పాదువాపురి పునీత అంతోనివారి మహోత్సవము | June 13

పాదువాపురి పునీత అంతోనివారి మహోత్సవము | June 13 |
Happy Feast to All...
పునీత అంతోనివారు క్రీ.శ. 1195 ఆగుష్టు 15న, పోర్చుగల్ (అప్పట్లో స్పెయిను దేశములో భాగం)లోని లిస్బన్ నగరంలో, మార్టిన్, తెరెసా దంపతులకు జన్మించారు. పాత లిస్బనులోని కేథీధ్రలునందు (పెద్ద దేవాలయములో) జ్ఞానస్నానము పొంది “ఫెర్నాండో” అనే పేరుతో నామకరణం చేయబడ్డాడు.
వేదప్రచారము నిమిత్త౦ ఇటలీలోని పాదువాపురిలో నియమించబడ్డారు. అక్కడ అనేకమంది మారుమనసు కలిగేలా ప్రసంగించటమేకాక అనేక అద్భుత కార్యములు చేసి ఎంతో పేరు పొందారు. దేవుని కృపను నమ్ముకోవాలని, దేవుని క్షమాపణను కోరుకోవాలని బోధించాడు. ప్రజలలోనున్న గొడవలను ప్రశాంతముగా పరిష్కరించేవాడు. అనైతిక జీవితాన్ని ప్రజలు వీడేలా చేసాడు. తన ప్రసంగాలను వినడానికి గుంపులు గుంపులుగా వచ్చేవారు. పేదలపట్ల శ్రద్ధ కలిగి యుండేవారు. అవినీతి పనులకు వ్యతిరేకముగా బోధించాడు.
ప్రసంగిస్తూ తన తోటి సహోదరులతో తన స్నేహితుని ఎస్టేటులో ఉండేవారు. అక్కడ ఉండగా అనారోగ్యంతో అంతోనివారు తన మరణము సమీపించినదని తెలుసుకొని అక్కడనుండి పాదువాపురికి కొనిపొమ్మని కోరగా, పాదువాపురి చేరకముందే మార్గమధ్యలోనే ‘అర్చేల్ల’ అనే స్థలములో, పునీత క్లారమ్మ సభకు చెందిన మఠములో చివరిగా ప్రార్ధన స్తుతి గీతాలు పాడుతూ తన 36వ ఏటనే, 13 జూన్ 1231 సం.లో తుదిశ్వాస విడిచారు.
మరణించి సంవత్సరం పూర్తి కాకముందే అనగా 30 మే 1232వ సం.న, 9వ గ్రెగోరి పోపుగారు, అంతోనివారి పవిత్రతను, పవిత్ర జీవితాన్ని గుర్తిస్తూ పెంతకోస్తు పండుగ రోజున పునీతపట్టం కట్టారు. తన మరణము తరువాత, అద్భుతాల అంతోనివారిగా ప్రసిద్ది గాంచారు.
పునీత అంతోనివారి అంత్యక్రియలు మంగళవారం జరిగినందున, మొట్టమొదటిసారిగా అతని మద్యవర్తిత్వం వలన అద్భుతాలు మంగళవారం రోజున జరిగినందున, పాదువాపురి ప్రజలు మంగళవారమును ఆయనకు అంకితం చేసారు.
అంతోని వారి అద్భుతాలు:
చేపలకు సువార్తను బోధించడం (గొప్ప సువార్త బోధకులు)
గాడిద దివ్యసత్ప్రసాదమును మొకాలూని ఆరాధించడం (దివ్యసత్ప్రసాదము అత్యంత భక్తి – క్రీస్తు సాన్నిధ్యం)
కుంభ వర్షాన్ని ఆపడం
మరణించిన ఒక వ్యక్తిని సజీవముతో లేపడం
పోయిన రొట్టెల పెట్టె తాళము అంతోని వారు అద్భుత రీతిన తెరచుట; రొట్టెలు పంచుట (అంతోనివారి బ్రెడ్)
అంతోనివారిని చూసి దుష్టాత్మలు భయపడేవి (విశ్వాసము, ప్రార్ధన)
దివ్యవెలుగులో దివ్యబాలయేసు దర్శనం
అంతోని వారి నాలుక అద్భుతరీతిన అలాగే ఉండటం
దేవుని దయ,మంచితనమును ఎరిగిన వ్యక్తి అంతోనివారు. శక్తివంతమైన ప్రసంగాల ద్వారా, తన జీవితాదర్శము ద్వారా, యేసును అనుసరించుటకు అనేకమందికి ప్రేరణగా నిలిచాడు.
- Fr. Praveen Gopu's Homilies and Reflections
It's purely Telugu content, Please turn off Translation
Please visit our website: www.rvasia.org
Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer