ఆసియాలో నిరీక్షణకు సహచరులుగా ఉండండి: FABC సువార్త ప్రకటనా విభాగం అధ్యక్షుని పిలుపు

ఆసియాలో నిరీక్షణకు సహచరులుగా ఉండండి: FABC సువార్త ప్రకటనా విభాగం అధ్యక్షుని పిలుపు
FABC ప్లీనరీ సమాఖ్య సమావేశానికి ముందు, FABC సువార్త ప్రకటనా విభాగం (FABC-OE) అధ్యక్షుడు మహా పూజ్య అగ్రపీఠాధిపతి సైమన్ పోహ్, ఆసియా కతోలికులు క్రీస్తు ఆశను పంచే "ఆశకు పొరుగువారిగా" మారాలని పిలుపునిచ్చారు.

ఇండోనేషియాలోని జకార్తాలో జరగనున్న Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశానికి ఆసియా నలుమూలల నుంచి పీఠాధిపతులు సమాయత్తమవుతున్న వేళ, FABC సువార్త ప్రకటనా విభాగం (FABC-OE) అధ్యక్షుడు, మలేషియాకు చెందిన అగ్రపీఠాధిపతి మహా పూజ్య సైమన్ పోహ్, ఆసియాలోని కతోలికులను "నిరీక్షణకు సహచరులుగా" మారాలని పిలుపునిచ్చారు. క్రీస్తు కరుణ, కనికరం, స్వస్థపరిచే ప్రేమను బహుళ సంస్కృతులు, భిన్న సంప్రదాయాలతో నిండిన ఆసియా ప్రజలతో పంచుకోవాలని ఆయన ప్రోత్సహించారు.

జూలై 20–26 తేదీల్లో జరగనున్న ప్లీనరీ సమావేశానికి ముందు విడుదల చేసిన తన సందేశంలో అగ్రపీఠాధిపతి పోహ్, ఆసియా అనేది అనేక సంస్కృతులు, జాతులు, మత సంప్రదాయాల సమ్మేళనమైన ఖండమని పేర్కొన్నారు. శతాబ్దాలుగా వివిధ మతాలకు చెందిన ప్రజలు పరస్పరం కలిసి జీవించినప్పటికీ, ఈ ప్రాంతం సంఘర్షణలు, వలస పాలన, విభజనల వంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొందని ఆయన గుర్తుచేశారు.

ఈ సవాళ్ల మధ్య కూడా, శాంతియుత సహజీవనం, సామరస్యం, పరస్పర గౌరవం పట్ల ఆసియా సమాజాలలో బలమైన ఆకాంక్ష నేటికీ సజీవంగా ఉందని ఆయన అన్నారు.

రాబోయే FABC ప్లీనరీ సమావేశం, 2025 సెప్టెంబరులో పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ జకార్తా పర్యటన సందర్భంగా అందించిన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తుందని అగ్రపీఠాధిపతి పోహ్ తెలిపారు. విభిన్న నేపథ్యాల ప్రజల మధ్య సౌభ్రాతృత్వం, సంభాషణ, సంఘీభావాన్ని మరింత బలపరచాలని పోప్ ఆ సందర్భంగా శ్రీసభకు పిలుపునిచ్చారని ఆయన గుర్తుచేశారు.

"ఈ FABC ప్లీనరీ సమావేశం ద్వారా, ఆసియాలోని అన్ని మతాలు, సంస్కృతులు, దేశాలకు చెందిన ప్రజల మధ్య వారధులను నిర్మించే శ్రీసభ సేవను పోప్ ఫ్రాన్సిస్ ప్రారంభించిన స్ఫూర్తితో మేము కొనసాగిస్తున్నాము," అని అగ్రపీఠాధిపతి పోహ్ పేర్కొన్నారు.
 

 అగ్రపీఠాధిపతి  మహా పూజ్య సైమన్ పోహ్
క్రీస్తు కరుణ, సమాధానం, స్వస్థపరిచే ప్రేమ ఆసియా వ్యాప్తంగా ఉన్న కతోలికుల జీవితాల్లోనూ, శ్రీసభ నాయకుల పరిచర్యలోనూ సజీవ సాక్ష్యంగా వెలుగొందాలని శ్రీసభ ఆకాంక్షిస్తోందని అగ్రపీఠాధిపతి మహా పూజ్య సైమన్ పోహ్ పేర్కొన్నారు.

సువార్త ప్రకటనా దృక్కోణంలో శ్రీసభ బాధ్యత కేవలం సువార్తను ప్రకటించడం మాత్రమే కాదని, క్రీస్తు కరుణ, కనికరం, సమాధానం, స్వస్థతను సమాజానికి అందించడం కూడా అంతే ముఖ్యమని ఆయన వివరించారు. స్నేహం, సహయాత్ర అనే జీవనశైలిని అవలంబిస్తూ, "ఒక్కో పొరుగువారిని చేరుకుంటూ" సువార్తను పంచుకోవాలని FABC సువార్త ప్రకటనా విభాగం ఆసియా కతోలికులను ప్రోత్సహిస్తోందని చెప్పారు.

మంచి సమరయుడి ఉపమానాన్ని ప్రస్తావిస్తూ, బాధలో ఉన్నవారికి, అన్యాయానికి గురైనవారికి, సమాజం వెలుపల నెట్టివేయబడినవారికి దేవుని కరుణను అందించే మంచి పొరుగువారిగా క్రైస్తవులు జీవించాలని ఆయన పిలుపునిచ్చారు.

అలాగే, 2025 నవంబరులో మలేషియాలోని పెనాంగ్‌లో నిర్వహించిన FABC-OE మిషన్ కాంగ్రెస్ – "ది గ్రేట్ పిల్గ్రిమేజ్ ఆఫ్ హోప్" కార్యక్రమాన్ని ఆయన ప్రస్తావించారు. సంభాషణ, పరస్పర సంబంధాలు, కరుణతో కూడిన సాన్నిధ్యం ద్వారా ఆసియా సందర్భంలో సువార్తకు ఎలా సాక్ష్యమివ్వాలనే అంశంపై ఆ సమావేశంలో లోతైన చర్చలు జరిగాయని తెలిపారు.

"ఆసియా మైనర్‌లోని బెత్లెహేములో జన్మించిన యేసు నిజమైన ఆసియా వాసియే," అని అగ్రపీఠాధిపతి పోహ్ పేర్కొన్నారు. కథల ద్వారా, వినయపూర్వకమైన సన్నిహిత సంబంధాల ద్వారా, స్వస్థపరిచే సేవ ద్వారా, క్షమాపణ ద్వారా యేసు దేవుని ప్రేమను ప్రపంచానికి వెల్లడించారని ఆయన అన్నారు.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, Evangelii Gaudiumలో పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా, సమాజపు అంచుల్లో జీవిస్తున్న ప్రజలను చేరుకునే సేవను FABC సువార్త ప్రకటనా విభాగం మరింత విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో FABC క్రైస్తవ ఐక్యత మరియు అంతర్మత వ్యవహారాల విభాగం (FABC-OEIA), FABC దైవశాస్త్ర సంబంధిత అంశాల విభాగం (FABC-OTC)లతో కలిసి 2026 డిసెంబరులో ఆసియా ఆదివాసీ సమాజాల ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమం ద్వారా ఆదివాసీ సమాజాల స్వరాన్ని మరింత బలంగా ప్రపంచానికి వినిపించడం, సువార్తకు మరియు వారి సంస్కృతులకు మధ్య వారధులను నిర్మించడం, అలాగే వాతావరణ మార్పుల సవాళ్ల మధ్య తమ పూర్వీకుల భూములను పరిరక్షిస్తూ ప్రకృతితో సామరస్యంగా జీవిస్తున్న వారి అనుభవాల నుంచి నేర్చుకోవడం ప్రధాన లక్ష్యాలని ఆయన వివరించారు.

చివరగా, క్రీస్తు కరుణ, సమాధానం, స్వస్థపరిచే ప్రేమ ఆసియాలోని కతోలికుల జీవితాల్లోనూ, శ్రీసభ నాయకుల పరిచర్యలోనూ ప్రత్యక్షమై, మరింత శాంతియుతమైన, సామరస్యపూరితమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని శ్రీసభ ఆకాంక్షిస్తోందని అగ్రపీఠాధిపతి పోహ్ ఆశాభావం వ్యక్తం చేశారు.