ఆఫ్రికా యువతకు వీడియో సందేశాన్ని పంపిన పోప్
విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగుతున్న పశ్చిమ ఆఫ్రికా యువతను పోప్ లియో ప్రోత్సహించారు.
యుద్ధాలు, సంఘర్షణలతో సతమతమవుతున్న ప్రపంచంలో ప్రేమ, న్యాయం, శాంతి స్థాపకులుగా జీవించాలని పోప్ వారికి పిలుపునిచ్చారు.
ఘానా రాజధాని అక్రాలో తొలిసారిగా నిర్వహిస్తున్న పశ్చిమ ఆఫ్రికా యువజన దినోత్సవాలకు హాజరైన వేలాది మంది యువతను ఉద్దేశించి పోప్ లియో ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో వీడియో సందేశాన్ని పంపించారు.
సెప్టెంబర్ 7 నుంచి 12 వరకు జరుగుతున్న ఈ కార్యక్రమానికి "ధైర్యంగా ఉండండి" పశ్చిమ ఆఫ్రికాలో శాంతి, నిరీక్షణకు కర్తలుగా, ప్రోత్సాహకులుగా ఉండండి అనే నినాదాన్ని ఎంపిక చేశారు.
పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ పీఠాధిపతుల సమాఖ్య (RECOWA) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
తమ పాస్టరల్ ప్రాధాన్యతల్లో యువతకు కేంద్ర స్థానం కల్పించిన 16 దేశాల పీఠాధిపతులను పోప్ అభినందించారు.
మీరు పాల్గొంటున్న ఈ యువజన దినోత్సవ కార్యక్రమంలో... విశ్వాసంలో ఎదగడానికి, ఇతరులతో సాన్నిహిత్యంగా ఉండడానికి,ఇతరరులను స్వాగతించేందుకు సిద్ధంగా ఉండడం వంటి విలువలతో మరింతగా సుసంపన్నం కావడానికి సహాయపడతాయని నేను నమ్ముతున్నాను అని పోప్అన్నారు.
యువత ఎదుర్కొంటున్న సందేహాలు, అనిశ్చితి, అభద్రత వంటి భారాలను పోప్ లియో ప్రస్తావించారు. ఇవి వారి భవిష్యత్ ప్రణాళికలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.
యువతలో ప్రతిభ, శక్తి, కలలు, ఆశలు సమృద్ధిగా ఉన్నాయని పోప్ అన్నారు. యువతే శ్రీసభకు, ప్రపంచానికి ఒక గొప్ప సంపద అని పేర్కొంటూ, ఆయన 16 వ బెనెడిక్ట్ పోప్ మాటలను ఉటంకించారు.
"కలిసి ప్రయాణించడం అంటే ఎవరిని తిరస్కరించకుండా, ఒంటరిగా వదిలివేయకుండా, వెలివేయబడకుండా చూడటం అని ఆయన అన్నారు. ప్రజలు, సంస్కృతులు, మతాల మధ్య వారధులు నిర్మించేవారిగా ఉండండి. అని వారిని ప్రోత్సహించారు
అక్రాలో సమావేశమైన యువతపై శ్రీసభకు విశ్వాసం ఉందని, వారి సద్భావనపై శ్రీసభ ఆధారపడుతోందని పోప్ చెప్పారు.
చివరగా, పశ్చిమ ఆఫ్రికా యువతను పోప్ లియో ఆశీర్వదించి కన్యామరియమ్మకు అప్పగిస్తూ తన వీడియో సందేశాన్ని ముగించారు.
