FABC ప్లీనరీ సమావేశంలో భాగంగా ‘టన్నెల్ అఫ్ ఫ్రెండ్షిప్’ ను సందర్శించనున్న ఆసియా పీఠాధిపతులు

FABC ప్లీనరీ సమావేశంలో భాగంగా ‘టన్నెల్ అఫ్ ఫ్రెండ్షిప్’ ను సందర్శించనున్న ఆసియా పీఠాధిపతులు
జకార్తాలో జరుగనున్న FABC 12వ ప్లీనరీ సమాఖ్య సమావేశంలో ఇండోనేషియా అంతర్మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన "స్నేహ సొరంగం" (Tunnel of Friendship), ఇస్తిక్లాల్ మసీదును ఆసియా పీఠాధిపతులు సందర్శించనుండగా, ఆ దేశం మత సామరస్య వారసత్వం ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది.

ఇండోనేషియాలోని జకార్తాలో జరగనున్న Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశంలో, దేశం ఎన్నో దశాబ్దాలుగా ఆచరిస్తున్న అంతర్మత సామరస్య సంప్రదాయం ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. ఆసియా నలుమూలల నుంచి విచ్చేస్తున్న వందలాది కతోలిక పీఠాధిపతులు, మత సామరస్యానికి ప్రతీకలుగా నిలిచిన "టన్నెల్ అఫ్ ఫ్రెండ్షిప్" (Tunnel of Friendship) మరియు ఇస్తిక్లాల్ మసీదును సందర్శించనున్నారు.

జూలై 26న జరిగే ముగింపు కార్యక్రమంలో భాగంగా, పీఠాధిపతులు ముందుగా జకార్తా బృహద్దేవాలయంలో పవిత్ర దివ్యబలిని సమర్పించి, అనంతరం టన్నెల్ అఫ్ ఫ్రెండ్షిప్ గుండా నడుచుకుంటూ ఆగ్నేయ ఆసియాలోనే అతిపెద్ద మసీదైన ఇస్తిక్లాల్ మసీదుకు చేరుకుంటారు.

ఈ సొరంగం కేవలం భూగర్భ మార్గం మాత్రమే కాదు. ఇది ఇండోనేషియాలోని మత సమాజాల మధ్య సంభాషణ, పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రతీకగా నిలిచింది.

ఈ సొరంగం నిర్మాణ ఆలోచనను అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో 2020లో ఇస్తిక్లాల్ మసీదు పునరుద్ధరణ పనుల సందర్భంగా ప్రతిపాదించారు. 2021 జనవరిలో నిర్మాణం ప్రారంభమై, ఇండోనేషియా వ్యవస్థాపక అధ్యక్షుడు సుకార్నో కాలం నుంచి ఒకదానికొకటి ఎదురెదురుగా నిలిచిన ఇస్తిక్లాల్ మసీదు మరియు జకార్తా బృహద్దేవాలయం మధ్య నేరుగా అనుసంధానం కల్పించే భూగర్భ మార్గంగా రూపుదిద్దుకుంది.

ఈ సొరంగం కేవలం రాకపోకల సౌలభ్యం కోసం కాదు; అంతర్మత స్నేహానికి సజీవ చిహ్నంగా నిర్మించబడింది. 2024 సెప్టెంబరులో పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారు ఇండోనేషియా అపోస్తలిక పర్యటన సందర్భంగా ఇస్తిక్లాల్ మసీదులో నిర్వహించిన అంతర్మత సమావేశంలో ఈ ప్రదేశాన్ని సందర్శించడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందింది. అనంతరం 2024 డిసెంబరులో ప్రజల సందర్శనార్థం అధికారికంగా ప్రారంభించారు.

ఇండోనేషియా సాధించిన అనుభవం
విభిన్న మతాలు, జాతులు, సంస్కృతులకు చెందిన సమాజాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడంలో ఇండోనేషియా సాధించిన అనుభవం అంతర్జాతీయ సమాజానికి ఒక ముఖ్యమైన ఆదర్శంగా నిలుస్తుందని ఆ దేశ మత వ్యవహారాల మంత్రి నసరుద్దీన్ ఉమర్ తెలిపారు.

ఇండోనేషియా మత వ్యవహారాల మంత్రి నసరుద్దీన్ ఉమర్, మత, జాతి, సాంస్కృతిక వైవిధ్యాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడంలో ఇండోనేషియా సాధించిన అనుభవం ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా FABC ప్లీనరీ సమావేశంలో పాల్గొనే ప్రతినిధులకు ఒక ఆదర్శమని పేర్కొన్నారు.

"సామరస్యాన్ని పెంపొందించడంలో ఇండోనేషియాకు అపారమైన సామాజిక మూలధనం ఉంది. ఆసియా నలుమూలల నుంచి పీఠాధిపతులు ఇక్కడికి రావడం ద్వారా భిన్నత్వం అడ్డంకి కాదని, శాంతిని కలిసి నిర్మించుకునే శక్తిగా మారగలదని ప్రపంచానికి చూపించే అవకాశం కలుగుతోంది," అని ఆయన అన్నారు.

జకార్తా బృహద్దేవాలయం, ఇస్తిక్లాల్ మసీదు రెండూ ఇండోనేషియా జాతీయ విలువలకు ప్రతీకలని, సంభాషణ, పరస్పర గౌరవం, సంఘీభావం అనే విలువలే దేశ మతజీవితానికి పునాదులని ఆయన వివరించారు.

"ఈ ప్రతీకలను పాల్గొనేవారు కేవలం చూడడమే కాదు; ఇండోనేషియా ప్రజల దైనందిన జీవితంలో మత సామరస్యం ఎలా ఆచరణలో ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించాలని మేము కోరుకుంటున్నాం," అని FABC సమావేశ ఏర్పాట్లపై ఇండోనేషియా కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (KWI) ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన తెలిపారు.

బాండుంగ్ పీఠాధిపతి మహా పూజ్య ఆంటోనియస్ సుబియాంటో బుంజామిన్, ఇండోనేషియా కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు, టన్నెల్ అఫ్ ఫ్రెండ్షిప్  మరియు ఇస్తిక్లాల్ మసీదు సందర్శనను ప్లీనరీ సమావేశం అధికారిక ముగింపు కార్యక్రమంలో చేర్చినట్లు ధృవీకరించారు.

ఈ కార్యక్రమంలో ఆసియా నలుమూలల నుంచి సుమారు 110 మంది పీఠాధిపతులతో పాటు, అమెరికా, ఆఫ్రికా, ఓషియానియా, యూరప్ ఖండాల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఇస్తిక్లాల్ మసీదులో వారిని ఆ మసీదు గ్రాండ్ ఇమామ్ హోదాలో ఉన్న మంత్రి నసరుద్దీన్ ఉమర్ అధికారికంగా ఆహ్వానించనున్నారు.

"ముగింపు కార్యక్రమంలో భాగంగా పీఠాధిపతులు, ప్రతినిధులు టన్నెల్ అఫ్ ఫ్రెండ్షిప్ ను సందర్శించి, అనంతరం ఇస్తిక్లాల్ మసీదులో అధికారిక స్వాగతం అందుకుంటారని మంత్రి ధృవీకరించారు," అని పీఠాధిపతి ఆంటోనియస్ తెలిపారు.

జకార్తా  అగ్రపీఠాధిపతి మహా పూజ్య కార్డినల్ ఇగ్నేషియస్ సుహార్యో మాట్లాడుతూ, ఈ సందర్శన FABC 12వ ప్లీనరీ సమావేశం ప్రధాన ఇతివృత్తమైన —

"మీరు ఇంకా గొప్ప కార్యాలను చూస్తారు" (యోహాను 1:50): సమాఖ్య పరివర్తనకు పిలుపు మరియు ఆసియాలో వారధులుగా, వారధులను నిర్మించేవారిగా ఉండే శ్రీసభ పరిచర్య అనే సందేశానికి సజీవ ప్రతిరూపమని అన్నారు.

"విభిన్న మతాలు, సంస్కృతులకు చెందిన ప్రజలను కలుసుకోవడం ద్వారా మనం మరింత గొప్ప కార్యాలను చూస్తాం. సంభాషణ అనే వారధులను నిర్మించినప్పుడు దేవుడు మరింత గొప్ప అవకాశాలను మన ముందుంచుతాడు. అందుకే 'టన్నెల్ అఫ్ ఫ్రెండ్షిప్ ' ఇండోనేషియా వైవిధ్యంలో సామరస్యంగా జీవించాలనే ఆకాంక్షకు శాశ్వత ప్రతీకగా నిలుస్తోంది," అని కార్డినల్ సుహార్యో పేర్కొన్నారు.