విధ్వంసం, యువత సవాళ్లు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సందేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఆయన పేర్కొన్నారు.
"శ్రీసభ క్రీస్తును అధికారంతో ప్రకటించదు; వినయపూర్వకమైన సేవ, హృదయపూర్వక సంభాషణ, ధైర్యమైన సాక్ష్యం, కరుణతో కూడిన సాన్నిహిత్యం ద్వారా ప్రకటిస్తుంది," అని ఆయన అన్నారు.
పరిశుద్ధ పౌలు కోరింథీయులకు రాసిన రెండవ పత్రికను ప్రస్తావిస్తూ, పీఠాధిపతులను "మట్టిపాత్రలు"గా కార్డినల్ పూలా అభివర్ణించారు. అమూల్యమైన సువార్త నిధి వారికి అప్పగించబడిందని ఆయన అన్నారు.
"పీఠాధిపతి తాను మట్టిపాత్ర కాదని నటించడానికి పిలువబడలేదు. తన బలహీనత ద్వారానే ఆ నిధి ప్రకాశించేలా జీవించడానికి పిలువబడ్డాడు," అని ఆయన చెప్పారు.
మానవ బలహీనతలోనే దేవుని కృప ప్రత్యక్షమవుతుందని, పీఠాధిపతుల సేవ వ్యక్తిగత సామర్థ్యంపై కాకుండా ప్రభువు శక్తిపై ఆధారపడి ఉందని ఆయన వివరించారు.
కార్డినల్ పూలా తన సందేశాన్ని శ్రీసభ సినడల్ ప్రయాణంతో అనుసంధానిస్తూ, సినడాలిటీ అనేది పరిశుద్ధాత్మ స్వరాన్ని మరింత శ్రద్ధగా ఆలకించి, దేవుని ప్రజలతో కలిసి విశ్వాసపూర్వకంగా నడిపించే నిరంతర పరివర్తన ప్రక్రియ అని పేర్కొన్నారు.
చివరగా, పీఠాధిపతులు మూడు ముఖ్యమైన ప్రాధాన్యాలను స్వీకరించాలని ఆయన కోరారు—పేదలు, సమాజ అంచుల్లో ఉన్నవారి బాధల్లో పాలుపంచుకోవడం; వినయంతో సువార్తను ప్రకటించడం; సంస్కృతులు, ఇతర మతాలు, సమాజ అంచుల్లో ఉన్నవారితో సంభాషణ ద్వారా వారధుల నిర్మాణకర్తలుగా మారడం.
"అధికారానికి కుడివైపు, ఎడమవైపు కూర్చోవడానికి మనం పిలువబడలేదు. సేవకుని మార్గంలో నడవడానికి పిలువబడ్డాం. మట్టిపాత్రను కాపాడుకోవడానికి కాదు; అందులోని నిధిని వెలుగులోకి తేవడానికి పిలువబడ్డాం. గోపురాలు నిర్మించడానికి కాదు; వారధులను నిర్మించడానికి పిలువబడ్డాం," అని కార్డినల్ పూల అంతోని తన సందేశాన్ని ముగించారు.