FABC ప్లీనరీ సమావేశానికి ముందు వారధుల నిర్మాణంలో శ్రీలంక శ్రీసభ అనుభవం

శ్రీలంక శ్రీసభ అనుభవం

జూలై 20–26 తేదీల్లో ఇండోనేషియాలోని జకార్తాలో జరగనున్న Federation of Asian Bishops' Conferences (FABC) 12 వ ప్లీనరీ సమావేశానికి ఆసియాలోని కతోలిక శ్రీసభ సిద్ధమవుతున్న వేళ, "సినడల్ స్ఫూర్తికి పిలుపు – ఆసియాలో వారధులు మరియు వారధుల నిర్మాణకర్తలుగా ఉండే శ్రీసభకు పిలుపు" అనే సమావేశ ప్రధాన అంశానికి శ్రీలంక శ్రీసభ తన ప్రత్యేక అనుభవాన్ని అందిస్తోంది.

బౌద్ధులు అధిక సంఖ్యలో నివసించే శ్రీలంకలో, హిందూ, ముస్లిం, క్రైస్తవ సమాజాలతో కలిసి జీవిస్తున్న నేపథ్యంలో, వారధుల నిర్మాణం శ్రీసభకు అంతర్గతంగానూ, బాహ్యంగానూ ఒక ముఖ్యమైన సేవగా మారింది. ఒకవైపు తనలోని ఐక్యతను బలోపేతం చేస్తూనే, మరోవైపు ఇతర క్రైస్తవ సంఘాలు, వివిధ మత సంప్రదాయాలతో సంభాషణ, సహకారాన్ని పెంపొందించేందుకు శ్రీసభ కృషి చేస్తోంది.

శ్రీలంకలో క్రైస్తవ ఐక్యత, అంతర్మత సంభాషణలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1980, 1990 దశాబ్దాల్లో దివంగత జెస్విట్ దైవశాస్త్రవేత్త గురుశ్రీ అలోయ్షియస్ పియెరిస్, SJ చేసిన కృషితో ఈ ఉద్యమానికి కొత్త ఊపు వచ్చింది. ప్రస్తుతం కారిటాస్ శ్రీలంక (SEDEC), మరదానాలోని సెంటర్ ఫర్ సొసైటీ అండ్ రిలిజన్ (CSR), అలాగే పీఠాధిపతి జూడ్ నిశాంత సిల్వా నాయకత్వంలోని క్రైస్తవ ఐక్యత మరియు అంతర్మత సంభాషణ పీఠాధిపతుల కమిషన్ ఈ సేవను ముందుకు తీసుకెళ్తున్నాయి.

అయితే, మతం మరియు జాతీయ గుర్తింపు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న శ్రీలంకలో వారధుల నిర్మాణం అంత సులభం కాదు. కొన్ని జాతీయవాద వర్గాలు క్రైస్తవ సమాజాన్ని పాశ్చాత్య ప్రభావానికి ప్రతినిధిగా చిత్రీకరించడం వల్ల అంతర్మత సంభాషణ సున్నితమైన అంశంగా మారుతోంది.

ఈ సవాళ్ల మధ్య కూడా, కతోలిక శ్రీసభలోని కొందరు వ్యక్తులు సంభాషణకు చిరస్థాయి చిహ్నాలుగా నిలిచారు. ఓబ్లేట్ మిషనరీ గురుశ్రీ మైకేల్ రోడ్రిగో బుట్టల ప్రాంతంలోని బౌద్ధ సమాజంతో కలిసి జీవించి సేవలందించారు. 1987లో పవిత్ర దివ్యబలిపూజ అర్పిస్తున్న సమయంలో ఆయన హత్యకు గురయ్యారు.

అలాగే మరో ఓబ్లేట్ గురువు గురుశ్రీ మార్సెలిన్ జయకోడి, శ్రీలంక సంస్కృతిని ప్రోత్సహించడం, బౌద్ధ-క్రైస్తవ పరస్పర అవగాహనను పెంపొందించడం ద్వారా జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందారు. ఈ సేవలకు గాను ఆయనకు రామన్ మాగ్సెసే పురస్కారం లభించింది.

వివిధ మతాలకు చెందిన విద్యార్థులకు విద్యను అందిస్తూ, సహజీవన విలువలను పెంపొందించడంలో కతోలిక విద్యాసంస్థలు కూడా విశేష పాత్ర పోషించాయి. ఈ విద్యాసంస్థల నుంచే దేశ నిర్మాణానికి అంకితమైన అనేక మంది నాయకులు తీర్చిదిద్దబడ్డారు.

Cardinal Malcolm Ranjith
Cardinal Malcolm Ranjith of Colombo appealed for calm and restraint after the Easter Sunday terrorist attacks on April 21, 2019, helping prevent retaliatory violence and promote national reconciliation. (Photo: National Catholic Register)

2019 ఏప్రిల్ 21న జరిగిన ఈస్టర్ ఆదివారం ఉగ్రదాడుల అనంతరం జాతీయ సామరస్యాన్ని కాపాడడంలో శ్రీసభ కీలక పాత్ర పోషించింది. ప్రతీకార హింస చెలరేగే ప్రమాదం నెలకొన్న సమయంలో, కొలంబో అగ్రపీఠాధిపతి కార్డినల్ మాల్కమ్ రంజిత్, గురువులు, సామాన్య విశ్వాసులతో కలిసి ప్రజలను శాంతి, సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. వారి కృషి వల్ల విస్తృత స్థాయి మత ఘర్షణలు నివారించబడటమే కాకుండా, ముస్లిం సమాజంతో ఉన్న సంబంధాలు కూడా పరిరక్షించబడ్డాయి.

స్థానిక స్థాయిలో, కతోలికులు అల్పసంఖ్యాకులుగా ఉన్న బడుల్లా, గాలే, అనురాధపుర, కాండీ మేత్రాసనాల్లోని పీఠాధిపతులు, గురువులు బౌద్ధ, హిందూ, ముస్లిం మత నాయకులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నారు. అయితే ఈ సంబంధాలను గ్రామీణ స్థాయిలో మరింత బలమైన సహకారంగా మార్చడం ఇప్పటికీ సవాలుగానే ఉందని శ్రీసభ నాయకులు అంగీకరిస్తున్నారు. నిజమైన వారధుల నిర్మాణం రాజకీయ ప్రయోజనాలు లేదా ప్రతీకాత్మక కార్యక్రమాలపై కాకుండా, ఉమ్మడి ఆధ్యాత్మిక విలువలపై ఆధారపడాలని వారు స్పష్టం చేస్తున్నారు.

రాబోయే FABC 12 వ ప్లీనరీ సమావేశం, సమాజంతో సంభాషణను మరింత లోతుగా కొనసాగించడంతో పాటు, స్థానిక శ్రీసభల్లో సినడాలిటీని బలోపేతం చేయడానికి ప్రోత్సాహాన్నిస్తుందని భావిస్తున్నారు.

ఈ అంశంపై స్పందిస్తూ డా. సిస్టర్ రసికా పియెరిస్ మాట్లాడుతూ, సినడల్ శ్రీసభ అనేది అందరినీ భాగస్వాములను చేసే శ్రీసభ కావాలని, బాప్తిస్మం పొందిన ప్రతి విశ్వాసి శ్రీసభ సేవలో బాధ్యతను పంచుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాలంటే సంభాషణ, పరస్పర వినికిడి, వారధుల నిర్మాణం అత్యంత అవసరమని ఆమె అన్నారు. అలాగే, గురుకేంద్రీకృత దృక్పథాన్ని అధిగమించి, ప్రతి విశ్వాసి సమాన గౌరవం, పిలుపును గుర్తించే శ్రీసభగా ఎదగాలని ఆమె పిలుపునిచ్చారు.

కెలనియా విశ్వవిద్యాలయానికి చెందిన సామాన్య విశ్వాసి దైవశాస్త్రవేత్త ప్రొఫెసర్ షర్లీ లాల్ విజయసింఘే కూడా, సినడాలిటీకి ఆచరణాత్మక పాస్టోరల్ సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. విచారణ జీవితం పునరుద్ధరణ, శిక్షణ పొందిన సామాన్య విశ్వాసులను సేవల్లో మరింత భాగస్వాములను చేయడం, విశ్వాస బోధన కార్యక్రమాలను ఆధునికీకరించడం, విచారణల నిర్ణయ ప్రక్రియల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, ఆర్థిక పారదర్శకతను బలోపేతం చేయడం, భవనాల నిర్మాణం కంటే మనుషుల నిర్మాణంపై ఎక్కువ పెట్టుబడి పెట్టడం వంటి అంశాలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఆసియా దేశాల పీఠాధిపతులు జకార్తాలో సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్న ఈ సమయంలో, తనలోని సమాజంలోనూ, ఆసియాలోని వైవిధ్యభరిత మత, సాంస్కృతిక ప్రపంచంలోనూ వారధులను నిర్మించే శ్రీసభగా ఎదగడంలో ఉన్న అవకాశాలు, సవాళ్లు రెండింటినీ శ్రీలంక శ్రీసభ అనుభవం స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.