“పవిత్రమైన నిర్లిప్తత”, ‘నేను’ నుంచి ‘వారి’ వైపు ప్రయాణం, కృత్రిమ మేధస్సులో మానవీయత: మూడు అధ్యయనాల్లో ఆసియా డిజిటల్ మిషనరీల ఆత్మపరిశీలన
డిజిటల్ సేవలో అసలు మిషన్ను మరచిపోయే ప్రమాదం, స్వీయ ప్రచారం నుంచి ఇతరుల సేవ వైపు మళ్లాల్సిన అవసరం, కృత్రిమ మేధస్సు వినియోగంలో మానవీయతను కేంద్రంగా ఉంచాల్సిన ప్రాధాన్యంపై ఆసియా నలుమూలల నుంచి వచ్చిన కతోలిక డిజిటల్ మిషనరీలు సెప్టెంబర్ 11న ఫిలిప్పీన్స్లోని క్వెజోన్ సిటీలో నిర్వహించిన మూడు కేస్ స్టడీ చర్చల్లో ఆత్మపరిశీలన చేశారు.
సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు క్వెజోన్ సిటీలోని Radio Veritas Asia (RVA) ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న తొలి ఆసియా కతోలిక డిజిటల్ మిషనరీల సమ్మేళనంలో భాగంగా ఈ చర్చలు నిర్వహించారు. ఆసియా నలుమూలల నుంచి 100 మందికి పైగా కతోలిక డిజిటల్ మిషనరీలు, సమాచార ప్రసారకులు, కంటెంట్ సృష్టికర్తలు, విశ్వాస సంబంధిత ప్రభావశీలులు ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నారు.
Federation of Asian Bishops’ Conferences Office of Social Communication (FABC-OSC), RVA సంయుక్తంగా, వాటికన్ సమాచార ప్రసార డికాస్టరీకి చెందిన Fully Present Network భాగస్వామ్యంతో ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాయి. అపొస్తలుల కార్యములు 4:20లోని “మేము చూసినవాటిని, విన్నవాటిని గురించి మాట్లాడకుండా ఉండలేము” అనే వాక్య స్ఫూర్తితో “ప్రభావశీలుల నుంచి సాక్షులుగా: ఆసియాలో డిజిటల్ సువార్త ప్రచారానికి సినడల్ మార్గం” అనే ఇతివృత్తంతో ఈ సమ్మేళనం కొనసాగుతోంది.
ప్రతినిధులను మూడు బృందాలుగా విభజించి, ప్రతి బృందానికి ఒక కేస్ స్టడీని ఇచ్చారు. అనంతరం తమ ఆత్మపరిశీలనల సారాంశాన్ని పోప్ జాన్ పాల్ II ఆడిటోరియంలో జరిగిన తుది సమావేశంలో పంచుకున్నారు.
ప్రభావం నుంచి “పవిత్రమైన నిర్లిప్తత” వైపు
మొదటి బృందం EB కాన్ఫరెన్స్ రూమ్లో “Influencer Priest” అనే కేస్ స్టడీపై చర్చించింది. ఫిలిప్పీన్స్కు చెందిన ఎడ్విన్ లోపెజ్ ఈ చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించారు. CBCP సామాజిక సమాచార ప్రసార కమిషన్ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన తొలి సామాన్య విశ్వాసి ఆయన. అలాగే EWTN ఆసియా-పసిఫిక్ ప్రాంత అంతర్జాతీయ మేనేజర్గా సేవలందిస్తూ, మకాటి సిటీలోని సాన్ కార్లోస్ సెమినరీలో తత్వశాస్త్రం, దైవశాస్త్రాన్ని బోధిస్తున్నారు.
ఈ బృందం చర్చల సారాంశాన్ని ఇండోనేషియాకు చెందిన డిజిటల్ ఉపదేశి సారా లియా టునాస్ సమర్పించారు. విశ్వాసంపై తనకున్న ఆసక్తిని మార్కెటింగ్ రంగంలోని తన వృత్తితో ఆమె అనుసంధానిస్తున్నారు.
గురుశ్రీ అల్బెర్టో రవాగ్నాని వివాదాస్పద ఉదంతాన్ని పరిశీలించిన ప్రతినిధులు, మొదట సువార్త ప్రచార సాధనంగా ప్రారంభమైన సామాజిక మాధ్యమాల వినియోగం క్రమంగా ఒక మిషనరీ వ్యక్తిత్వాన్ని, ప్రాధాన్యతలను ఎలా మార్చగలదనే అంశంపై చర్చించారు.
డబ్బు, ప్రజాదరణ, అవకాశాలు, కీర్తి, ప్రేక్షకుల అంచనాలు డిజిటల్ సేవను క్రమంగా ఒత్తిడిగా లేదా వ్యసనంగా మార్చే ప్రమాదం ఉందని బృందం పేర్కొంది. ఇతర ప్రభావశీలులతో పోల్చుకోవడం, అల్గోరిథమ్లకు అనుగుణంగా ప్రజాదరణ పొందేందుకు ప్రయత్నించడం కూడా డిజిటల్ మిషనరీలను వారి అసలు పిలుపు నుంచి దూరం చేయగలవని గుర్తించింది.
ఈ నేపథ్యంలో తమ మిషన్లో స్థిరంగా నిలిచేందుకు “పవిత్రమైన నిర్లిప్తత” (Holy Detachment) అవసరమని ప్రతినిధులు సూచించారు. మిషనరీయే మిషన్ కాదని, దేవుని మిషన్లో భాగస్వామి మాత్రమేనని నిరంతరం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
డిజిటల్ వేదికలు ఒక మిషనరీ వ్యక్తిత్వాన్ని నిర్దేశించకుండా ఉండేందుకు క్రమమైన వివేచన, వినయం, మార్గదర్శకత్వం, నిజమైన మానవీయ సంవాదం, సమాజంతో బలమైన అనుబంధం అవసరమని బృందం సూచించింది.
“నేను” నుంచి “వారి” వైపు
రెండో బృందం పోప్ జాన్ పాల్ II కాన్ఫరెన్స్ రూమ్లో “African Digital Influencer” అనే కేస్ స్టడీపై చర్చించింది. ముఖ్యంగా సమాజంలోని అంచుల్లో ఉన్న ప్రజల మధ్య మీడియా, సమాచార ప్రసార అభివృద్ధికి సహకరిస్తున్న Catholic Media Council (CAMECO) కార్యనిర్వాహక సంచాలకుడు, జర్మనీకి చెందిన మైఖేల్ అన్లాండ్ ఈ చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ బృందం చర్చల సారాంశాన్ని ఫిలిప్పీన్స్లోని కటార్మన్ మేత్రాసనానికి చెందిన కరెన్ డి. గజుటోస్ సమర్పించారు. స్థానిక రేడియో ప్రసారకురాలైన ఆమె స్వచ్ఛంద ఉపదేశిగా, సేవాపర సామాన్య సినడల్ కార్యకర్తగా కూడా సేవలందిస్తున్నారు.
సుమారు 200 మంది యువతను అనుసంధానిస్తూ, వారి డిజిటల్ వేదికలను కలిపి, సామాజిక మాధ్యమాల్లో కంటెంట్ను పరస్పరం పంచుకునే African Synodal Digital Youth and Faith Initiative (ASDYFI) గురించి ఈ బృందం అధ్యయనం చేసింది.
విభిన్న భాషలు, సంస్కృతులు, సామాజిక వాస్తవికతలతో కూడిన ఆసియాలో డిజిటల్ సువార్త ప్రచారానికి పరస్పర సహకారం అత్యంత ముఖ్యమైన నేపథ్యంలో, ఈ కార్యక్రమం ఆసియాకు కూడా ఒక ఉపయోగకరమైన నమూనాగా ఉండవచ్చని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
ఆఫ్రికాకు చెందిన యువ డిజిటల్ ప్రభావశీలులు ఆన్లైన్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కాకుండా, అవసరంలో ఉన్నవారికి ఆహారం అందించడం, ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారికి తోడుగా నిలవడం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రతినిధులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
ఈ చర్చ డిజిటల్ మిషనరీలను “నేను” నుంచి “వారి” వైపు ప్రయాణించమని సవాలు చేసింది. అంటే తమను తాము ప్రచారం చేసుకోవడం నుంచి ఇతరుల కథలను, ముఖ్యంగా బలహీనులు, పేదలు, ఒంటరిగా ఉన్నవారు, గొంతులేని ప్రజల కథలను ప్రపంచానికి తెలియజేసే దిశగా మారాలని సూచించింది.
కృత్రిమ మేధస్సు మనలను మరింత మానవీయులుగా మార్చాలి
మూడో బృందం సెయింట్ జోసెఫ్ హాల్లో “AI Priest” అనే కేస్ స్టడీపై చర్చించింది. థాయ్-బ్రిటిష్ మీడియా అధికారి, డిజిటల్ పరివర్తన నిపుణుడు, ప్రపంచ కతోలిక సమాచార ప్రసార సంస్థ SIGNIS ప్రధాన కార్యదర్శి పీటర్ మోంథియెన్విచియెన్చై ఈ చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆయన బ్యాంకాక్లోని LICAS News కార్యనిర్వాహక సంచాలకుడిగా కూడా సేవలందిస్తున్నారు.
ఈ బృందం చర్చల సారాంశాన్ని భారతదేశానికి చెందిన, సామాజిక సమాచార ప్రసారం, జర్నలిజం, కతోలిక మీడియా సేవలో నిపుణుడైన గురుశ్రీ రిచీ విన్సెంట్ సమర్పించారు.
“కృత్రిమ మేధస్సు ఏమి చేయగలదు?” అనే ప్రశ్నను దాటి, “కృత్రిమ మేధస్సును ఉపయోగించడం ద్వారా మనం ఎలాంటి మనుషులుగా మారుతున్నాం?” అనే మరింత లోతైన ప్రశ్నపై ప్రతినిధులు ఆత్మపరిశీలన చేశారు.
కృత్రిమ మేధస్సు మానవ గౌరవం, నిజమైన సంబంధాలు, సామాన్య మేలుకు సేవ చేయాలని వారు నొక్కిచెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రజల్లో నిజమైన మానవ సంబంధాల సామర్థ్యాన్ని తగ్గించడం కాకుండా, ప్రేమ, జ్ఞానం, సృజనాత్మకత, బాధ్యత, సేవలో ఎదగడానికి సహాయపడాలని పేర్కొన్నారు.
“AI Priest” అనే భావన మరిన్ని దైవశాస్త్ర, సేవాపర ప్రశ్నలను ముందుకు తెచ్చింది. సమాచారం అందించడం, పరిశుద్ధ గ్రంథం లేదా శ్రీసభ బోధనల వైపు వినియోగదారులను నడిపించడం వంటి గురువు నిర్వహించే కొన్ని విధులను కృత్రిమ మేధస్సు అనుకరించగలిగినప్పటికీ, గురుత్వాన్ని కేవలం కొన్ని విధులకు పరిమితం చేయలేమని ప్రతినిధులు స్పష్టం చేశారు. గురువు దేవుని ప్రజలకు సేవ చేయడానికి పిలువబడి, సంస్కారపూర్వకంగా అభిషేకం పొందిన మానవ వ్యక్తి అని పేర్కొన్నారు.
ఒంటరితనం, సంబంధాలు, సందేహాలు, విశ్వాసం వంటి వ్యక్తిగత విషయాలను కొందరు యువత కృత్రిమ మేధస్సుతో పంచుకోవడానికి ఎందుకు ఎక్కువగా సౌకర్యంగా భావిస్తున్నారనే అంశాన్ని కూడా బృందం పరిశీలించింది.
కృత్రిమ మేధస్సును పూర్తిగా తిరస్కరించడానికి బదులుగా, దానిని నిజమైన మానవీయ తోడ్పాటుకు వారధిగా ఉపయోగించవచ్చని ప్రతినిధులు సూచించారు. సమాచారం అందించడం, ప్రాథమికంగా ఆలకించడం నుంచి ప్రజలను వివేచన వైపు, చివరకు గురువులు, తల్లిదండ్రులు, సలహాదారులు, సమాజాలతో నిజమైన సంబంధాల వైపు నడిపించడానికి అది సహాయపడగలదని పేర్కొన్నారు.
ఉమ్మడి దిశ
మూడు బృందాల చర్చల అనంతరం ప్రతినిధులు పోప్ జాన్ పాల్ II ఆడిటోరియం వేదికపై తమ ఆత్మపరిశీలనలను ఒక తుది సారాంశంగా పంచుకున్నారు.
ఈ మూడు చర్చలు సమ్మేళనం ప్రధానంగా ప్రతిపాదిస్తున్న “ప్రభావం నుంచి సాక్ష్యం వైపు” అనే ప్రయాణాన్ని ప్రతిబింబించాయి.
ఆసియా డిజిటల్ మిషనరీలకు దీని అర్థం—డిజిటల్ వేదికలు తమ వ్యక్తిత్వాన్ని, మిషన్ను మార్చే ప్రమాదం ఉన్నప్పుడు పవిత్రమైన నిర్లిప్తతను పాటించడం; “నేను” అనే దృష్టి నుంచి “వారి” వైపు మళ్లి ఇతరులను తమ సమాచార ప్రసారానికి కేంద్రంగా ఉంచడం; కృత్రిమ మేధస్సు మానవ వికాసానికి సేవచేసే సాధనంగానే ఉండేలా చూడడం.
చివరగా, ఈ మూడు కేస్ స్టడీలు డిజిటల్ సువార్త ప్రచారం ఫాలోవర్లు, అల్గోరిథమ్లు లేదా వ్యక్తిగత ప్రభావం చుట్టూ కాకుండా, క్రీస్తు, సమాజం, మానవ గౌరవం, నిజమైన సాక్ష్య జీవితం చుట్టూ కేంద్రీకృతం కావాలని స్పష్టం చేశాయి.
