ఆసియా శ్రీసభ భవిష్యత్ దిశానిర్దేశానికి జకార్తాలో FABC 12వ ప్లీనరీ మహాసభ

ఆసియా శ్రీసభ భవిష్యత్ దిశానిర్దేశానికి జకార్తాలో FABC 12వ ప్లీనరీ మహాసభ
ఆసియా శ్రీసభ భవిష్యత్ ధ్యేయంపై విచక్షణ చేసేందుకు, జూలై 20 నుంచి 26 వరకు ఇండోనేషియాలోని జకార్తాలో 120 మందికి పైగా పీఠకాపరులు, శ్రీసభ నాయకులు, దైవశాస్త్రవేత్తలు, పాస్టోరల్ నిపుణులు సమావేశం కానున్నారు.

ఆసియా పీఠాధిపతుల సమాఖ్య (FABC) 12వ ప్లీనరీ మహాసభ జూలై 20 నుండి 26 వరకు ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరగనుంది. ఆసియా నలుమూలల నుంచి విచ్చేసే పీఠకాపరులు, వివిధ పీఠాధిపతుల సమాఖ్యల ప్రతినిధులు, వాటికన్ అధికారులు, FABC వివిధ కార్యాలయాల కార్యనిర్వాహక కార్యదర్శులు, దైవశాస్త్రవేత్తలు, పాస్టోరల్ నిపుణులు తదితరులతో కలిపి 120 మందికి పైగా ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొని, ఆసియా శ్రీసభ భవిష్యత్ ధ్యేయంపై విచక్షణ చేయనున్నారు.

జకార్తా అగ్ర మేత్రాసనం ఆతిథ్యమిస్తున్న ఈ వారాంత మహాసభ హోటల్ ములియా సెనయాన్లో జరగనుంది. "మీరు వీటికంటే గొప్ప కార్యాలను చూస్తారు" (యోహాను 1:50) అనే పవిత్ర గ్రంథ వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని, "సినొడల్ పరివర్తనకు పిలుపు మరియు ఆసియాలో వారధులుగా ఉండి, వారధులను నిర్మించే శ్రీసభ యొక్క ధ్యేయం" అనే ప్రధాన అంశంపై సమావేశాలు, ఆత్మపరిశీలనలు సాగనున్నాయి.

జూలై 21న జరిగే దివ్యబలిపూజతో మహాసభ అధికారికంగా ప్రారంభమవుతుంది. భారతదేశంలోని బొంబాయి విశ్రాంత అగ్రపీఠాధిపతి కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియాస్, పవిత్ర తండ్రి ప్రత్యేక ప్రతినిధిగా ఈ దివ్యబలిపూజకు అధ్యక్షత వహించనున్నారు.

జూలై 22న పూర్తిగా ప్రార్థన, ధ్యానానికి కేటాయించిన ప్రత్యేక దినాన్ని సువార్త ప్రకటనా విభాగం (Dicastery for Evangelization) ప్రో-ప్రిఫెక్ట్ కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే నడిపిస్తారు. సినొడల్ ఆధ్యాత్మికత, వారధుల నిర్మాణం, అలాగే ఆసియా శ్రీసభ నాయకులు అలవరచుకోవాల్సిన పాస్టోరల్ పరివర్తనపై ఆయన తన ధ్యాన సందేశాలను అందించనున్నారు.

తదుపరి రోజుల్లో ఆసియా ఖండంలో వేగంగా మారుతున్న సామాజిక, రాజకీయ, భౌగోళిక పరిస్థితులపై విస్తృత చర్చలు జరుగనున్నాయి. మారుతున్న ప్రపంచంలో శ్రీసభ సినొడల్ సాక్ష్యం, ఆసియా ఎదుర్కొంటున్న సమకాలీన పరిస్థితులు, వారధులను నిర్మించే శ్రీసభగా తన పాత్రను మరింత బలోపేతం చేసుకునే ఆచరణాత్మక మార్గాలపై ప్రధాన ఉపన్యాసాలు నిర్వహించబడతాయి.

అదేవిధంగా, ప్రతినిధులు చిన్న బృందాల సంభాషణలు, ప్రాంతీయ సమావేశాలు, ప్యానెల్ చర్చల్లో పాల్గొంటారు. సినొడల్ నాయకత్వం, పాస్టోరల్ పరిచర్య, స్థానిక శ్రీసభల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. జూలై 25న మహాసభలో పాల్గొన్న ప్రతినిధులకు పరమపవిత్రులు పోప్ లియో XIV ప్రత్యేక సందేశాన్ని అందించనున్నారు.

జూలై 26న జకార్తాలోని అవర్ లేడీ ఆఫ్ ది అసంప్షన్ కేథడ్రల్లో ముగింపు దివ్యబలిపూజతో మహాసభ ముగియనుంది. అనంతరం ప్రతినిధులు ఇండోనేషియాలో అంతర్మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన "ఫ్రెండ్‌షిప్ టన్నెల్" ద్వారా సమీపంలోని ఇస్తిక్లాల్ మసీదును సందర్శించనున్నారు.

మహాసభ ప్రాముఖ్యతను వివరిస్తూ, FABC సామాజిక ప్రసార మాధ్యమాల కార్యాలయం కార్యనిర్వాహక కార్యదర్శి గురుశ్రీ జాన్ మీ షెన్ ఈ సమావేశాన్ని "కేవలం శ్రీసభ కార్యక్రమం మాత్రమే కాదు" అని అభివర్ణించారు.

"ఆసియాలోని శ్రీసభలు పరస్పరం ఒకరినొకరు ఆలకించడానికి, కలిసి విచక్షణ చేయడానికి, ఉమ్మడి సువార్త ప్రకటనా నిబద్ధతను పునరుద్ధరించుకోవడానికి ఇది ఒక అమూల్యమైన సందర్భం. సామాజిక ప్రసార మాధ్యమాల పరిచర్య ద్వారా ఈ విశ్వాస ప్రయాణానికి తోడుగా నిలిచి, దాని ఫలాలను ఆసియా వ్యాప్తంగా ఉన్న కతోలికులతో పాటు ప్రపంచ శ్రీసభతో పంచుకోవాలని మేము ఆశిస్తున్నాము. తద్వారా సహభాగిత, భాగస్వామ్యం, సువార్త ప్రకటనా ధ్యేయం మరింత బలోపేతం అవుతుంది" అని ఆయన పేర్కొన్నారు.

రేడియో వెరిటాస్ ఆసియా (RVA) కార్యక్రమాల డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న గురుశ్రీ మీ షెన్, జకార్తా అగ్ర మేత్రాసనం, ఇండోనేషియా కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (KWI) సామాజిక ప్రసార మాధ్యమాల బృందాలతో కలిసి ఈ ప్లీనరీ మహాసభ మీడియా సమన్వయాన్ని పర్యవేక్షించనున్నారు. మహాసభలోని ఆత్మపరిశీలనలు, నిర్ణయాలు, సందేశాలు ఆసియా వ్యాప్తంగా ఉన్న శ్రీసభలకు చేరేలా ఆయన బృందం కృషి చేయనుంది.

ఇక, పాకిస్తాన్ కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు పీఠకాపరి సామ్సన్ షుకార్డిన్ మహాసభపై తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, "కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, స్థానిక స్థాయిలో అమలు చేయగల పాస్టోరల్ కార్యాచరణకు మార్గనిర్దేశం చేసే సమగ్ర ఆసియా కార్యాచరణ ప్రణాళిక ఈ మహాసభ ద్వారా రూపుదిద్దుకోవాలని ఆశిస్తున్నాను" అన్నారు.

"ముఖ్యంగా ఆసియాలోని పీఠాధిపతుల సమాఖ్యల మధ్య పరస్పర సహకార వ్యవస్థలు మరింత బలోపేతం కావాలి. యువజనులు, నాయకత్వ వికాసం కోసం ప్రాంతీయ కార్యక్రమాలు విస్తరించాలి. అలాగే మానవ హక్కులు, మత స్వేచ్ఛ పరిరక్షణకు ప్రపంచ వేదికపై ఆసియా కతోలికుల ఉమ్మడి స్వరం మరింత స్పష్టంగా, శక్తివంతంగా వినిపించాలని నేను ఆకాంక్షిస్తున్నాను" అని ఆయన తెలిపారు.