దేవుని మహిమను చాటుతూ.. విశ్వాసులను పవిత్రపరిచేదే పవిత్ర సంగీతం – పోప్ లియో
దేవుని మహిమను చాటుతూ.. విశ్వాసులను పవిత్రపరిచేదే పవిత్ర సంగీతం – పోప్ లియో
బుధవారం జరిగిన సాధారణ సమావేశంలో పరిశుద్ధ లియో XIV పాపు గారు ఆరాధనలో పవిత్ర సంగీతం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పవిత్ర సంగీతం ప్రార్థనకు స్వరాన్ని అందిస్తూ, విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుందని చెప్పారు. దేవుణ్ణి మహిమపరచడం, విశ్వాసులు పవిత్రతలో ఎదగడానికి సహాయపడటమే పవిత్ర సంగీతం ప్రధాన లక్ష్యం అని పోప్ పేర్కొన్నారు.
పోప్ లియో XIV రెండవ వాటికన్ కౌన్సిల్కు చెందిన ‘శాక్రోసాంక్టమ్ కాన్సిలియమ్’(Sacrosanctum Concilium) గ్రంథంపై తన ప్రసంగాల పరంపరను కొనసాగిస్తున్నారు. ఈ వారం ఆయన ఆ గ్రంథంలోని పవిత్ర సంగీతానికి సంబంధించిన ఆరవ అధ్యాయంపై ప్రసంగించారు.
సంగీతం కేవలం వినోదం లేదా ప్రదర్శన కోసం కాదు అని , దేవుని మహిమను చాటేందుకు, విశ్వాసుల హృదయాలను దేవుని వైపు నడిపించేందుకు ఉపయోగపడాలని పరిశుద్ధ లియో XIV పాపు గారు అన్నారు. దివ్యబలి పూజలో పవిత్ర సంగీతానికి ప్రత్యేకమైన స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు.
సంగీతం ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తుందని పరిశుద్ధ లియో XIV పాపు గారు అన్నారు. కలిసి గానం చేయడం ద్వారా మనుషుల మధ్య ఉన్న విభేదాలు తొలగి, అందరూ దేవుని స్తుతిలో ఏకమవుతారని చెప్పారు. అలాగే, సంగీతం దేవుని కృపకు మన హృదయాలను తెరిచి, ఆయనకు అనుగుణంగా మన జీవితాలను మార్చుకోవడానికి సహాయపడుతుందని పోప్ పేర్కొన్నారు.
సెమినరీలు, మతపరమైన శిక్షణా కేంద్రాలు, కాథలిక్ సంస్థలు, పాఠశాలల్లో పవిత్ర సంగీతంపై తగిన శిక్షణ, అభ్యాసం అందించాల్సిన అవసరాన్ని కూడా పోప్ గుర్తుచేశారు. సంగీతకారులు, గాయకులు సంగీత నైపుణ్యంతో పాటు ప్రార్థనా విధానంపై కూడా మంచి శిక్షణ పొందాలని సూచించారు.
పవిత్ర సంగీతం శ్రీసభ సంప్రదాయంలోని విలువైన ఆధ్యాత్మిక సంపద అని పేర్కొంటూ, దాని గౌరవాన్ని కాపాడుతూ, ఆరాధనలోని పవిత్రతకు అనుగుణంగా సంగీతాన్ని ఉపయోగించాలని పరిశుద్ధ లియో XIV పాపు గారు పిలుపునిచ్చారు.
Article and Design By M Kranthi Swaroop
