పునీతురాలిగా ప్రకటించే ప్రక్రియ ముందుకు సాగుతున్న వేళ సిబిల్ కాథిగాసుకు ఘన నివాళులు అర్పించిన మలేషియా కతోలికులు
మలేషియాలోని కతోలికులు జూన్ 6న పెనాంగ్ మేత్రాసనంలోని సెయింట్ మైఖేల్ దేవాలయంలో సమావేశమై, రెండో ప్రపంచ యుద్ధ కాలపు వీరనారి సిబిల్ కాథిగాసుకు ఘన నివాళులు అర్పించారు. కతోలిక శ్రీసభ ఆమెను ధన్యురాలిగా (Beatification) మరియు అనంతరం పునీతురాలిగా ప్రకటించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఆమె మరణించి 78 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా జరిగిన ఈ స్మారక కార్యక్రమంలో ప్రత్యేక ప్రార్థనలు, ఆమె సమాధి సందర్శనం, స్మారక పవిత్ర దివ్యపూజాబలి, అలాగే విశ్రాంత బ్రిగేడియర్ జనరల్ ఫిట్జ్జెరాల్డ్ ఆగస్టిన్ అందించిన “I Will Pay the Supreme Sacrifice My Lord, I Promise This in Thy Name” అనే అంశంపై ప్రసంగం చోటుచేసుకున్నాయి.
ఆ ప్రసంగంలో కాథిగాసు అసాధారణ జీవితాన్ని ప్రస్తావించారు. నర్సుగా సేవలందించిన ఆమె, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మలయాపై జపాన్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడిన ప్రతిఘటన యోధులకు సహాయం చేయడం ద్వారా దేశంలో అత్యంత గౌరవనీయ వ్యక్తిగా నిలిచారు.
సిబిల్ డేలీగా జన్మించిన ఆమె, పెరాక్ రాష్ట్రంలోని పాపాన్లో ఉన్న తన ఇంటి నుండి రహస్యంగా మిత్రరాజ్యాల ప్రతిఘటన యోధులకు మందులు, వైద్యసేవలు మరియు ఇతర సహాయాన్ని అందించారు. ఈ కార్యకలాపాల కారణంగా ఆమెను జపాన్ సైనిక పోలీసు దళమైన కెంపెటై అరెస్టు చేసింది.
తీవ్రమైన చిత్రహింసలు, సుదీర్ఘ విచారణలు ఎదుర్కొన్నప్పటికీ, తాను సహాయం చేసిన వ్యక్తుల వివరాలను ఆమె ఎప్పుడూ వెల్లడించలేదు. యుద్ధ సమయంలో అనుభవించిన ఈ బాధలను ఆమె తన “No Dram of Mercy” అనే ఆత్మకథలో నమోదు చేశారు. ఆ గ్రంథం నేటికీ బాధ, ధైర్యం మరియు అచంచల విశ్వాసానికి శక్తివంతమైన సాక్ష్యంగా నిలిచింది.
జైలు జీవితం సమయంలో పొందిన గాయాలు ఆమె శరీరంపై శాశ్వత ప్రభావం చూపాయి. యుద్ధం అనంతరం తీవ్రమైన వెన్నెముక గాయాలతో బాధపడుతున్న సమయంలో, ఆమెను బటు గాజాలోని సెయింట్ జోసెఫ్ చర్చికి తీసుకెళ్లి, ప్రవేశ ద్వారం వద్ద దింపమని కోరారు. అక్కడి నుండి ఆమె మోకాళ్లపై పాకుతూ వెళ్లి, దివ్య సత్ప్రసాదం ముందు ప్రార్థించిన సంఘటన ఆమె జీవితంలోని అత్యంత హృదయస్పర్శక ఘట్టాలలో ఒకటిగా గుర్తించబడుతుంది.
అనేకమంది కథోలికుల దృష్టిలో, ఈ సంఘటన తీవ్రమైన బాధల మధ్య కూడా ఆమె విశ్వాసం ఎంత దృఢంగా నిలిచిందో తెలియజేస్తుంది.
జూన్ 6న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కాథిగాసు సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పెనాంగ్ పీఠకాపరి అయిన కార్డినల్ సెబాస్టియన్ ఫ్రాన్సిస్ గారు స్మారక పవిత్ర బలిని నిర్వహించారు.
తన ప్రసంగంలో కార్డినల్ సెబాస్టియన్, అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్పిన మాటలను ఉటంకించారు:
“నేను నా పరుగును పూర్తిచేశాను. విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇప్పుడు నేను వెళ్లవలసిన సమయం వచ్చింది.”
ఈ మాటలు కేవలం పౌలుకు మాత్రమే కాకుండా సిబిల్ కాథిగాసుకు కూడా వర్తిస్తాయా? అంతిమంగా మన జీవితాలకు కూడా వర్తించగలవా? అని ఆయన విశ్వాసులను ఆలోచించమని ఆహ్వానించారు.
కార్డినల్ సెబాస్టియన్, కాథిగాసును మత, జాతి, సాంస్కృతిక సరిహద్దులను దాటి అందరికీ స్ఫూర్తినిచ్చే సాక్షిగా అభివర్ణించారు.
2024 జూలై 1న, కార్డినల్ సెబాస్టియన్ ఆమె ధన్యురాలిగా మరియు పునీతురాలిగా ప్రకటించే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటించడంతో, మలేషియా కతోలిక శ్రీసభ ఆమె పవిత్రతను గుర్తించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది.
యుద్ధం నుంచి ప్రాణాలతో బయటపడినప్పటికీ, జైలులో పొందిన గాయాల నుండి ఆమె పూర్తిగా కోలుకోలేకపోయారు. మెరుగైన వైద్యం కోసం ఆమె బ్రిటన్కు వెళ్లగా, 1948 జూన్ 12న స్కాట్లాండ్లోని లానార్క్షైర్లో 49 ఏళ్ల వయస్సులో మరణించారు.
ఆమె భౌతికకాయాన్ని అనంతరం తిరిగి మలయాకు తీసుకువచ్చి, ఇపోలోని సెయింట్ మైఖేల్ చర్చిలో సమాధి చేశారు. నేడు ఆమె సమాధి కథోలికులతో పాటు ఆమె జీవిత సాక్ష్యంతో ప్రేరణ పొందిన అనేకమందికి యాత్రాస్థలంగా మారింది.
మలేషియా కతోలికుల దృష్టిలో కాథిగాసు కేవలం యుద్ధ వీరనారి మాత్రమే కాదు. హింసలు, హింసాత్మక వేధింపుల మధ్య కూడా తన విశ్వాసాన్ని కోల్పోని మహిళగా, దేవునిపట్ల విశ్వాసం, కరుణ మరియు ధైర్యంతో జీవించడానికి ప్రేరణనిచ్చే వ్యక్తిగా ఆమె గుర్తించబడుతున్నారు.
“సిబిల్ జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. విశ్వాసంలో పాతుకుపోయిన ధైర్యం చరిత్రలోని అత్యంత చీకటి క్షణాలను కూడా అధిగమించగలదు” అని కార్డినల్ సెబాస్టియన్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత సహాయకుడు క్రిస్టోఫర్ కుషీ, రేడియో వెరితాస్ ఆసియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
ఆమె మరణించి దాదాపు ఎనిమిది దశాబ్దాలు గడిచినా, సిబిల్ కాథిగాసు కథ మలేషియా కతోలిక శ్రీసభలో అత్యంత స్ఫూర్తిదాయకమైన అధ్యాయాలలో ఒకటిగా ఇప్పటికీ నిలిచివుంది.