ఘనంగా విశాఖపురి మేరిమాత మహోత్సవము

ఘనంగా విశాఖపురి మేరిమాత మహోత్సవము | కొండగుడి పుణ్యక్షేత్రం

విశాఖ కొండగుడిలో అమలోద్భవి మాత మహోత్సవం ఘనంగా జరిగింది. సోమవారం నాడు వన్ టౌన్‌లోని చారిత్రాత్మక రాస్ హిల్ దేవాలయం (కొండ గుడి)లో భక్తి శ్రద్దలతో ప్రార్థనలు జరిగాయి.

విశాఖపురి మేరీ మాతా పండుగ ఉత్తరాంధ్రలో చాలా ప్రసిద్ధి చెందింది. మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా కన్నుల పండుగగా ఈ వేడుక జరిగింది. పండుగ రోజు అనగా డిసెంబర్ 8 న మాత విశ్వాసాలతో సంబంధం లేకుండా వివిధ మతాలకు చెందిన భక్తులు అధికసంఖ్యలో క్రైస్తవ సహోదరులతో కలసి ఈ పండుగలో పాల్గొన్నారు.

విశాఖ నగరం మరియు పొరుగు జిల్లాల నుండి మాత్రమే కాకుండా ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలనుండి నుండి కూడా భక్తులు ఆదివారం తెల్లవారుజామునే దేవాలయానికి చేరుకున్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలు తరలి వచ్చి పరమత సహనానికి ప్రతీకగా నిలిచారు. ప్రభు యేసుక్రీస్తుకు జన్మనిచ్చి, ప్రపంచాన్ని పునీతం చేసిన మేరీమాతను కనులారా చూడాలని భక్తులు గంటల కొద్దీ నిరీక్షించారు.

సోమవారం ఉదయం దేవాలయం వద్ద ఆంగ్లంలో, తెలుగులో వేర్వేరుగా దివ్య పూజ జరిపారు. ఉదయం 4.30గంటల నుంచి దివ్య పూజాబలిలు ప్రారంభమైనాయి. విశాఖ అతిమేత్రాసన అగ్రపీఠాధిపతులు మహా పూజ్య ఉడుమల బాల గారు ఉదయం కొండ పై గృహ దగ్గర 7.30గంటలకు ఇతర గురువులతో కలసి సమిష్టి దివ్య పూజాబలిని సమర్పించారు.

మధ్యాహ్నం పాతపోస్టాఫీస్ వద్ద ఉన్న సెయింట్ అలోసిస్ పాఠశాల నుంచి అధికసంఖ్యలో భక్తులు మేరీమాత స్వరూపంతో ప్రదక్షిణగా కొండపై ఉన్న ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు.ఆద్యంతం కన్నుల పండుగగా ఈ వేడుక జరిగింది.

మేరీమాతను దర్శించుకొని కొవ్వొత్తులు వెలిగించిన భక్తులు ప్రార్ధనల్లో పాల్గొన్నారు. పుణ్యక్షేత్ర డైరెక్టర్ గురుశ్రీ కొండల జోసెఫ్ పండుగకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.

 

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer