శాంతియుత జీవనానికి క్షమాపణే మార్గమన్న పోప్
సెప్టెంబర్ 13న సెయింట్ పీటర్స్ స్క్వేర్లో జరిగిన త్రికాల ప్రార్థనలో పోప్ లియో "క్షమాపణ" యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
క్రీస్తు మనలను క్షమించినట్లే, మనం కూడా ఇతరులను క్షమించాలని, అప్పుడే ద్వేషం, విభేదాలు, హింసను అధిగమించి శాంతి, ప్రేమను నెలకొల్పగలమని అన్నారు.
క్షమాపణ లేకపోతే మన హృదయాల్లో పగ, ఆరోపణలు, ప్రతీకార భావాలు పెరిగి సంబంధాలను దెబ్బతీస్తాయని, కుటుంబాలను విడదీస్తాయని హెచ్చరించారు.
క్షమాపణ మాత్రమే మనలను బంధనాల నుంచి విముక్తి చేసి, చీకటిగా మారిన జీవితంలోకి తిరిగి వెలుగును తీసుకువస్తుందని పోప్ చెప్పారు.
మత్తయి సువార్తలో పేతురు ఎన్నిసార్లు క్షమించాలో అడిగినప్పుడు, యేసు “ఏడుసార్లు కాదు, డెబ్బై ఏడుసార్లు” అని చెప్పిన విషయాన్ని పోప్ గుర్తుచేశారు.
బైబిల్లో.....ఏడు సంపూర్ణతకు సంకేతమని, అందువల్ల క్రైస్తవులు ఎలాంటి పరిమితి లేకుండా, కొలత లేకుండా క్షమించడానికి పిలువబడ్డారని వివరించారు.
ప్రేమ, క్షమాపణలే మన జీవితానికి పునాది అని, అదే ఇతరులతో కలిసి జీవించడానికి ఉత్తమమైన మార్గమని పోప్ అన్నారు.
యేసును తాను ఎరుగనని పేతురు తిరస్కరించినప్పటికీ, పునరుత్థానమైన క్రీస్తు అతనిని తిరిగి ప్రేమతో స్వీకరించి తనను అనుసరించమని పిలిచిన విషయాన్ని పోప్ ఉదాహరణగా చెప్పారు.
క్రీస్తు చూపిన ఈ క్షమించే, స్వస్థపరిచే ప్రేమ పేతురుకు తన అపోస్తలిక బాధ్యతను తిరిగి ధృవీకరించిందని తెలిపారు.
అందుకే కష్టమైనప్పటికీ మొదటి అడుగు వేసి ఎల్లప్పుడూ క్షమించేందుకు సహాయం చేయాలని, ద్వేషాన్ని జయించే ప్రేమ వెలుగును ధైర్యంగా పంచాలని కన్యమరియను ప్రార్థిద్దామని పోప్ లియో పిలుపునిచ్చారు.
