దేవుని వాక్యానికి ‘ఆశ్రయ వేదిక’గా మారండి: డిజిటల్ మిషనరీలకు ఐరిష్ ఫ్రాన్సిస్కన్ గురువు పిలుపు
డిజిటల్ మిషనరీలు తమ వ్యక్తిత్వం, దేవుడు ప్రసాదించిన ప్రతిభ, జీవిత అనుభవాల ద్వారా దేవుని కార్యం చేయడానికి అవకాశం కల్పిస్తూ, దేవుని వాక్యం ఇతరులను చేరుకునే “ఆశ్రయ వేదిక”గా మారాలని ఐర్లాండ్కు చెందిన ఫ్రాన్సిస్కన్ గురుశ్రీ కొలుంబా జోర్డన్, CFR, పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 11న క్వెజోన్ సిటీలోని రేడియో వెరితాస్ ఆసియ (RVA) ప్రధాన కార్యాలయంలో జరిగిన తొలి ఆసియా కతోలిక డిజిటల్ మిషనరీల సమ్మేళనం తొలి రోజు మధ్యాహ్న సమావేశంలో ఆయన ఆసియా నలుమూలల నుంచి వచ్చిన 100 మందికి పైగా కతోలిక డిజిటల్ సమాచార ప్రసారకులు, మిషనరీలను ఉద్దేశించి ప్రసంగించారు.
“అహం నుంచి నిజమైన సాక్ష్యం వైపు” అనే అంశంపై ఆయన తన సమావేశాన్ని నిర్వహించారు. డిజిటల్ మిషనరీలు తమను తాము ప్రచారం చేసుకోవడం, అందరి దృష్టిలో కనిపించాలనే భయాన్ని అధిగమించి, జీవముగల క్రీస్తువైపు ప్రజలను నడిపించే నిజమైన సాక్షులుగా మారాలని ఆయన సూచించారు.
Federation of Asian Bishops' Conferences Office of Social Communication (FABC-OSC), Radio Veritas Asia (RVA), కమ్యూనికేషన్ డికాస్టరీకి చెందిన Fully Present Network (FPN ) భాగస్వామ్యంతో ఈ సమ్మేళనం సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు జరిగింది. “ప్రభావశీలుల నుంచి సాక్షులుగా: ఆసియాలో డిజిటల్ సువార్త ప్రచారానికి సినడల్ మార్గం” అనేది సమ్మేళనం ఇతివృత్తం.
ఐర్లాండ్లోని లిమరిక్లో సేవచేస్తున్న రెన్యువల్ ఫ్రాన్సిస్కన్ గురువు అయిన గురుశ్రీ జోర్డన్, తన లిటిల్ బై లిటిల్ వీడియో పోడ్కాస్ట్తో పాటు డిజిటల్ సువార్త ప్రచారం, విశ్వాస నిర్మాణంలో చేస్తున్న సేవకు ప్రసిద్ధి చెందారు.
తాను డిజిటల్ కంటెంట్ రూపొందించడం ప్రారంభించిన సందర్భాలను గుర్తుచేసుకుంటూ, తన ముందున్న ప్రధాన ఆందోళనల్లో ఒకటి వ్యర్థ గర్వం, తన మిషన్ను తన గురించే చేసుకునే ప్రలోభం అని గురుశ్రీ జోర్డన్ చెప్పారు. ఈ పోరాటాన్ని పునీత బాప్తిస్మ యోహాను చెప్పిన “నేను తగ్గాలి, ఆయన ఎదగాలి” అనే మాటలతో అనుసంధానించారు.
అయితే, అహంకారానికి దూరంగా ఉండాలనే ప్రయత్నంలో దేవుడు ప్రసాదించిన ప్రతిభను దాచుకోవడం కూడా మరో ప్రమాదమని ఆయన హెచ్చరించారు.
“మీకు ఆ సామర్థ్యం ఉంటే, మీ ముందు ఒక కెమెరాను ఉంచగానే మీరు సహజంగా, ఉత్సాహంగా మారగలిగితే—అది అరుదైన వరం” అని ఆయన అన్నారు.
దీనికి పరిష్కారం మన వ్యక్తిత్వాన్ని తొలగించుకోవడం కాదని, మన వ్యక్తిత్వం ద్వారా దేవుడు కార్యం చేయడానికి అవకాశం కల్పించడమే అని ఆయన వివరించారు.
క్రైస్తవ సమాచార ప్రసారకుడు దేవుని వాక్యానికి ఒక రకమైన “ఆశ్రయ వేదిక”గా మారాలని గురుశ్రీ జోర్డన్ చెప్పారు. కన్య మరియను ఉదాహరణగా చూపిస్తూ, అవతార రహస్యాన్ని నెరవేర్చడంలో దేవుడు ఆమె మానవత్వం ద్వారా కార్యం చేశారని ఆయన గుర్తుచేశారు. అదే విధంగా ప్రతి మిషనరీ తన ప్రత్యేకమైన జీవిత అనుభవాలు, ప్రతిభ, వ్యక్తిత్వం ద్వారా సువార్తను ఇతరులకు అందించగలరని చెప్పారు.
“సువార్త ఎల్లప్పుడూ ఎవరో ఒకరి ద్వారా పలుకుతుంది” అని ఆయన అన్నారు.
అయితే నిజమైన సాక్ష్యం ఇతరులకు ఏమి చెప్పాలనే ప్రశ్నతో ప్రారంభం కాకుండా, సువార్త తనలోనే ఎలాంటి సవాలు విసురుతోందో స్వీకరించడం ద్వారా ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.
ఒకప్పుడు తన బోధనలో ఇతరులు ఏం మార్చుకోవాలో చెప్పడంపైనే ఎక్కువ దృష్టి పెట్టేవాడినని గురుశ్రీ జోర్డన్ గుర్తుచేశారు. ఒక తోటి ఫ్రాన్సిస్కన్ గురువు తనను ప్రశ్నిస్తూ, “దేవా, నేను వారికి ఏమి చెప్పాలని నీవు కోరుకుంటున్నావు?” అనే ప్రశ్నకు బదులుగా “దేవా, నాతో నీవు ఏమి చెబుతున్నావు?” అని అడగాలని సూచించారని తెలిపారు.
ఆ మార్పు తనను కేవలం ఇతరులకు సూచనలు ఇచ్చే వ్యక్తిగా కాకుండా, తన వ్యక్తిగత క్రీస్తు అనుభవం నుంచి మాట్లాడే వ్యక్తిగా మార్చిందని ఆయన చెప్పారు.
డిజిటల్ మిషనరీలు ఏదైనా పోస్టు చేయడానికి లేదా కంటెంట్ రూపొందించడానికి ముందు ఇదే సూత్రాన్ని అన్వయించుకోవాలని ఆయన సూచించారు:
“ఇది నన్ను ఎలా మార్చింది? సువార్త నిజంగా నా జీవితంలో మాంసరూపం దాల్చిందా?”
యువతతో సమాచార ప్రసారంలో తమ బలహీనతలను నిజాయితీగా పంచుకోవడం కూడా ముఖ్యమని ఆయన అన్నారు. ఎవరో కేవలం తమకు “బోధిస్తున్నట్లు” మాట్లాడుతున్నారో యువత త్వరగా గుర్తించగలరని పేర్కొన్నారు. అందువల్ల నిజమైన సాక్ష్యం వ్యక్తిగత పోరాటాలు, వైఫల్యాలు, విశ్వాస అనుభవాలతో సహా జీవితంలోని వాస్తవాలను పంచుకోవాలని కోరుతుందని చెప్పారు.
పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు ప్రతిపాదించిన శరీర ధర్మశాస్త్రం (Theology of the Body)లోని మానవ వ్యక్తి “తన్నుతాను వరంగా సమర్పించుకోవడం” అనే భావనను ప్రస్తావిస్తూ, డిజిటల్ మిషనరీలు కేవలం కంటెంట్ రూపొందించడానికి మాత్రమే కాకుండా, తమలోని ఏదో ఒక భాగాన్ని ఇతరులకు అందించడం ద్వారా వారు క్రీస్తును కలుసుకునేలా చేయడానికి పిలువబడ్డారని గురుశ్రీ జోర్డన్ చెప్పారు.
సువార్త ఒక నిర్దిష్ట మానవ స్వరం ద్వారా ఎలా ప్రసారం అవుతుందో చూపించే మరో ఉదాహరణగా లూకా సువార్తను ఆయన ప్రస్తావించారు. తనకు అందిన సంప్రదాయాన్ని లూకా తన స్వంత దృక్పథం, అవగాహనతో సంకలనం చేసి రాశారని, అదే సమయంలో ఆయన ద్వారా పరిశుద్ధాత్మ కార్యాన్ని శ్రీసభ గుర్తిస్తుందని వివరించారు.
అదేవిధంగా డిజిటల్ మిషనరీలు గతంలో యేసు చేసిన కార్యాలను మాత్రమే కాకుండా, ఈ రోజూ క్రీస్తు తమ జీవితాల్లో సజీవంగా ఉండి కార్యం చేస్తున్న విధానాన్ని కూడా తెలియజేయాలని ఆయన సూచించారు.
“యేసు ఈ రోజూ సజీవంగా ఉన్నారు. ఈ రోజూ మనం ఆయనను మళ్లీ కలుసుకోగలం. ఆ అనుభవం నుంచి మనం సాక్ష్యమిచ్చినప్పుడు, అది సజీవమైన సాక్ష్యంగా ఉంటుంది” అని గురుశ్రీ జోర్డన్ అన్నారు.
పవిత్ర గ్రంథంలో లేదా తమ విశ్వాస అనుభవంలో నిజంగా తమను కదిలించే, సవాలు చేసే, ఆసక్తిని రేకెత్తించే అంశాలను గుర్తించాలని ఆయన పాల్గొనేవారిని ప్రోత్సహించారు. అలాంటి క్షణాలు దేవుడు తమలో ఎక్కడ కార్యం చేస్తున్నారో తెలియజేయగలవని, డిజిటల్ సాక్ష్యానికి నిజమైన ఆధారంగా మారగలవని చెప్పారు.
లిస్యూ పునీత తెరెసా గురించి ఒక వీడియోను రూపొందించినప్పుడు తాను భావోద్వేగానికి లోనైన సందర్భాన్ని కూడా గురుశ్రీ జోర్డన్ గుర్తుచేసుకున్నారు. ఆ భావోద్వేగాన్ని వీడియోలో అలాగే ఉంచారని, ఆ వీడియో తన అత్యంత విజయవంతమైన రికార్డింగుల్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు.
తాను పంచుకుంటున్న విషయంతో సమాచార ప్రసారకుడు నిజంగా ప్రభావితుడైనప్పుడు ప్రజలు కూడా దానికి స్పందిస్తారని ఆ అనుభవం తనకు తెలియజేసిందని ఆయన అన్నారు.
డిజిటల్ మిషనరీల ప్రయాణం అహం, భయం నుంచి దేవుని సాన్నిధ్యంపై అవగాహనకు; అక్కడి నుంచి వ్యక్తిగత క్రీస్తు అనుభవానికి; చివరకు నిజమైన సాక్ష్యానికి సాగాలని గురుశ్రీ జోర్డన్ వివరించారు.
జీవముగల యేసుతో తమ అనుభవం నుంచి మాట్లాడి, క్రీస్తు తమ జీవితాల్లో ఎలా సజీవంగా ఉండి కార్యం చేస్తున్నారో ఇతరులకు చూపించినప్పుడు డిజిటల్ మిషనరీలు జీవముగల యేసుకు నిజమైన సాక్షులుగా మారుతారని ఆయన అన్నారు.
క్వెజోన్ సిటీలో సెప్టెంబర్ 13 వరకు కొనసాగిన ఈ సమ్మేళనంలో ఆసియా నలుమూలల నుంచి వచ్చిన కతోలిక డిజిటల్ సమాచార ప్రసారకులు సినడాలిటీ, నిజమైన సాక్ష్యం, డిజిటల్ సువార్త ప్రచారం, డిజిటల్ ప్రపంచంలో శ్రీసభ మిషన్ వంటి అంశాలపై ఆలోచనలు, అనుభవాలను పంచుకున్నారు.
