ఉక్రెయిన్‌కు ప్రత్యేక ప్రతినిధిని పంపిన పోప్ లియో

రష్యా–ఉక్రెయిన్ మధ్య సాయుధ ఘర్షణలు మరింత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో, పోప్ లియో ఉక్రెయిన్‌కు తమ ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల కార్యదర్శి ఆర్చ్‌బిషప్ పాల్ రిచర్డ్ ను పంపించారు.

అయితే, ఈ పర్యటనకు కారణం యుద్ధానికి సంబంధించిన దౌత్య చర్చలు మాత్రమే కాదు. 

ఉక్రెయిన్‌లో లాటిన్ కి చెందిన కథోలిక సంఘం పునరుద్ధరించబడి 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే రెండవ జాన్ పాల్ పోప్ ఉక్రెయిన్‌కు చేసిన చారిత్రాత్మక అపోస్తలిక పర్యటనకు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక వేడుకల్లో పాల్గొనడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.

ఈ సందర్భంగా ఆర్చ్‌బిషప్  పాల్ రిచర్డ్ కు పంపిన లేఖలో, పోప్ లియో  సోవియట్ పాలనలో తీవ్ర హింసలు, అణచివేతలను ఎదుర్కొన్నప్పటికీ తమ విశ్వాసాన్ని ధైర్యంగా కాపాడుకున్న ఉక్రెయిన్ కతోలికుల విశ్వాస సాక్ష్యాన్ని ప్రశంసించారు.

అలాగే, 13వ శతాబ్దానికి చెందిన తొమ్మిదవ పోప్ గ్రెగరీ వారు నేటి ఉక్రెయిన్ ప్రాంతంలో నివసించిన లాటిన్ రీతికి చెందిన గురువులకు, విశ్వాసులకు రాసిన లేఖను కూడా ఆయన గుర్తు చేశారు. 

ఆ లేఖలో, దుష్టుల దాడులను చూసి నిరుత్సాహపడవద్దు అంటూ విశ్వాసంలో స్థిరంగా నిలవాలని పోప్ గ్రెగరీ వారు ప్రోత్సహించిన విషయాన్ని పోప్ లియో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

పోప్ లియో తరఫున, ఆర్చ్‌బిషప్ పాల్ రిచర్డ్ ఉక్రెయిన్ ప్రజలకు పోప్ యొక్క సాన్నిహిత్యాన్ని తెలియజేయనున్నారు. 

ఇదిలా ఉండగా, ఇటీవల జపోరిజ్జియా ప్రాంతంపై రష్యా భారీ దాడులు జరపగా, ఉక్రెయిన్ కూడా తన చరిత్రలోనే అతిపెద్ద నౌకాదళ డ్రోన్ దాడిని నిర్వహించినట్లు సమాచారం.

యుద్ధం కొనసాగుతున్న ఈ క్లిష్ట సమయంలో, శాంతి కోసం ప్రార్థన, విశ్వాసంలో స్థిరత్వం, ఆశను బలపరిచే సందేశంతో పోప్ లియో చేపట్టిన ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా విశేషంగా చర్చనీయాంశమవుతోంది.