“డిజిటల్ ప్రపంచానికి యేసు ప్రేమను తీసుకెళ్లండి”: ఆసియా డిజిటల్ మిషనరీలకు FABC అధ్యక్షుడి పిలుపు

కార్డినల్ ఫిలిప్ నేరి ఫెర్రావ్
సెప్టెంబర్ 11, 2026న క్వెజోన్ సిటీలో జరిగిన తొలి ఆసియా కతోలిక డిజిటల్ మిషనరీల సమ్మేళనంలో కార్డినల్ ఫిలిప్ నేరి ఫెర్రావ్ కతోలిక డిజిటల్ మిషనరీలు, సమాచార ప్రసారకులను ఉద్దేశించి ప్రసంగించారు.

Federation of Asian Bishops’ Conferences (FABC) అధ్యక్షుడు కార్డినల్ ఫిలిప్ నేరి ఫెర్రావ్, కతోలిక డిజిటల్ మిషనరీలు డిజిటల్ ప్రపంచంలోకి యేసు క్రీస్తు ప్రేమను తీసుకెళ్లాలని, ఆన్‌లైన్ వేదికలను ప్రజాదరణ కోసం కాకుండా సంఘబంధాన్ని నిర్మించేందుకు ఉపయోగించాలని పిలుపునిచ్చారు.

“మీకు అందుబాటులో ఉన్న డిజిటల్ వేదికలను కేవలం ఫాలోవర్లు, లైక్‌లు లేదా గుర్తింపు పొందడం కోసం కాకుండా, క్రీస్తును ప్రకటించడానికి, ఇతరులకు సేవ చేయడానికి, సంఘబంధానికి వారధులను నిర్మించడానికి ఉపయోగించండి” అని కార్డినల్ ఫెర్రావ్ సెప్టెంబర్ 11న తొలి ఆసియా కతోలిక డిజిటల్ మిషనరీల సమ్మేళనంలో పాల్గొన్న ప్రతినిధులను ఉద్దేశించి పంపిన వీడియో సందేశంలో అన్నారు.

ఫిలిప్పీన్స్‌లోని క్వెజోన్ సిటీలో Radio Veritas Asia (RVA) ప్రధాన కార్యాలయంలోని రెండవ జాన్ పాల్ ఆడిటోరియంలో మధ్యాహ్న సమావేశం ప్రారంభానికి ముందు ఆయన ఆసియా నలుమూలల నుంచి వచ్చిన 100 మందికి పైగా కతోలిక డిజిటల్ సమాచార ప్రసారకులు, మిషనరీలను ఉద్దేశించి మాట్లాడారు.

సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు జరుగుతున్న ఈ సమ్మేళనాన్ని FABC సామాజిక సమాచార ప్రసార కార్యాలయం (FABC-OSC), RVAలు, పరిశుద్ధ సింహాసనం కమ్యూనికేషన్ డికాస్టరీకి చెందిన Fully Present Network (FPN )భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నాయి. “ప్రభావశీలుల నుంచి సాక్షులుగా: ఆసియాలో డిజిటల్ సువార్త ప్రచారానికి సినడల్ మార్గం” అనే ఇతివృత్తంతో ఈ సమ్మేళనం జరుగుతోంది.

వివిధ దేశాలు, సంస్కృతులు, భాషలు, సేవాపర పరిస్థితుల నుంచి వచ్చినప్పటికీ, పాల్గొంటున్న వారందరినీ ఒకే ఉమ్మడి మిషన్ కలుపుతోందని కార్డినల్ ఫెర్రావ్ అన్నారు. “యేసు క్రీస్తు ప్రేమను డిజిటల్ ప్రపంచంలోకి తీసుకెళ్లడం”, ప్రజలు జీవిస్తున్న, సంభాషిస్తున్న, జీవితానికి అర్థాన్ని వెతుకుతున్న, ప్రశ్నలను లేవనెత్తుతున్న ప్రదేశాల్లో శ్రీసభను సజీవంగా ఉంచడం తమ ఉమ్మడి పిలుపు అని ఆయన పేర్కొన్నారు.

డిజిటల్ వేదికలను ఆయన కొత్త సువార్త ప్రచార క్షేత్రంగా అభివర్ణించారు. అక్కడ ప్రజలు సంబంధాలను ఏర్పరచుకుంటున్నారని, జీవితానికి అర్థాన్ని వెతుకుతున్నారని, జీవితంలోని లోతైన ప్రశ్నలను ఎదుర్కొంటున్నారని చెప్పారు.

“అందుకే డిజిటల్ మిషనరీ శిష్యులుగా మీ పిలుపు ఎంతో ముఖ్యమైనది” అని ఆయన అన్నారు. డిజిటల్ సేవలో సృజనాత్మకత, ధైర్యం, సాన్నిహిత్యాన్ని తీసుకురావాలని ఆయన పాల్గొనేవారిని ప్రోత్సహించారు.

ప్రభావశీలులుగా ఉండటం నుంచి సాక్షులుగా మారడమే ఈ సమ్మేళనం ప్రధాన లక్ష్యమని కార్డినల్ ఫెర్రావ్ గుర్తుచేశారు.

“ఒక ప్రభావశీలి ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు. అయితే సాక్షి అంతకంటే లోతైన కార్యం చేస్తాడు. సాక్షి తనవైపు కాకుండా క్రీస్తువైపు చూపిస్తాడు” అని ఆయన అన్నారు.

డిజిటల్ సాక్ష్యం కేవలం మాటలకు లేదా మతపరమైన కంటెంట్‌కు మాత్రమే పరిమితం కాదని FABC అధ్యక్షుడు స్పష్టం చేశారు. డిజిటల్ మిషనరీలు ఎలా మాట్లాడతారు, ఎలా ఆలకిస్తారు, ఎలా స్పందిస్తారు, ఇతరులకు ఎలా తోడుగా నిలుస్తారు అనే ప్రతి అంశాన్ని నిజమైన క్రైస్తవ జీవితం, సువార్త ప్రభావితం చేయాలని ఆయన అన్నారు.

ఈ మిషన్‌ను ఆసియాలో శ్రీసభ కొనసాగిస్తున్న సినడల్ ప్రయాణంతో ఆయన అనుసంధానించారు.

“సినడాలిటీ మనలను కలిసి నడవమని పిలుస్తుంది” అని పేర్కొంటూ, డిజిటల్ మిషనరీలు “మాట్లాడే ముందు ఆలకించాలని, తీర్పు చెప్పే ముందు అర్థం చేసుకోవాలని, సలహా ఇచ్చే ముందు తోడుగా నిలవాలని, పోటీ పడటానికి బదులుగా సహకరించాలని” ఆయన కోరారు.

ప్రత్యేకంగా యువత, జీవితానికి అర్థాన్ని వెతుకుతున్నవారు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నవారు, క్రైస్తవ సమాజానికి దూరంగా ఉన్నట్లు భావించే వారు తమ మాట వినబడుతోందని, తాము స్వాగతించబడుతున్నామని, తమకు విలువ ఉందని అనుభూతి చెందేలా డిజిటల్ వేదికలను మార్చాలని ఆయన సూచించారు.

డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించేందుకు భయపడవద్దని, అయితే “క్రీస్తు హృదయంతో” అందులోకి అడుగుపెట్టాలని కార్డినల్ ఫెర్రావ్ పిలుపునిచ్చారు.

“సువార్తలో పాతుకుపోయి సృజనాత్మకంగా ఉండండి. వినయంతో ధైర్యంగా ఉండండి. సాన్నిహిత్యంతో ఉండండి, కానీ ఎల్లప్పుడూ మీవైపు కాకుండా యేసువైపు చూపించండి” అని ఆయన అన్నారు.

ఆసియా అంతటా డిజిటల్ మిషనరీల మధ్య సంఘబంధం మరింత బలపడాలని, కొత్త సహకార మార్గాలు ఏర్పడాలని కార్డినల్ ఫెర్రావ్ ఆకాంక్షించారు.

“ఈ సమ్మేళనం మీ మధ్య సంఘబంధాన్ని బలోపేతం చేయాలి, మీ మిషనరీ పిలుపును మరింత లోతుగా చేయాలి, ఆసియా శ్రీసభ అంతటా కొత్త సహకార రూపాలకు స్ఫూర్తినివ్వాలి” అని ఆయన అన్నారు.

చివరగా ఈ సమ్మేళనాన్ని దేవునికి అప్పగిస్తూ, “ఆసియాలో శ్రీసభ మిషన్ కోసం సజీవమైన ఫలాలను అందించేలా” ఈ సమావేశం దోహదపడాలని ప్రార్థించారు.

తొలి ఆసియా కతోలిక డిజిటల్ మిషనరీల సమ్మేళనం ఆసియా నలుమూలల నుంచి 100 మందికి పైగా కతోలిక డిజిటల్ సమాచార ప్రసారకులను ఒకచోట చేర్చి, డిజిటల్ సువార్త ప్రచారం, సినడాలిటీ, నిజమైన క్రైస్తవ సాక్ష్యం వంటి అంశాలపై నాలుగు రోజులపాటు శిక్షణ, ఆత్మపరిశీలన, అనుభవాల పంచుకోవడం, పరస్పర పరిచయాలకు వేదికగా నిలిచింది.
 

Telugu Survey Popup Image