గుర్తింపు కోసం మాత్రమే కాకుండా సంఘబంధాన్ని నిర్మించండి: డిజిటల్ మిషనరీలకు వాటికన్ అధికారి పిలుపు
కతోలిక డిజిటల్ మిషనరీలు ఆన్లైన్ ప్రభావం కోసం చేసే ప్రయత్నాలకు అతీతంగా ఆలోచించి, తమ పిలుపును సంఘబంధం, సహకారం, సంబంధాల నిర్మాణంగా చూడాలని వాటికన్ కమ్యూనికేషన్ అధికారి డాక్టర్ నటాషా గోవేకర్ ఆసియా డిజిటల్ మిషనరీల సమ్మేళనంలో పాల్గొన్న వారికి పిలుపునిచ్చారు.
వాటికన్ కమ్యూనికేషన్ డికాస్టరీకి చెందిన థియాలజికల్-పాస్టరల్ విభాగం డైరెక్టర్ డాక్టర్ నటాషా గోవేకర్ సెప్టెంబర్ 11న రెండవ జాన్ పాల్ ఆడిటోరియంలో జరిగిన మధ్యాహ్న సమావేశంలో రెండో ప్రసంగాన్ని అందించారు.
డిజిటల్ సమాచార ప్రసార రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులను ప్రస్తావిస్తూ, “Towards Full Presence” అనే సేవాపర ఆలోచనా పత్రాన్ని ఆధారంగా చేసుకుని ఆమె మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారనే దానితో సంబంధం లేకుండా ప్రతి క్రైస్తవుడు ఇతరులపై ప్రభావం చూపగల సామర్థ్యం కలిగి ఉంటాడని ఆమె అన్నారు.
“మన ప్రభావాన్ని మనం గంభీరంగా తీసుకోవాలి” అని ఆమె పేర్కొంటూ, క్రైస్తవ ప్రభావాన్ని కేవలం ప్రేక్షకుల సంఖ్య ఆధారంగా కొలవలేమని స్పష్టం చేశారు.
డిజిటల్ మిషనరీలు తమను తాము కేవలం “ప్రభావశీలులు”గా భావించడం నుంచి బయటకు వచ్చి, “సంఘబంధాన్ని అల్లేవారిగా” మారాలని ఆమె కోరారు.
“వ్యక్తులుగా కాకుండా, ఒక సమాజంగా కలిసి ఈ విషయాన్ని నేర్చుకోవడం అత్యవసరం” అని గోవేకర్ అన్నారు.
ఈ విధానం సినడాలిటీతో సన్నిహితంగా ముడిపడి ఉందని ఆమె వివరించారు.
“సినడల్గా ఉండటం అంటే కలిసి పనిచేయడం, కలిసి ముందుకు సాగడం” అని ఆమె అన్నారు. సంఘబంధంలో పాతుకుపోయిన సామాజిక మాధ్యమ ఉనికిని శ్రీసభ అభివృద్ధి చేసుకోవడానికి సహకారం దోహదపడుతుందని చెప్పారు.
“ఎందుకంటే క్రైస్తవులుగా మనకు తెలుసు—సంఘబంధం మన DNAలోనే ఉంది” అని ఆమె అన్నారు.
క్రైస్తవ సమాచార ప్రసారంపై శ్రీసభకు ఉన్న దీర్ఘకాల బోధనలో, ముఖ్యంగా Communio et Progressioలోని దృష్టికోణంలో ఈ భావనకు పునాది ఉందని గోవేకర్ పేర్కొన్నారు. అందులో క్రీస్తును “పరిపూర్ణ సమాచార ప్రసారకుడు”గా అభివర్ణిస్తారని ఆమె గుర్తుచేశారు.
అవతార రహస్యంలో క్రీస్తు తన సందేశాన్ని స్వీకరించే ప్రజలతో సంపూర్ణంగా ఐక్యమయ్యారని ఆమె వివరించారు. ఆయన కేవలం మాటల ద్వారా కాకుండా తన సంపూర్ణ జీవితాన్ని అర్పించడం ద్వారా సమాచారాన్ని అందించారని చెప్పారు.
సమాచార ప్రసారం అత్యంత లోతైన స్థాయిలో “ప్రేమలో తనను తాను అర్పించుకోవడం” అని ఆ పత్రం పేర్కొంటుందని ఆమె అన్నారు.
వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో కూడా క్రైస్తవ సమాచార ప్రసారకులకు ఇదే ప్రాథమిక దిశగా ఉండాలని గోవేకర్ స్పష్టం చేశారు.
కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, సమాచార ప్రసారానికి కేంద్రంగా ఉన్న ప్రత్యేకమైన మానవీయ లక్షణాలను సాంకేతికత భర్తీ చేయలేదని ఆమె అన్నారు.
“ఎంత అధునాతనమైన గణన వ్యవస్థ అయినప్పటికీ, తనను తాను అర్పించుకునే హృదయాన్ని లేదా మంచిచెడులను వివేచించే మనస్సాక్షిని అది సృష్టించలేదు” అని Magnifica humanitas పేర్కొంటుందని ఆమె గుర్తుచేశారు.
అందువల్ల కొత్త డిజిటల్ నైపుణ్యాలను సంపాదించడం మాత్రమే సవాలు కాదని, సాంకేతికత మానవీయ కలయికకు, శ్రీసభ మిషన్కు సేవ చేసేలా ఉండాలి తప్ప వాటి స్థానాన్ని ఆక్రమించకూడదని ఆమె అన్నారు.
డికాస్టరీ నిర్వహిస్తున్న “Faith Communication in the Digital World” కార్యక్రమాన్ని కూడా గోవేకర్ ఉదాహరణగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమం అంతర్జాతీయ, సహకార ప్రక్రియ ద్వారా యువ కతోలిక సమాచార ప్రసార నిపుణులకు శిక్షణనిస్తుంది.
ప్రతి సంవత్సరం సాధారణంగా 35 ఏళ్లలోపు వయస్సు కలిగిన 16 మంది యువ సమాచార ప్రసార నిపుణులను ఈ కార్యక్రమం ఎంపిక చేస్తుంది. వారికి కమ్యూనికేషన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవంతో పాటు కతోలిక సమాజాలతో బలమైన అనుబంధం ఉంటుంది.
పాల్గొనేవారు 11 నెలలపాటు వారానికి ఒకసారి ఆన్లైన్ శిక్షణ పొందడంతో పాటు, రోమ్లో ఒక వారం ప్రత్యక్ష శిక్షణ, వ్యక్తిగత మరియు సమూహ కార్యక్రమాలు, నిపుణుల సమావేశాలు, వర్క్షాప్లు, సమాచార ప్రసార ప్రాజెక్టుల్లో పాల్గొంటారు.
వివిధ సంస్కృతులు, సమయ మండలాలు, వృత్తిపరమైన విధానాల మధ్య కలిసి పనిచేయడం అంత సులభం కాదని గోవేకర్ అంగీకరించారు.
అయితే ఆ సవాళ్లే శిక్షణలో భాగంగా మారాయని ఆమె అన్నారు.
“ఈ ప్రాజెక్ట్ యొక్క అత్యంత ముఖ్యమైన ఫలితం తుది ఉత్పత్తి కాదు; ప్రక్రియ, సంబంధాలే” అని ఆమె పేర్కొన్నారు.
ఈ అవగాహనతోనే ఈ కార్యక్రమం తోడ్పాటు, మార్గదర్శకత్వానికి మరింత ప్రాధాన్యతనిచ్చేలా అభివృద్ధి చెందిందని ఆమె చెప్పారు. శిక్షణ పూర్తి చేసిన తరువాత కూడా మార్గదర్శకులు పాల్గొనేవారికి తోడుగా కొనసాగుతూ, ఇప్పటికే ఈ ప్రయాణాన్ని అనుభవించిన వారి నుంచి కూడా నేర్చుకునే ఒక రకమైన శిష్యరికాన్ని ఏర్పరుస్తున్నారని వివరించారు.
“అందుకే దీనిని నేను శిష్యరికం అని పిలుస్తాను” అని గోవేకర్ అన్నారు.
ప్రాయోగిక శిక్షణ, ఉమ్మడి ప్రాజెక్టుల ద్వారా యువ కతోలిక వృత్తినిపుణుల్లో పెట్టుబడి పెట్టడం ఎంతో విలువైనదని ఈ అనుభవం చూపించిందని ఆమె అన్నారు.
“దృష్టిని, నిరీక్షణను ధైర్యంగా పంచుకోవడం నుంచే ఫలప్రదత వస్తుంది” అని ఆమె పేర్కొన్నారు.
ఇప్పటికే ఉన్న నమూనాను యథాతథంగా అనుసరించడం కాకుండా, ఆసియా డిజిటల్ మిషనరీలు తమ స్వంత సహకార విధానాలను అభివృద్ధి చేసుకోవాలని గోవేకర్ సూచించారు.
“అంతర్జాతీయ స్థాయిలో మేము ప్రయత్నిస్తున్న విధానాన్ని అదే రూపంలో పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. అయితే దాని సూత్రాలు స్థానికంగా, అంతర్జాతీయంగా కొత్త అనుభవాలకు స్ఫూర్తినివ్వగలవు” అని ఆమె అన్నారు.
కతోలిక సమాచార ప్రసారకుల అంతిమ బాధ్యత తాము కలిసి ఏమి సృష్టించగలమో కనుగొనడమే అని ఆమె చెప్పారు. వృత్తిపరమైన నైపుణ్యం, అనుభవం, మానవీయ సంబంధాలను ఒక ఉమ్మడి మిషన్లోకి తీసుకురావాలని ఆమె సూచించారు.
డిజిటల్ సువార్త ప్రచారానికి కేంద్రబిందువుగా సంఘబంధాన్ని ఉంచిన గోవేకర్, మరింత సమర్థవంతంగా సమాచారాన్ని అందించడం మాత్రమే లక్ష్యం కాదని, సువార్తను అనుభవించి, జీవించేలా చేసే సంబంధాలను నిర్మించడమే అసలు లక్ష్యమని స్పష్టం చేశారు.
