ఆసియా లో సువార్త సేవకు నూతన ప్రణాళిక - జకార్తాలో ఆసియా బిషప్ల మహాసభ
ఆసియా లో సువార్త సేవకు నూతన ప్రణాళిక - జకార్తాలో ఆసియా బిషప్ల మహాసభ
ఆసియాలో శ్రీసభ (Catholic church )భవిష్యత్ లక్ష్యాలను నిర్ధారించేందుకు ఆసియా పీఠాధిపతుల (బిషప్ల) సమావేశాల సమాఖ్య (FABC) 12వ ప్లీనరీ అసెంబ్లీ జూలై 20–26 తేదీలలో ఇండోనేషియాలోని జకార్తాలో జరగనుంది. ఈ సమావేశంలో ఆసియా నలుమూలల నుంచి పీఠాధిపతులు (బిషప్), బిషప్ల సమావేశాల ప్రతినిధులు, వాటికన్ అధికారులు, FABC కార్యదర్శులు, వేదాంతవేత్తలు, ఆధ్యాత్మిక నిపుణులు సహా 120 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు.
జకార్తా అతిమేత్రాసనం ఆధ్వర్యంలో హోటల్ ములియా సెనాయన్లో వారం రోజుల పాటు జరిగే ఈ సమావేశం, "ఇంతకంటె గొప్ప కార్యములను నీవు చూడగలవు" (యోహాను 1:50) అనే బైబిల్ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని, "సినోడల్ మార్పు మరియు ఆసియాలో వారధులను నిర్మించే శ్రీసభ మిషన్" అనే అంశంపై చర్చించనుంది.
ఈ కార్యక్రమం బొంబాయికి చెందిన అగ్రపీఠాధిపతులు ఎమెరిటస్ కార్డినల్ మహా పూజ్య ఓస్వాల్డ్ గ్రాసియాస్ గారి అధ్యక్షతన జరిగే దివ్య సత్ప్రసాద వేడుకతో జూలై 21న ఈ సభ ప్రారంభమవుతుంది.జూలై 22న, సువార్త ప్రచార డికాస్టరీ ప్రో-ప్రిఫెక్ట్ అయిన కార్డినల్ మహా పూజ్య లూయిస్ ఆంటోనియో టాగల్ గారి నేతృత్వంలో రోజంతా ప్రార్థన మరియు స్మరణ కార్యక్రమం జరుగుతుంది.
రాబోయే రోజులలో ఆసియా ఖండం యొక్క మారుతున్న సామాజిక మరియు భౌగోళిక రాజకీయ వాస్తవాలపై ప్రదర్శనలు మరియు చర్చలు జరుగుతాయి.సినోడల్ నాయకత్వం, మతసంబంధమైన పద్ధతులు, మరియు స్థానిక చర్చిల మధ్య సహకారంపై సంభాషణలు, ప్రాంతీయ చర్చలు, మరియు ప్యానెల్ సెషన్లలో కూడా పాల్గొంటారు. జూలై 25న, పాల్గొనేవారు పరిశుద్ధ లియో XIV పాపు గారి నుండి ఒక సందేశాన్ని అందుకుంటారు.
ఫెడరేషన్ ఆఫ్ ఆసియా బిషప్స్ కాన్ఫరెన్స్ (FABC) మతగురువుల కార్యాలయం (Office of Clergy) అధ్యక్షులుగా విశాఖపట్నం అగ్రపీఠాధిపతి మహా పూజ్య ఉడుముల బాల గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Article and Design by M Kranthi Swaroop