జకార్తా బృహద్దేవాలయంలో ముగిసిన FABC ప్లీనరీ సమావేశం
Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశం జూలై 26న జకార్తాలోని మరియ మాత స్వర్గారోహణ బృహద్దేవాలయంలో జరిగిన గంభీరమైన దివ్యబలిపూజతో ముగిసింది. ఈ సందర్భంగా పీఠాధిపతులు, ప్రతినిధులు సినడాలిటీ పట్ల నూతన అంకితభావంతో, ఆసియా అంతటా వారధులు, వారధుల నిర్మాణకర్తలుగా సేవ చేయాలనే సంకల్పంతో తమ స్థానిక శ్రీసభలకు తిరిగి పయనమయ్యారు.
ముగింపు దివ్యబలిపూజకు జకార్తా అగ్రపీఠాధిపతి కార్డినల్ ఇగ్నేషియస్ సుహార్యో అధ్యక్షత వహించారు. ఇండోనేషియా కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (KWI) అధ్యక్షుడు పీఠాధిపతి ఆంటోనియస్ సుబియాంటో బుంజామిన్, OSC, FABC అధ్యక్షుడు కార్డినల్ ఫిలిప్పే నేరి ఫెర్రావో, అలాగే ఆసియా ఖండం నలుమూలల నుంచి వచ్చిన పీఠాధిపతులు, గురువులు సహబలిదానం చేశారు.
వారం రోజులపాటు సాగిన ఈ ప్లీనరీ సమావేశం, "సినడల్ పరివర్తన మరియు ఆసియాలో వారధులు, వారధుల నిర్మాణకర్తలుగా ఉండే సేవ" అనే ఇతివృత్తంపై మననం చేసేందుకు ఆసియా నలుమూలల నుంచి వచ్చిన కార్డినల్స్, పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, సామాన్య విశ్వాసుల ప్రతినిధులను ఒకచోట చేర్చింది.
దివ్యబలిపూజకు ముందు ప్రతినిధులు బృహద్దేవాలయం వెలుపల జ్ఞాపికగా సమూహ ఛాయాచిత్రం దిగారు. అనంతరం తూర్పు నూసా తెంగ్గారాలోని నగాడా ప్రాంత సంప్రదాయ జై నృత్యం ద్వారా వారికి స్వాగతం పలికారు. ఆతిథ్యం, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ సాంస్కృతిక ప్రదర్శన తరువాత కూడా కొనసాగింది. ప్రవేశ ఊరేగింపులో తిమోర్ సంప్రదాయ నృత్యం, కానుకల ఊరేగింపులో కాలిమంతాన్ ప్రాంతానికి చెందిన బర్డ్ డాన్స్ ప్రదర్శించబడ్డాయి.
ఇండోనేషియా శ్రీసభ బహుళ సాంస్కృతిక స్వరూపం విశ్వాసుల ప్రార్థనలో కూడా ప్రతిఫలించింది. సుందనీస్, నియాస్, టోరాజా, లమహోలోట్ భాషల్లో ప్రార్థనలు చేయడం ద్వారా దేశంలోని గొప్ప భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించారు.
తన ప్రసంగంలో కార్డినల్ ఫెర్రావో, శ్రీసభ భవిష్యత్తు తన ఆధ్యాత్మిక వారసత్వంలో పాతుకుపోయి ఉండడంతో పాటు, సినడాలిటీ ద్వారా నూతనీకరణను ఆలింగనం చేసుకోవడంపై ఆధారపడి ఉందని ప్రతినిధులకు గుర్తుచేశారు.
వృద్ధుల జ్ఞానాన్ని, యువత సృజనాత్మకతను కలిపి తరాల మధ్య వారధులు నిర్మించాలని ఆయన శ్రీసభను పిలుపునిచ్చారు. ప్రతి సేవాపర నిర్ణయం సంఘబంధాన్ని పెంపొందిస్తుందా, భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందా, సువార్త ప్రచారాన్ని అభివృద్ధి చేస్తుందా, శాంతిని ప్రోత్సహిస్తుందా, పేదలు, అణగారిన వారికి సేవ చేస్తుందా అనే ప్రమాణంతో పరిశీలించబడాలని ఆయన అన్నారు.
దివ్యబలిపూజ ముగింపులో "మీరు అంతకంటే గొప్ప సంగతులు చూస్తారు" (యోహాను 1:50) అనే శీర్షికతో రూపొందించిన "ఆసియా ప్రజలకు సందేశం" అధికారికంగా ప్రకటించబడింది. Federation of Asian Bishops' Conferences (FABC) అధ్యక్షుడు కార్డినల్ ఫిలిప్పే నేరి ఫెర్రావో సంతకం చేసిన ఈ సందేశాన్ని ముసాయిదా కమిటీ అధ్యక్షుడు అగ్రపీఠాధిపతి గిల్బర్ట్ గార్సెరా సభలో చదివి వినిపించారు. ఆసియా ప్రజలను ఉద్దేశించి రూపొందించిన ఈ సందేశం, సంభాషణ, సమరసత, నిరీక్షణ, శాంతికి వారధులు, వారధుల నిర్మాణకర్తలుగా మారుతూ సినడల్ ప్రయాణాన్ని మరింత లోతుగా కొనసాగించాలని శ్రీసభను పిలుపునిచ్చింది.
దివ్యబలిపూజ అనంతరం ప్రతినిధులు జకార్తాలోని ఫ్రెండ్షిప్ టన్నెల్ గుండా ప్రతీకాత్మక తీర్థయాత్ర చేపట్టారు. ఈ టన్నెల్, మరియ మాత స్వర్గారోహణ బృహద్దేవాలయంను పొరుగున ఉన్న, ఆగ్నేయాసియాలోని అతిపెద్ద మసీదైన ఇస్తిక్లాల్ మసీదుతో అనుసంధానిస్తుంది.
ఈ సందర్శన, సాంస్కృతిక, మత వైవిధ్యంతో కూడిన సమాజాల్లో సంభాషణ, సమరసత, పరస్పర గౌరవాన్ని పెంపొందించడం ఆసియాలో శ్రీసభకు ఉన్న ప్రధాన పిలుపులలో ఒకటని మరోసారి నొక్కిచెప్పింది.
వారం రోజుల సమావేశమంతా ప్రతినిధులు, సినడాలిటీ అనేది కేవలం పాలనా విధానం మాత్రమే కాదని, ఆలకింపు, భాగస్వామ్యం, ఉమ్మడి సువార్త ప్రచార సేవలో పాతుకుపోయిన శ్రీసభ జీవన విధానమని పదేపదే ఉద్ఘాటించారు.
ప్లీనరీ సమావేశం ముగిసే వేళ, పీఠాధిపతులు, ప్రతినిధులు ఆసియాలోని శ్రీసభల మధ్య సంఘబంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, తమ స్థానిక సమాజాల్లో నిరీక్షణ, శాంతి, సమరసతకు నిజమైన వారధులు, వారధుల నిర్మాణకర్తలుగా మారాలనే ఉమ్మడి నిబద్ధతతో జకార్తా నుంచి తమ మేత్రాసనాలకు తిరిగి బయలుదేరారు.