భక్తియుతంగా పవిత్ర తైలముల దివ్య బలిపూజ | St.Mary's Hyd

భక్తియుతంగా పవిత్ర తైలముల దివ్య బలిపూజ

హైదరాబాద్ అతిమేత్రాసనం సెయింట్ మేరీస్ కేథడ్రల్ లో  పవిత్ర తైలముల దివ్య బలిపూజ భక్తియుతంగా జరిగింది. అధిక సంఖ్యలో మేత్రాసన గురువులు తైలాల దివ్యబలి పూజలో పాల్గొన్నారు.

హైదరాబాద్ ఆగ్రపీఠాధిపతులు, కార్డినల్  మహా పూజ్య పూల అంతోని  గారు  మరియు  మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ గారు ఈ  తైలాల ప్రతిష్ట మహా దివ్యపూజాబలిని సమర్పించారు.  

ఈ తైలాల దివ్యబలి పూజలో విశాఖ అతిమేత్రాసనానికి ఎన్నలేని సేవలందించి, విశాఖ విశ్వాసుల హృదయాల్లో ఆధ్యాత్మిక తండ్రిగా నిలిచిన విశాఖ అతిమేత్రాసన విశ్రాంత అగ్రపీఠాధిపతులు  మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ గారు ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ గారు అమూల్యమైన దైవ సందేశాన్ని విశ్వాసులకు అందించారు.  దైవ సందేశమందిస్తూ పవిత్ర తైలాలు, వాటి ఉద్ధేశాల గురించి వివరించారు. గురువుల కోసం ప్రార్థించాలని కోరారు. అనంతరం నూతన తైలాలను కార్డినల్  మహా పూజ్య పూల అంతోనీ గారితో కలసి అభిషేకించారు.ఈ దైవకార్యం కథోలిక సంప్రదాయాలను, విశ్వాసాన్ని బలపరిచింది.

అతిమేత్రాసన గాయక  బృందం మధురమైన గీతాలను ఆలపించారు. అధిక సంఖ్యలో గురువులు, సిస్టర్స్ , విచారణ ప్రజలు ఈ  తైలాల దివ్యబలి పూజలో పాల్గొన్నారు.

దివ్యపూజాబలి ఏర్పాట్లను విచారణ గురువు గురుశ్రీ ఆరోగ్యం గారు పర్యవేక్షించారు.సహాయక గురువులు  ఉపదేశులు, విచారణ యువత ఏలోటూ రాకుండా పండుగ ఏర్పాట్లు చేశారు.   కార్యక్రమంలో వివిధ విచారణల గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులు పాల్గొన్నారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer

 

Telugu Survey Popup Image