దేవాలయ పవిత్రతను కాపాడేందుకు పాకిస్తాన్ అగ్రపీఠాధిపతి వివాహ ఫోటోగ్రఫీ మార్గదర్శకాలు జారీ చేశారు

పాకిస్తాన్ అగ్రపీఠాధిపతి వివాహ ఫోటోగ్రఫీ మార్గదర్శకాలు జారీ చేశారు

దేవాలయ పవిత్రతను కాపాడేందుకు పాకిస్తాన్ అగ్రపీఠాధిపతి వివాహ ఫోటోగ్రఫీ మార్గదర్శకాలు జారీ చేశారు

పాకిస్తాన్‌లోని లాహోర్ కతోలిక అగ్రపీఠానికి చెందిన అగ్రపీఠాధిపతి మహా పూజ్య బెన్నీ మారియో ట్రావిస్ గారు చర్చ్ ప్రాంగణంలో జరిగే వివాహ ఫోటోగ్రఫీపై కఠిన మార్గదర్శకాలను జారీ చేశారు. ఇవి చర్చ్ గౌరవం మరియు వివాహ సాంఘ్య  పవిత్రతను కాపాడేందుకు ఉద్దేశించబడ్డాయి.

ఈ ఆదేశం వివాహాల సమయంలో పెరుగుతున్న “పోజింగ్-స్టైల్” ఫోటోగ్రఫీ ధోరణికి ప్రతిస్పందనగా వచ్చింది. ఈ విధానం వివాహ సాఘ్యం యొక్క పవిత్రతను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. 2026 మార్చి 10న విడుదల చేసిన లేఖలో, అగ్రపీఠాధిపతి మహా పూజ్య  ట్రావిస్ గారు పీఠం లోని గురువులు, మతపరులు మరియు విశ్వాసులకు చర్చ్‌ను ప్రార్థనా స్థలంగా గౌరవించాలని పిలుపునిచ్చారు.

“లాహోర్‌లోని ప్రధాన దేవాలయం మరియు ఇతర అనేక చర్చ్‌లలో కొత్తగా వివాహం చేసుకున్న జంటలు మరియు వారి కుటుంబాలు వివాహ సాంగ్యానికి ముందు మరియు తర్వాత విస్తృతంగా ఫోటోగ్రఫీ నిర్వహిస్తున్నారని నా దృష్టికి వచ్చింది,” అని ఆయన అన్నారు. “వివాహ ఆనందాన్ని మనం జరుపుకుంటున్నప్పటికీ, దేవుని ఆలయ గౌరవం మరియు పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన అందరిదీ. చర్చ్ ప్రధానంగా ప్రార్థన, ఆరాధన మరియు దేవునితో సాన్నిధ్యం కోసం ఉద్దేశించబడిన స్థలం.”

ఈ మార్గదర్శకాలు ఇలా పేర్కొంటున్నాయి:

ఫోటోగ్రఫీ  వేడుక సమయంలో మాత్రమే, విచారణ గురువు ముందస్తు అనుమతితో అనుమతించబడుతుంది, తద్వారా దివ్యబలిపూజా కార్యక్రమానికి అంతరాయం కలగదు.
వేడుక ముగిసిన తర్వాత, గురువు మార్గదర్శకత్వంలో, జంటతో పాటు వారి సమీప కుటుంబ సభ్యులు మరియు బంధువులతో ఒక గ్రూప్ ఫోటో తీసుకోవచ్చు.
దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కూడా ఒక గ్రూప్ ఫోటో తీసుకోవచ్చు.
స్టూడియో తరహా లేదా “పోజింగ్-స్టైల్” ఫోటోగ్రఫీ దేవాలయం లోపల మరియు ప్రాంగణంలో పూర్తిగా నిషేధించబడింది.

మహా పూజ్య ట్రావిస్ గారు గురువులు మరియు మతపరులను ఈ నియమాలను వివాహానికి ముందు సన్నాహాల్లో మరియు వివాహ దినాన మృదువుగా వివరించాలని కోరారు, తద్వారా జంటలు మరియు కుటుంబాలు పవిత్ర స్థలాల్లో గౌరవాన్ని నిలుపుకోవడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకుంటారు.

లాహోర్‌లోని సెయింట్ ఇగ్నేషియస్ చర్చ్‌కు చెందిన సహాయ విచారణ గురువు గురుశ్రీ అద్నాన్ రషీద్ ఈ మార్గదర్శకాలను స్వాగతించారు.

ఆయన RVAతో మాట్లాడుతూ, “ఫోటోగ్రాఫర్లు మరియు బంధువులు ప్రార్థనా వేడుక సమయంలో ఫోటోలు తీయడంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల గురువు మరియు జంట రెండింటికీ దృష్టి మరలుతుంది. పవిత్ర చిహ్నాల ముందు లేదా చర్చ్ లోపల పోజింగ్-స్టైల్ ఫోటోగ్రఫీ చేయడం వివాహ సాంఘ్యం యొక్క పవిత్రతను తగ్గిస్తుంది,” అన్నారు.

సోషల్ కమ్యూనికేషన్స్ ఎపిస్కోపల్ కమిషన్ కార్యదర్శి గురుశ్రీ  ఖైసర్ ఫిరోజ్  గారు కూడా స్పందిస్తూ, “చర్చ్‌లు స్టూడియోలు లేదా వివాహ హాల్స్ కావు. ఫోటోగ్రఫీ ఆ స్థల పవిత్రతను గౌరవించాలి. చాలామంది అనుకోకుండా చర్చ్‌ను కేవలం ఫోటోలకు బ్యాక్‌డ్రాప్‌గా ఉపయోగిస్తూ గౌరవాన్ని తగ్గిస్తున్నారు,” అన్నారు.

పాకిస్తాన్‌లో రేడియో వెరితాస్ ఆసియా ఉర్దూ సేవను కూడా నిర్వహిస్తున్న గురుశ్రీ ఫెరోజ్, వివాహం అనేది ప్రార్థనాత్మక వేడుకపై దృష్టి పెట్టాల్సిన సమయం అని, సంస్కృతి లేదా ఫోటోగ్రఫీ ప్రదర్శనలపై కాదు అని తెలిపారు.

లాహోర్ అగ్రపీఠం పాకిస్తాన్‌లో అతిపెద్ద కతోలిక మేత్రాసనాలలో ఒకటిగా ఉంది. నగరం మరియు పరిసర ప్రాంతాల్లో విచారణలు, పాఠశాలలు మరియు సామాజిక సేవా కార్యక్రమాలతో విస్తరించిన ఈ మేత్రాసనం, ఈ మార్గదర్శకాలను కేవలం స్థానికంగా కాకుండా ఆసియా వ్యాప్తంగా కతోలిక సమాజాలకు మార్గదర్శకంగా నిలిచేలా చేస్తోంది.