"ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సాక్షులుగా మారాలి’”
ఘనంగా మొదలైన ఆసియన్ క్యాథలిక్ డిజిటల్ మిషనరీ అసెంబ్లీ 2026
"ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సాక్షులుగా మారాలి’”
ఆసియన్ క్యాథలిక్ డిజిటల్ మిషనరీ అసెంబ్లీ 2026, ఫిలిపైన్స్ లోని రేడియో వెరితాస్ ఆసియ ప్రధాన కార్యాలయం లో ఘనంగా మొదలయినది. FABC ఆఫీస్ ఆఫ్ సోషల్ కమ్యూనికేషన్ సహకారంతో RVA దీనిని నిర్వహిస్తోంది.
100 మందికి పైగా కాథలిక్ డిజిటల్ మిషనరీలు, కంటెంట్ క్రియేటర్లు, మీడియా ప్రొఫెషనల్స్, పూజారులు, మతసంఘాల ప్రతినిధులు, డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఆసియాలోని వివిధ దేశాల నుంచి పాల్గొన్నారు.
మన తెలుగు విభాగం నుండి ఇన్ఫ్లుయెన్సర్లు " శ్రీ సృజన్ సెగావ్" మరియు "శ్రీ సాగర్ గబ్బెట"లు ఈ "ఆసియన్ క్యాథలిక్ డిజిటల్ మిషనరీ అసెంబ్లీ 2026" లో పాల్గొన్నారు.
మొదటిరోజు సమావేశం దివ్యబలిపూజతో ప్రారంభమైనది. రేడియో వెరితాస్ ఆసియా జనరల్ మేనేజర్ ఫాదర్ ఫెల్మార్ SVD, గారు ఇతర గురువులతో కలసి దివ్యబలిపూజను సమర్పించారు.
వివిధ దేశాల ప్రతినిధులు తమ తమ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనడం ద్వారా ఆసియా చర్చిలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని చూపించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఫిలిప్పీన్స్ సంప్రదాయ నృత్యాలు కూడా ప్రదర్శించారు.
FABC -'ఆఫీస్ ఆఫ్ సోషల్ కమ్యూనికేషన్' (OSC)" అధ్యక్షుడు మహా పూజ్య మార్సెలినో ఆంటోనియో జూనీ మరాలిట్ గారు కీలక ప్రసంగం చేశారు.
ఆయన డిజిటల్ మిషనరీలకు ఒక ముఖ్యమైన పిలుపునిచ్చారు.
కంటెంట్ నుంచి నిజమైన కలయికకు,ప్రేక్షకుల నుంచి సమాజాలకు,వైరల్ కావడం నుంచి విశ్వసనీయతకు,పోటీ నుంచి సహకారానికి, ప్రభావశీలుల నుంచి క్రీస్తు సాక్షులుగా మారడం వైపు మన ప్రయాణం సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
CBCP అధ్యక్షుడు అగ్రపీఠాధిపతులు మహా పూజ్య గిల్బర్ట్ గార్సెరా గారు మాట్లాడుతూ "ఆసియాలో యేసును అరుస్తూ కాదు… ప్రజలకు దగ్గరవుతూ, వారి మాట వింటూ, వారి సంస్కృతులను గౌరవిస్తూ, సేవ చేస్తూ, ప్రేమ ద్వారా మన ప్రభువైన యేసు క్రీస్తు ను పరిచయం చేయాలి" అని ఆయన చెప్పారు.
సెప్టెంబర్ 13 వరకు ఈ ఆసియన్ క్యాథలిక్ డిజిటల్ మిషనరీ అసెంబ్లీ జరగనున్నది.
Article and Design By M Kranthi Swaroop
