"మహిళలకు శ్రీసభలో తగిన స్థానం కల్పించాలి" – FABC ప్లీనరీ సమావేశానికి ముందు ఆసియా పీఠాధిపతులకు భారతీయ జేసుసభ గురువు పిలుపు

గురుశ్రీ సెడ్రిక్ ప్రకాష్, SJ
పశ్చిమ భారతదేశంలోని గుజరాత్ జేసుసభ ప్రాంతానికి చెందిన గురుశ్రీ సెడ్రిక్ ప్రకాష్, ఆసియాలోని శ్రీసభ నాయకులు మహిళల సాధికారతను FABC ప్లీనరీ సమావేశం ప్రోత్సహిస్తున్న సినడల్ పరివర్తనలో ఒక ప్రధాన అంశంగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.

ఇండోనేషియాలోని జకార్తాలో జూలై 20–26 తేదీల్లో జరుగుతున్న Federation of Asian Bishops' Conferences (FABC) 12 వ ప్లీనరీ సమావేశం కోసం ఆసియా నలుమూలల నుంచి కతోలిక పీఠాధిపతులు సమావేశమవుతున్న సందర్భంగా, భారతదేశానికి చెందిన ఒక జేసుసభ గురువు, సినడల్ పరివర్తనలో మహిళల సాధికారతకు కేంద్రస్థానం కల్పించాలని శ్రీసభ నాయకత్వానికి పిలుపునిచ్చారు.

ప్లీనరీ సమావేశానికి ముందు రేడియో వెరిటాస్ ఆసియా (RVA)తో మాట్లాడుతూ, గురుశ్రీ సెడ్రిక్ ప్రకాష్, SJ, నిజంగా సినడల్ స్ఫూర్తితో, సువార్త ప్రకటనా దృక్పథంతో కూడిన శ్రీసభగా మారాలంటే, ఆసియాలోని శ్రీసభ అంతరంగ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

పశ్చిమ భారతదేశంలోని గుజరాత్ ప్రాంత జేసుసభకు చెందిన గురుశ్రీ సెడ్రిక్ ప్రకాష్, SJ, మానవ హక్కులు, సయోధ్య, శాంతి రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఉద్యమకారుడు, రచయిత, శిక్షకుడు. 2021 అక్టోబరులో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు  సినడల్ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి, భారతదేశంలో సినడాలిటీపై అవగాహన పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ అంశంపై ఆయన విస్తృతంగా రచనలు చేశారు. ఆయన వ్యాసాలు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కతోలిక పత్రికలు, ఆన్‌లైన్ వేదికల్లో ప్రచురితమయ్యాయి. సినడాలిటీపై నిర్వహించిన అనేక సెమినార్లు, సదస్సులు, వెబినార్లలో ఆయన ప్రసంగించారు. అలాగే, సినడ్ అధికారిక పత్రాల ఆధారంగా, నేటి శ్రీసభకు సినడాలిటీ యొక్క అర్థం, ప్రాముఖ్యత, అవసరాన్ని వివరిస్తూ అనేక ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.

FABC ప్లీనరీ సమావేశానికి సంబంధించిన ముఖ్య ప్రాధాన్యాంశాల్లో ఒకటిగా, "మహిళలకు శ్రీసభలో తగిన స్థానం కల్పించాలి. పితృస్వామ్య భావజాలంలోని ప్రతి రూపాన్ని నిర్మూలించాలి," అని గురుశ్రీ ప్రకాష్ పేర్కొన్నారు.

నిజమైన సినడల్ పరివర్తన అనేది కేవలం నిర్మాణాత్మక సంస్కరణలతో సాధ్యంకాదని ఆయన అన్నారు. సువార్త వెలుగులో వినడానికి, వివేచించడానికి, మార్పును ఆహ్వానించడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని ఆయన వివరించారు.

"సినడల్ పరివర్తనను నిజంగా కోరుకుంటే, ఆసియాలోని శ్రీసభ ముందుగా తన అంతరంగాన్ని పరిశీలించుకోవాలి, తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి," అని ఆయన అన్నారు.

సినడాలిటీ అర్థాన్ని వివరిస్తూ, ఈ పదం గ్రీకు భాషలోని 'సినోడోస్' అనే పదం నుంచి వచ్చిందని, దాని అర్థం "కలిసి ప్రయాణించడం" అని గురుశ్రీ ప్రకాష్ చెప్పారు. శ్రీసభ సేవ అనేది వ్యక్తిగత నిర్ణయాలపై కాకుండా, సమిష్టి వివేచనపై ఆధారపడినదని ఆయన వివరించారు.
 

పేదల స్వరాన్ని మరింత శ్రద్ధగా ఆలకించడం, సామాన్య విశ్వాసులను సాధికారులుగా తీర్చిదిద్దడం, మంచి సంకల్పం కలిగిన ప్రతి ఒక్కరితో సంభాషణను ప్రోత్సహించడం, సృష్టిని పరిరక్షించడం, అన్యాయం, దోపిడీ, హింస, వివక్షలపై స్పష్టమైన వైఖరిని తీసుకోవడం ద్వారా శ్రీసభ నిజమైన ఆలకించే సమాజంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు.

గురుత్వాధిపత్య భావజాలం (Clericalism) పట్ల ఆయన హెచ్చరిక వ్యక్తం చేస్తూ, నిజమైన సినడల్ శ్రీసభ నిర్మాణానికి సామాన్య విశ్వాసుల విస్తృత భాగస్వామ్యం అత్యంత అవసరమని అన్నారు.

ఇటీవల ముగిసిన ప్రపంచ సినడాలిటీపై సినడ్ ను ప్రస్తావిస్తూ, శ్రీసభ తన సేవలోని ప్రతి అంశంలో వ్యక్తిగతంగానూ, సమిష్టిగానూ పరివర్తన చెందుతూ సినడల్ శ్రీసభగా మారాలని ఆ సినడ్ స్పష్టంగా నొక్కిచెప్పిందని ఆయన గుర్తుచేశారు.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి మాటలను ఉటంకిస్తూ, "సినడాలిటీ అంటే కలిసి నడవడం. అలా నడిచేటప్పుడు పరిశుద్ధాత్మ ఏమి చెబుతున్నారో ఆలకిస్తాము; మార్పు అవసరాన్ని వినయంతో అంగీకరిస్తాము," అని గురుశ్రీ ప్రకాష్ అన్నారు.

అలాగే పరిశుద్ధ లియో పాపు గారు ఇటీవల విడుదల చేసిన 'Magnifica Humanitas' బోధనను ప్రస్తావిస్తూ, శ్రీసభలో సినడాలిటీ అంటే పారదర్శకత, జవాబుదారీతనం, ఉమ్మడి బాధ్యతలను ఆచరణలో పెట్టడం అని, శ్రీసభ నిర్మాణాలు తాను ప్రకటిస్తున్న విలువలను ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

గురుశ్రీ ప్రకాష్ అభిప్రాయం ప్రకారం, ఈ విలువలే శ్రీసభను ఉమ్మడి మేలు, సహకార భావం, ఉపాధికార సూత్రం (Subsidiarity), సామాజిక న్యాయం, సృష్టి సంరక్షణ వంటి లక్ష్యాల వైపు నడిపించాలి.

చివరగా, FABC ప్లీనరీ సమావేశం పరిశుద్ధాత్మ ప్రేరణను ఆలకించే ప్రవచనాత్మక ధైర్యాన్ని, నిజమైన సినడల్ పరివర్తనను స్వీకరించే సిద్ధతను, చెప్పేది ఆచరించే నిబద్ధతను ప్రదర్శించగలదా? అనే ప్రశ్నను ఆయన ముందుంచారు.

వారం రోజుల పాటు కొనసాగే FABC 12 వ ప్లీనరీ సమావేశంలో, ఆసియా నలుమూలల నుంచి వచ్చిన పీఠాధిపతులు పాల్గొని, ప్రాంతంలోని సామాజిక, సాంస్కృతిక, పాస్టోరల్ సవాళ్లకు స్పందిస్తూ, శ్రీసభలో ఐక్యత, భాగస్వామ్యం, సువార్త ప్రకటనా సేవలను మరింత బలోపేతం చేసే మార్గాలను పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వంలో వివేచించనున్నారు.