పాకిస్తాన్ డొమినికన్ శాంతి ఉద్యమకారుడు: వారధుల నిర్మాణం ప్రజల స్థాయిలోనే ప్రారంభం కావాలి

గురుశ్రీ జేమ్స్ చన్నన్, OP
పాకిస్తాన్‌లో మతాంతర సంభాషణ, శాంతి నిర్మాణ రంగాల్లో అగ్రగామిగా గుర్తింపు పొందిన గురుశ్రీ జేమ్స్ చన్నన్, OP. (ఫోటోలు: Catholics in Pakistan)

Federation of Asian Bishops' Conferences (FABC) ప్లీనరీ సమావేశం జూలై 20–26 తేదీల్లో ఇండోనేషియాలోని జకార్తాలో "సినడల్ స్ఫూర్తికి పిలుపు – ఆసియాలో వారధులు మరియు వారధుల నిర్మాణకర్తలుగా ఉండే శ్రీసభ సేవ" అనే అంశంతో జరగనున్న నేపథ్యంలో, పాకిస్తాన్‌కు చెందిన ఒక డొమినికన్ గురువు మాట్లాడుతూ, నిజమైన వారధుల నిర్మాణం ప్రజల స్థాయిలోనే ప్రారంభం కావాలని, అక్కడే భిన్న మతాలకు చెందిన ప్రజలు తమ నిత్యజీవితంలో ఒకరినొకరు కలుసుకుని పరస్పర అవగాహన పెంపొందించుకుంటారని అన్నారు.

గురుశ్రీ జేమ్స్ చన్నన్, OP, పాకిస్తాన్‌లో మతాంతర సంభాషణ, శాంతి నిర్మాణ రంగాల్లో అగ్రగామిగా గుర్తింపు పొందారు. నాలుగు దశాబ్దాలకుపైగా ఆయన ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ఆ దేశంలో శాంతి నెలకొల్పేందుకు, క్రైస్తవ-ముస్లిం సంబంధాలను బలోపేతం చేయడానికి విశేషంగా కృషి చేస్తున్నారు.

ఆయన ఏడు సంవత్సరాల పాటు FABC Office of Ecumenical and Interreligious Affairs (OEIA) కార్యనిర్వాహక కార్యదర్శిగా సేవలందించారు. అలాగే పాకిస్తాన్ కతోలిక పీఠాధిపతుల జాతీయ క్రైస్తవ-ముస్లిం సంబంధాల కమిషన్ కార్యనిర్వాహక కార్యదర్శిగా 17 సంవత్సరాలు పనిచేశారు. అదనంగా, వాటికన్‌లోని మాజీ Pontifical Council for Interreligious Dialogueకు సలహాదారుగానూ సేవలందించారు.

క్రైస్తవ-ముస్లిం సంబంధాల అభివృద్ధికి నాలుగు దశాబ్దాలకు పైగా చేసిన సేవా అనుభవాన్ని ఆధారంగా చేసుకుని, ఆయన రేడియో వెరిటాస్ ఆసియా (RVA)కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:

మీ నిత్య సేవలో "వారధుల నిర్మాణం" అంటే ఏమిటి?

"ప్రజల మధ్య వారధుల నిర్మాణం అంటే ప్రతిరోజూ సాన్నిహిత్యం, సహనం, చురుకైన భాగస్వామ్యంతో కూడిన సేవ. ఏడు సంవత్సరాల పాటు FABC మతసామరస్య మరియు మతాంతర సంభాషణ కార్యాలయంలో సేవలందించిన అనుభవంతో, రానున్న ప్లీనరీ సమావేశం అంశం నాకు ఎంతో అర్థవంతంగా అనిపిస్తోంది. లాహోర్‌లోని మా పీస్ సెంటర్ ద్వారా ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు, యువ నాయకులు కలిసి పరస్పర గౌరవాన్ని పెంపొందించుకుంటున్నారు. స్థానిక ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు, మా మతాంతర నెట్‌వర్క్‌ల ద్వారా ఇమామ్‌లు, స్థానిక నాయకులతో కలిసి పరిస్థితులు విషమించకముందే పరిష్కార మార్గాలను అన్వేషిస్తాము."

శాంతి నిర్మాణానికి మీ జీవితాన్ని అంకితం చేయడానికి మీకు ప్రేరణ ఏమిటి?

"1977లో, సెమినరీ విద్యార్థిగా ఉన్నప్పుడు, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న పాకిస్తాన్‌లో నా ప్రజలకు సేవ చేయాలనే లోతైన పిలుపును నేను అనుభవించాను. నిజమైన వారధులు నిర్మించాలంటే ఇస్లాం గురించి లోతుగా తెలుసుకోవాలని భావించి, ఉపవాసం, మక్కా యాత్ర వంటి అంశాలపై పరిశోధన చేస్తూ ఆరు సంవత్సరాలు ఇస్లాం అధ్యయనం చేశాను. అనంతరం రోమ్‌లోని Pontifical Institute for Arabic and Islamic Studiesలో అరబిక్, ఇస్లామిక్ అధ్యయనాల్లో లైసెన్షియేట్ పట్టా పొందాను."

"ఆ పునాది వల్లనే తరువాత వాటికన్‌లో మతాంతర సంభాషణకు సలహాదారుగా సేవ చేయడం, అలాగే పాకిస్తాన్ జాతీయ క్రైస్తవ-ముస్లిం సంబంధాల కమిషన్‌లో 17 సంవత్సరాలు పనిచేయడం వంటి అవకాశాలు లభించాయి."

గురుశ్రీ జేమ్స్ చన్నన్, OP
గురుశ్రీ జేమ్స్ చన్నన్, OP, రేడియో వెరిటాస్ ఆసియా (RVA) ప్రతినిధి యూసుఫ్ బెంజమిన్‌తో మాట్లాడుతూ, క్రైస్తవ-ముస్లిం సంబంధాల అభివృద్ధికి నాలుగు దశాబ్దాలకు పైగా చేసిన సేవా అనుభవాన్ని ఆధారంగా చేసుకుని తన విలువైన ఆలోచనలను పంచుకున్నారు.

లోతైన విభేదాలు, పునరావృతమవుతున్న హింస మధ్య కూడా శాంతి నిర్మాణాన్ని ఎలా కొనసాగిస్తున్నారు?

"మత ఛాందసవాదం, ఇళ్లపై దాడులు, క్రైస్తవ బాలికలపై హింస, న్యాయం నిరాకరణ వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాము. అయినప్పటికీ మేము శాంతి మార్గాన్నే ఎంచుకుంటున్నాము. ద్వేషపు గోడలను ఎదుర్కొనేందుకు శాంతి కేంద్రాలను స్థాపించడం, మతాంతర కమిషన్‌లను బలోపేతం చేయడం, స్థానిక అధికారులతో సన్నిహితంగా పనిచేయడం ద్వారా విశ్వాసానికి శాశ్వతమైన పునాదులు వేస్తున్నాము. నేను ఎప్పుడూ ఆశను వదులుకోకూడదని నేర్చుకున్నాను. అత్యంత చీకటి సమయాల్లో కూడా చీకటిని శపించడం కంటే నిరీక్షణ అనే ఒక దీపాన్ని వెలిగించాలి."

సమాజాల మధ్య నిజమైన విశ్వాసాన్ని పెంపొందించడానికి అత్యవసరమైన చర్య ఏమిటి?

"అల్పసంఖ్యాక వర్గాలను ప్రభావితం చేస్తున్న వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించాలి. మత స్వేచ్ఛపై పరిమితులు, సామూహిక హింస, బలవంతపు మతమార్పిడులు, బలవంతపు వివాహాలు, దైవదూషణ చట్టాల దుర్వినియోగం వంటి అంశాలపై చర్యలు తీసుకోవాలి. అయితే ఇవి కేవలం నాయకుల ప్రకటనలతో పరిష్కారం కావు. ప్రజల స్థాయిలో క్రమబద్ధమైన సంభాషణలు, సంఘాల మధ్య నిరంతర సమావేశాలు అవసరం. ప్రజలు ముఖాముఖిగా కలిసినప్పుడు అపోహలు తొలగి పరస్పర గౌరవం పెరుగుతుంది."

తరువాతి తరం వారధుల నిర్మాణకర్తలను ఎలా తీర్చిదిద్దుతున్నారు?

"పాకిస్తాన్ యువతకు మార్గదర్శనం చేయడం నా ముఖ్య ప్రాధాన్యం. సెమినార్లు, జాతీయ సదస్సులు, అధ్యయన పర్యటనల ద్వారా వారిని ఇతర మతాల నాయకులతో ప్రత్యక్షంగా కలిసేలా చేస్తున్నాము. నా రచనల ద్వారా కూడా వారిని ప్రోత్సహిస్తున్నాను. సంభాషణ నిజమైన మార్పును తీసుకురాగలదని నా జీవితంతో చూపిస్తూ, ఈ సేవను వారు కొనసాగించేలా స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నాను."

FABC భవిష్యత్ ప్రయాణంపై మీ ఆకాంక్షలు ఏమిటి?

"ఆసియా అంతటా మతాంతర సంభాషణను మరింత విస్తరించాలి. క్రైస్తవులు అల్పసంఖ్యాకులుగా ఉన్న దేశాల్లో సంభాషణ అనేది ఒక ఎంపిక కాదు; శాంతియుత సహజీవనానికి అది అత్యవసరమైన పాస్టోరల్ అవసరం. అలాగే శాంతి నిర్మాణంలో యువతను మరింత చురుకుగా భాగస్వాములను చేసి, రేపటి వారధుల నిర్మాణకర్తలుగా వారిని తీర్చిదిద్దాలి."

"చివరగా, మానవ గౌరవం, న్యాయం, ఉమ్మడి మేలు గురించి శ్రీసభ బోధనలను నిరంతరం పంచుకుంటూ, అవి మన సమాజాల్లో ఆచరణాత్మక జీవన విధానంగా మారేలా కృషి చేయాలి."