ఆసియా మత నాయకులు ‘ప్రేమ భాష’ను మాట్లాడాలి: ఇండోనేషియా మంత్రి పిలుపు

ఇండోనేషియా మత వ్యవహారాల మంత్రి నసరుద్దీన్ ఉమర్
ఇండోనేషియా మత వ్యవహారాల మంత్రి నసరుద్దీన్ ఉమర్, ఆసియాలోని మత సమాజాలు శాంతికి మార్గంగా "ప్రేమ భాషను" ఆలింగనం చేసుకోవాలని పిలుపునిస్తూ, విభజనకు కాకుండా విశ్వాసం ఐక్యతకు దోహదపడే శక్తిగా ఉండాలని పేర్కొన్నారు.

ఆసియాలోని సమాజాలు "ప్రేమ భాషను" ఆచరించడం ద్వారా సంఘర్షణలను అధిగమించి, శాంతిని బలోపేతం చేయాలని ఇండోనేషియా మత వ్యవహారాల మంత్రి నసరుద్దీన్ ఉమర్ పిలుపునిచ్చారు. విభజనకు కాకుండా, విశ్వాసం ఐక్యతకు దోహదపడే శక్తిగా ఉండాలని ఆయన అన్నారు.

జూలై 21న జకార్తాలోని హోటల్ ములియాలో జరిగిన Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశ ప్రారంభోత్సవంలో ప్రసంగించిన ఉమర్, ఈ సమావేశం కేవలం కతోలిక శ్రీసభ అంతర్గత సమావేశం మాత్రమే కాదని అన్నారు. ఆసియాలో శాంతిని పెంపొందించడానికి, ప్రజల మధ్య సంఘీభావాన్ని బలోపేతం చేయడానికి, మరింత న్యాయసమ్మతమైన, అందరికీ చోటు కల్పించే భవిష్యత్తును నిర్మించడానికి ఇది ఒక ఉమ్మడి నిబద్ధతకు ప్రతీక అని పేర్కొన్నారు.

ఆసియా నలుమూలల నుంచి వచ్చిన కార్డినల్స్, పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, సామాన్య విశ్వాసుల ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ, "శాంతిని పెంపొందించడానికి, ప్రజల మధ్య సంఘీభావాన్ని బలోపేతం చేయడానికి, మరింత శాంతియుతమైన, న్యాయసమ్మతమైన, అందరినీ కలుపుకొని సాగే ఆసియా భవిష్యత్తును నిర్మించడానికి చేస్తున్న ఉమ్మడి ప్రయత్నంలో ఈ సమావేశం ఒక భాగం," అని ఆయన అన్నారు.

ఆసియాలోని సంస్కృతులు, భాషలు, మతాల వైవిధ్యం ఒక గొప్ప బలమని, అదే సమయంలో అది ఒక గొప్ప బాధ్యత కూడా అని నసరుద్దీన్ ఉమర్ పేర్కొన్నారు. అయితే ఈ ఖండం ప్రస్తుతం సాయుధ ఘర్షణలు, సామాజిక విభజనలు, మత ఛాందసవాదం, అసమానతలు, వాతావరణ మార్పులు, వలసలు, కృత్రిమ మేధస్సు వేగవంతమైన అభివృద్ధి వంటి సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు.

ఇలాంటి సమస్యలను కేవలం రాజకీయ లేదా ఆర్థిక పరిష్కారాల ద్వారా మాత్రమే అధిగమించలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

"సంఘర్షణలు, విభేదాలను మతం యొక్క భాష ద్వారా, అంటే ప్రేమ భాష ద్వారా పరిష్కరించవచ్చని నేను విశ్వసిస్తున్నాను," అని ఆయన అన్నారు. "ప్రేమ కరుణను, సహానుభూతిని, ద్వేషానికి తావివ్వకుండా భిన్నత్వాన్ని ఆలింగనం చేసుకునే గుణాన్ని మనకు నేర్పుతుంది," అని పేర్కొన్నారు.

విశ్వాసం ఎల్లప్పుడూ ఐక్యతకు, సంభాషణకు, సయోధ్యకు మూలంగా నిలిచేలా చూడడం మత నాయకుల బాధ్యత అని మంత్రి తెలిపారు.

వైవిధ్యభరిత సమాజాల మధ్య శాంతియుత సహజీవనానికి ఇండోనేషియా ఒక ఉదాహరణగా నిలుస్తోందని ఆయన చెప్పారు. 17 వేలకుపైగా ద్వీపాలు, వందలాది జాతులు, అనేక మత సంప్రదాయాలకు నిలయమైన ఈ దేశం, వైవిధ్యాన్ని జాతీయ బలంగా మలచేందుకు కృషి చేస్తోందని వివరించారు.

ఆ నిబద్ధతకు ఉదాహరణగా, 2024లో దివంగత పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మరియు ముస్లిం నాయకులు సంతకం చేసిన ఇస్తిక్లాల్ ప్రకటన, అలాగే జకార్తాలోని ఇస్తిక్లాల్ మసీదు మరియు కేథడ్రల్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అసంప్షన్ ను అనుసంధానించే "టన్నెల్ అఫ్ ఫ్రెండ్షిప్" (Tunnel of Friendship) నిర్మాణాన్ని ఆయన ప్రస్తావించారు.

"మత, సాంస్కృతిక వైవిధ్యాన్ని శాంతియుతంగా జరుపుకోవచ్చని, అది ఉమ్మడి శక్తికి మూలంగా మారవచ్చని ఇండోనేషియా ప్రపంచానికి చాటిచెప్పాలనుకుంటోంది," అని ఆయన అన్నారు.

"సినడల్ పరివర్తనకు పిలుపు – ఆసియాలో వారధులు మరియు వారధుల నిర్మాణకర్తలుగా ఉండే శ్రీసభ సేవ" అనే FABC సమావేశ అంశాన్ని ప్రస్తావిస్తూ, శ్రీసభ బలంగా చెపుతున్న సినడాలిటీ స్ఫూర్తి, ఇండోనేషియాలో ఎంతోకాలంగా కొనసాగుతున్న ముస్యవారా (సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయం), గొటోంగ్ రోయోంగ్ (పరస్పర సహకారం) సంప్రదాయాలతో ఎంతో సారూప్యత కలిగి ఉందని అన్నారు. ఇవి సంభాషణ, భాగస్వామ్యం, ఉమ్మడి మేలు కోసం సహకారాన్ని ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు.

ఈ సమావేశం అంతర్మత సంభాషణను మరింత బలోపేతం చేయాలని, మానవతా సహకారాన్ని విస్తరించాలని, ఆసియా అంతటా శాంతి కోసం కొత్త కార్యక్రమాలకు స్ఫూర్తినివ్వాలని ఆయన ఆకాంక్షించారు.

"శాంతికి సంబంధించిన కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చే ప్రదేశంగా జకార్తా నిలవాలి. ఈ సమావేశం సోదరభావ బంధాలను మరింత బలోపేతం చేయాలి. వైవిధ్యం విభజనకు కాదు, శక్తికి మూలమని ఆసియా ప్రపంచానికి నిరంతరం చాటిచెప్పాలి," అని ఆయన అన్నారు.

అనంతరం నసరుద్దీన్ ఉమర్ FABC 12వ ప్లీనరీ సమావేశాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.