"ఇతర మతాలు అంటూ ఏవీ లేవు... అవి మన సహోదరుల మతాలు" – బంగ్లాదేశ్ అగ్రపీఠాధిపతి

ఢాకా అగ్రపీఠాధిపతి బెజోయ్ నిసెఫోరస్ డి'క్రూజ్, OMI
జకార్తాలో జరుగనున్న FABC 12వ ప్లీనరీ సమావేశం ప్రారంభానికి ముందు, ఢాకా అగ్రపీఠాధిపతి బెజోయ్ నిసెఫోరస్ డి'క్రూజ్, OMI, ఇతర విశ్వాసాలను "మన పొరుగువారి మతాలు"గా స్వీకరిస్తూ, ఆసియాలోని శ్రీసభ మతాంతర సంభాషణను మరింత లోతుగా పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. (ఫోటో: LICAS News)

జూలై 20న ఇండోనేషియాలోని జకార్తాలో ప్రారంభమవుతున్న Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశం సందర్భంగా, బంగ్లాదేశ్ కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు, ఢాకా అగ్రపీఠాధిపతి బెజోయ్ నిసెఫోరస్ డి'క్రూజ్, OMI, ఆసియాలోని శ్రీసభ మతాంతర సంభాషణ పట్ల తన నిబద్ధతను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఇతర విశ్వాసాలను "ఇతర మతాలు"గా కాకుండా, "మన సహోదరుల మతాలు"గా చూడాలని ఆయన అన్నారు.

ప్లీనరీ సమావేశానికి ముందు రేడియో వెరిటాస్ ఆసియా (RVA)కు పంపిన వీడియో సందేశంలో, "సినడల్ పరివర్తనకు పిలుపు – ఆసియాలో వారధులు మరియు వారధుల నిర్మాణకర్తలుగా ఉండే శ్రీసభ సేవ" అనే సమావేశ అంశంపై అగ్రపీఠాధిపతి డి'క్రూజ్ స్పందించారు. మత, సాంస్కృతిక వైవిధ్యంతో నిండిన ఆసియా ఖండానికి ఈ అంశం అత్యంత సముచితమైనదని ఆయన పేర్కొన్నారు.

"ఆసియా ఖండానికి ఇది ఎంతో సముచితమైన అంశం," అని అగ్రపీఠాధిపతి డి'క్రూజ్ అన్నారు. "శ్రీసభ ఐక్యత, భాగస్వామ్యం, సువార్త ప్రకటనా సేవకు అంకితమైన సమాజంగా ఉండాలి. ఇతరులను ఆలకిస్తూ, కలిసి పనిచేస్తూ, మతాలు, సంస్కృతులు, సంప్రదాయాల మధ్య వారధులను నిర్మించాలి," అని ఆయన చెప్పారు.

జనాభాలో దాదాపు 90 శాతం మంది ముస్లింలు, ఒక శాతం కంటే తక్కువ మంది క్రైస్తవులు ఉన్న బంగ్లాదేశ్‌లో, వారధుల నిర్మాణకర్తలుగా మారాలనే పిలుపు కేవలం పాస్టోరల్ దృష్టికోణం మాత్రమే కాకుండా, ప్రతిరోజూ జీవించే వాస్తవికత కూడా అని ఆయన అన్నారు.

"బంగ్లాదేశ్ సందర్భంలో, పరస్పర అవగాహన, స్నేహం, సహకారం, సామరస్యాన్ని పెంపొందించడానికి ఇతర మతాల పట్ల సంభాషణ, గౌరవం అత్యంత అవసరం," అని అగ్రపీఠాధిపతి డి'క్రూజ్ పేర్కొన్నారు.
 

ఇతర మతాల పట్ల శ్రీసభ అవగాహన సంవత్సరాలుగా ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన వివరించారు.

"ఇతర మతాలలోని మంచితనాన్ని, పరిశుద్ధాత్మ సాన్నిధ్యాన్ని గుర్తించే సమయం ఇప్పుడు వచ్చింది," అని ఆయన అన్నారు.

"ఇతర మతాలు మనకు పరాయివి కావు; అవి మన సహోదరుల మతాలుగా భావించాలి," అని ఆయన స్పష్టం చేశారు.

"నీ పొరుగువానిని ప్రేమించుము" అనే సువార్త ఆజ్ఞను ప్రస్తావిస్తూ, నిజమైన క్రైస్తవ సాక్ష్యం అంటే ఇతరుల విశ్వాసాలను గౌరవించడం అని అగ్రపీఠాధిపతి డి'క్రూజ్ చెప్పారు.

"పొరుగువాడు అనే భావన క్రైస్తవులకు ఎంతో గొప్పది, ఎంతో విలువైనది. మన పొరుగువారి మతాన్ని గౌరవించకుండా, వారిని నిజంగా ప్రేమించడం సాధ్యం కాదు," అని ఆయన అన్నారు.

బంగ్లాదేశ్‌లోని కతోలిక విద్యాసంస్థలు వారధుల నిర్మాణానికి ఆచరణాత్మక ఉదాహరణలని ఆయన పేర్కొన్నారు. ఆ విద్యాసంస్థల్లో ఎక్కువమంది విద్యార్థులు ఇతర మతాలకు చెందిన వారే అయినప్పటికీ, చిన్నప్పటి నుంచే పరస్పర గౌరవాన్ని పెంపొందించే స్నేహబంధాలు అక్కడ ఏర్పడుతున్నాయని ఆయన వివరించారు. 

FABC ప్లీనరీ సమావేశం ప్రాముఖ్యతను వివరిస్తూ, "FABC అనేది ఒకరి నుండి ఒకరు నేర్చుకునే వేదిక. ఆసియా అనేక మతాలు, సంస్కృతుల ఖండం. మతాంతర సంభాషణ పట్ల మన నిబద్ధతను పునరుద్ధరించుకొని, కలిసి మరింత ఉత్తమమైన నమూనాలను నిర్మించగలుగుతాము," అని అగ్రపీఠాధిపతి డి'క్రూజ్ అన్నారు.

జకార్తాలో జరిగే వారం రోజుల సమావేశాన్ని దాటి, ఆసియాలోని మత వైవిధ్య అనుభవం విశ్వవ్యాప్త శ్రీసభకూ, ప్రపంచానికీ ఒక గొప్ప కానుకగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

"ఒక రోజు ఆసియా, శాంతియుతమైన, సోదరభావంతో కూడిన సహజీవనానికి ప్రపంచానికి ఒక ఆదర్శ నమూనాను అందించగలదు," అని ఆయన అన్నారు.

FABC 12వ ప్లీనరీ సమావేశంలో, ఆసియా ఖండంలోని విభిన్న వాస్తవికతలకు స్పందిస్తూ, శ్రీసభలో ఐక్యత, భాగస్వామ్యం, సువార్త ప్రకటనా సేవలను మరింత బలోపేతం చేసే మార్గాలపై పీఠాధిపతులు పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వంలో వివేచించనున్నారు.