వలస కార్మికులకు 'న్యాయమైన వేతనం' కావాలి : ఫ్రాన్సీస్ పాపు గారు

వలస కార్మికులకు 'న్యాయమైన వేతనం' కావాలి : ఫ్రాన్సీస్ పాపు గారు
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తన ఆసియా పర్యటనలో భాగంగా సంపన్న నగర-రాష్ట్రమైన సింగపూర్ను సందర్శించారు.అక్కడ సుమారు 1,000 మంది స్థానిక రాజకీయ, మత నాయకులు మరియు ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, వారి గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
సెప్టెంబరు 12న సింగపూర్లోని యూనివర్సిటీ కల్చరల్ సెంటర్లోని థియేటర్లో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తన ప్రసంగాన్ని వినిపించారు. రాజకీయ నాయకులు,మత పెద్దలు మరియు ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగిస్తూ "వలస కార్మికుల గౌరవాన్ని కాపాడటం"పై "ప్రత్యేక శ్రద్ధ" చూపించాలని అన్నారు.
"ఈ కార్మికులు సమాజానికి ఎంతో దోహదపడుతున్నారు మరియు న్యాయమైన వేతనానికి హామీ ఇవ్వాలి" అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.
అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 170 మిలియన్ల వలస కార్మికులు ఉన్నారు. ఎక్కువ మంది అమెరికా, యూరప్ మరియు మధ్య ఆసియాలో నివసిస్తున్నారు.దాదాపు 300,000 మంది తక్కువ వేతనాల వలస కార్మికులు సింగపూర్లో పని చేస్తారని అంచనా.దోపిడీకి వ్యతిరేకంగా తమకు తగిన రక్షణ లేదని, కొన్నిసార్లు పేద జీవన పరిస్థితులను భరిస్తున్నారని అక్కడ వలస కార్మికులు అంటున్నారు.
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో, పదివేల మంది వలస కార్మికులను వసతి గృహాలలో బలవంతంగా నిర్భందించినపుడు ఈ సమస్య తెరపైకి వచ్చింది. సింగపూర్లో చాలా మంది వలసదారులు దక్షిణాసియా నుండి మరియు ఫిలిప్పీన్స్ నుండి వచ్చారు.
"వారు నా జీతం పెంచకపోయినా, పాపు గారు స్వయంగా మా కోసం పోరాడుతున్నాడని మరియు ప్రార్థిస్తున్నాడని తెలిసి నేను ఇంకా సంతోషంగా ఉన్నాను" అని సింగపూర్ కి వలస వచ్చిన 34 ఏళ్ల ఫిలిపినో మహిళ చెప్పింది.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer