తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య (FTC) వార్షిక సర్వసభ్య సమావేశం
హైదరాబాద్లోని పునీత యోహాను ప్రాంతీయ గురువిద్యాలయము, రామంతాపూర్ నందు సెప్టెంబర్ 1, 2026 తేదీన తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య (Federation of Telugu Churches – FTC) వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగు క్రైస్తవ సమాజానికి చెందిన సుమారు 50 మంది పీఠాధిపతులు, వివిధ సంఘాల అధిపతులు, ప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
క్రైస్తవ ఐక్యత కోసం నిర్వహించిన సమావేశం "ఐక్యతా ప్రార్థనతో" ప్రారంభమైంది. ఈ ప్రార్ధన క్రైస్తవ ఐక్యత కోసం జరిగిన ప్రార్థనా వారోత్సవం 2026లోని ప్రార్ధనా క్రమ వనరుల ఆధారంగా స్వీకరించబడింది . జ్యోతి కోసం జ్యోతి నుండి జ్యోతి “Light from Light for light” అనే అంశంపై ప్రార్థనలు, ధ్యానం సాగాయి. సమావేశ ప్రారంభములో ఇటీవల మరణించిన సీబీసీఎన్సీ (CBCNC) ప్రధాన కార్యదర్శి శ్రీ మట్ట రాజకర్ రావు, అలాగే విశాఖపట్నం విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహా . ఘన . మల్లవరపు ప్రకాశ్ గారి జ్ఞాపకార్థం సమావేశంలో కొద్దిసేపు మౌనం పాటించారు.
అదేవిధంగా ఈ సమావేశమందు ఇటీవల సీఎస్ఐ డోర్నకల్ మేత్రాసన పీఠాధిపతిగా అభిషేకించబడిన రైట్. రెవ . కోరా సేనమ్ రాజును సమావేశంలో ఘనంగా సత్కరించారు. అలాగే సీబీసీఐ (CBCI) అధ్యక్షుడిగా, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా (NFCI) కన్వీనర్గా ఎన్నికైన కార్డినల్ పూల ఆంతోని గారిని కూడా సత్కరించారు. గుడ్ షెపర్డ్ చర్చ్కు చెందిన ఆర్చ్బిషప్ జోసెఫ్ డిసౌజా (NFCI) కన్వీనర్గా ఎన్నికైన సందర్భంగా ఆయనను అభినందించారు.
క్రైస్తవ ఐక్యతకు పిలుపు :
FTC చైర్మన్ మహా పూజ్య అంతోనిదాస్ గారు ఈ సమావేశంలో స్వాగత పలుకులను అందించి, సమాఖ్యలోని సభ్య సంఘాలు అందిస్తున్న సహకారం, చురుకైన భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. వారందరూ ఒక్కటిగా ఉండాలని,యేసుక్రీస్తు చేసిన "వారందరును ఒకటిగా ఉండవలెనని నేను వేడుకొనుచున్నాను” (యోహాను 17:21) ప్రార్థనను గుర్తుచేస్తూ, సంఘాలు సత్యంలో , ఆత్మలో మరియు సాక్ష్యంలో ఐక్యతను మరింతగా బలోపేతం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రైస్తవ ఐక్యత కేవలం పరస్పర స్నేహభావానికే మాత్రమే పరిమితం కాకుండా, ఒకరినొకరు ప్రోత్సహించుకునేలా, సమాజ శ్రేయస్సు కోసం కలిసి పనిచేసేలా ముఖ్యముగా దేవుని రాజ్య స్థాపనకు తోడ్పడేలా ఉండాలని ఆయన అన్నారు.
వార్షిక నివేదికలు, ఆర్థిక వివరాల సమీక్ష : గత సమావేశపు వివరాలను సర్వసభ్య సమావేశం ఆమోదించింది. అనంతరం తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య (FTC) వార్షిక నివేదికతో పాటు దాని రాష్ట్ర విభాగాలైన ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సంఘాల సమాఖ్య, తెలంగాణ క్రైస్తవ సంఘాల సమాఖ్య తమ వార్షిక నివేదికలను కూడా సమర్పించారు. సంబంధిత సంస్థల ఆర్థిక నివేదికలు, ఖాతాల వివరాలు కూడా సమావేశం ముందుంచబడ్డాయి.
ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై చర్చ
సమావేశంలో ముఖ్యమైన అంశంగా ఎఫ్సీఆర్ఏ (FCRA) సవరణ బిల్లుపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ బిల్లు ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) పరిశీలనకు వెళ్లింది. ఈ బిల్లు క్రైస్తవ సమాజంపై చూపే అవకాశం ఉన్న ప్రభావాలను ఆర్చ్బిషప్ జోసెఫ్ డిసౌజా వివరించారు. మైనారిటీలుగా క్రైస్తవ సమాజానికి ఉన్న హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించేందుకు సంఘాలన్నీ సమిష్టిగా మరియు బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ప్రార్థనతో పాటు బాధ్యతాయుతమైన కార్యాచరణ కూడా అవసరమని ఆయన స్పష్టం చేస్తూ, రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకుంటూ , క్రైస్తవ సమాజం న్యాయబద్ధమైన ప్రయోజనాలను కల్పించేందుకు సంఘాలన్నీ ఐక్యంగా నిలవాలని ఆయన కోరారు. ఈ అంశంపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. క్రైస్తవ సమాజ ప్రయోజనాలను పరిరక్షించేందుకు పరస్పర సహకారంతో, సమిష్టిగా పనిచేయాలనే తమ నిబద్ధతను వారు వ్యక్తం చేశారు.
ఎస్సీ క్రైస్తవుల హోదాపై చర్చ
షెడ్యూల్డ్ కులాల (SC) క్రైస్తవుల హోదా అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ అంశానికి సంబంధించి కొనసాగుతున్న చర్చలు, తాజా పరిణామాలపై ఏలూరు పీఠాధిపతి మహా పూజ్య జయరావు పొలిమేర సమావేశానికి వివరాలను అందించారు.
తన ముగింపు ప్రసంగంలో బిషప్ సెనమ్ రాజ్, FTC నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరియు కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాల కోసం దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవ ఐక్యతను నిర్మించడంలో, దానిని మరింత బలోపేతం చేయడంలో అన్ని సభ్య చర్చిలు మరింత సమయం, శ్రద్ధ మరియు కృషిని పెట్టుబడిగా పెట్టాలని ఆయన ప్రోత్సహించారు.
ఈ సమావేశ ముగింపులో ఛైర్మన్ అయిన మహా పూజ్య అంతోనిదాస్ గారు సమావేశములో పాల్గొని తమ అమూల్యమైన సమయాన్ని, ఆలోచనలను అందించిన అందరికీ వందన సమర్పణ చెల్లించారు. కార్డినల్ పూల అంతోనిగారు ముగింపు ప్రార్ధన తర్వాత విశిష్ట ఆశీస్సులతో సమావేశాన్ని ముగించారు.
తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య (FTC) వార్షిక సర్వసభ్య సమావేశ నిర్వాహకులు క్రైస్తవ ఐక్యతను మరింత బలపరచడం, సార్వ సభ్య ఐక్యత సహకారాన్ని పెంపొందించడం, క్రైస్తవ సమాజానికి సంబంధించిన ఉమ్మడి అంశాలపై సంఘాలన్నీ కలిసి పనిచేయడం వంటి అంశాలను గుర్తుచేస్తూ నూతన నిబద్ధతతో సమావేశం ముగిసింది.
FTC కార్యదర్శి
రెవ. ఫా . కొండవీటి అంతయ్య
