బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పిలుపునిచ్చిన పాకిస్తాన్ అగ్రపీఠాధిపతి
ఇస్లామాబాద్-రావల్పిండి అగ్రపీఠాధిపతి అర్చ్బిషప్ జోసెఫ్ అర్షద్, బాలకార్మిక వ్యవస్థను తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ, దానిని నిర్మూలించేందుకు తక్షణమే సమన్వయంతో కూడిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆగస్టు 3న విడుదల చేసిన ఒక ప్రకటనలో, అగ్రపీఠాధిపతి జోసెఫ్ అర్షద్ మాట్లాడుతూ పాకిస్తాన్తో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో బాలకార్మిక వ్యవస్థ తీవ్రమైన నైతిక, సామాజిక మరియు మానవ హక్కుల సమస్యగా మిగిలిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపేద పిల్లలను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు, మత నాయకులు, యజమానులు మరియు సమాజాలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
"ప్రతి చిన్నారికి స్వాభావికమైన ఆత్మగౌరవం ఉంది. విద్యాహక్కు, రక్షణ, వైద్య సంరక్షణ, వ్యక్తిగత వికాసం మరియు సురక్షితమైన బాల్యాన్ని పొందే హక్కు వారికి ఉచితంగా లభించాలి" అని అగ్రపీఠాధిపతి జోసెఫ్ అర్షద్ పేర్కొన్నారు.
పిల్లలు తరగతి గదుల్లో, ఆట స్థలాల్లో, ఆప్యాయత కలిగిన కుటుంబ వాతావరణంలో ఉండాలి తప్ప... కర్మాగారాలు, ఇటుక బట్టీలు, పొలాలు, వర్క్షాప్లు, వీధి వ్యాపారాలు, ఇంటి పనులు లేదా ఇతర ప్రమాదకరమైన పని ప్రదేశాలలో కాదని ఆయన నొక్కి చెప్పారు.
నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ మరియు యూనిసెఫ్ (UNICEF) పాకిస్తాన్ చైల్డ్ లేబర్ సర్వేల గణాంకాలను ప్రస్తావిస్తూ... పాకిస్తాన్లో సుమారు 8.61 మిలియన్ల (86.1 లక్షల) మంది పిల్లలు బాలకార్మికులుగా పనిచేస్తున్నారని, ఇది 5 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల మొత్తం పనిచేసే పిల్లలలో 88 శాతమని అగ్రపీఠాధిపతి గుర్తుచేశారు.
పేదరికం, నిరుద్యోగం, నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడం, సామాజిక అసమానత, కార్మిక చట్టాల అమలులో వైఫల్యం మరియు ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాల దోపిడీ వంటి కారణాల వల్ల బాలకార్మిక వ్యవస్థ విస్తరిస్తోందని ఆయన తెలిపారు.
బాలకార్మికులుగా మారుతున్న పిల్లలు శారీరక అలసట, గాయాలు, అనారోగ్యం, మానసిక వేదన, వేధింపులు మరియు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని, అదే సమయంలో విద్యను, ఆరోగ్యకరమైన పెరుగుదలను కోల్పోతున్నారని అగ్రపీఠాధిపతి ఆవేదన వ్యక్తం చేశారు. భారీ యంత్రాలు, విషపూరిత రసాయనాలు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు, సుదీర్ఘ పని గంటలు మరియు అవమానకరమైన పరిస్థితుల నడుమ వారు పని చేయాల్సి వస్తోందన్నారు.
కతోలిక సామాజిక బోధనలను స్మరిస్తూ... పిల్లలను రక్షించడం అనేది మానవ ఆత్మగౌరవాన్ని కాపాడటం, సామాజిక న్యాయం, ఐక్యత మరియు నిరుపేదల పట్ల సంరక్షణ అనే అంశాలతో ముడిపడి ఉన్న ఉమ్మడి బాధ్యత అని అగ్రపీఠాధిపతి ఉద్ఘాటించారు. "పిల్లలను కాపాడుకోవడం అనేది మత, రంగు, సామాజిక మరియు రాజకీయ విభేదాలకు అతీతమైన జాతీయ నైతిక బాధ్యత" అని ఆయన అన్నారు.
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు తమ ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం, ప్రాంతీయ అధికారులు, శాంతిభద్రతల విభాగాలు, విద్యావేత్తలు, యజమానులు, మత నాయకులు, పౌర సమాజ సంస్థలు, తల్లిదండ్రులు మరియు స్థానిక సమాజాలకు అగ్రపీఠాధిపతి పిలుపునిచ్చారు.
బాలల రక్షణ మరియు కార్మిక చట్టాలను కఠినంగా అమలు చేయడం, ఉచిత విద్యను విస్తరించడం, పాఠశాలల్లో నమోదు మరియు నిలకడను పెంచడం, కుటుంబ మద్దతు కార్యక్రమాలు, పెద్దలకు వృత్తిపరమైన అవకాశాలు, బలమైన సామాజిక రక్షణ చర్యలు, ప్రజా అవగాహన ప్రచారాలు మరియు బాధిత పిల్లలకు పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు.
తమ పని ప్రదేశాలు మరియు సరఫరా గొలుసులలో బాలకార్మికులు లేకుండా చూసుకోవాలని వ్యాపార సంస్థలకు అగ్రపీఠాధిపతి జోసెఫ్ అర్షద్ విజ్ఞప్తి చేశారు. అలాగే మత సంస్థలు, పాఠశాలలు మరియు మీడియా సంస్థలు పిల్లల హక్కుల పట్ల అవగాహన పెంచాలని కోరారు.
"మన పిల్లలు కేవలం పనిచేసే పరికరాలు కారు; వారు మన దేశానికి నిరీక్షణ, భవిష్యత్తు" అని అగ్రపీఠాధిపతి జోసెఫ్ అర్షద్ అన్నారు. "వారి చేతుల్లో పనిముట్లకు బదులుగా పుస్తకాలు ఉంచుదాం, పని ప్రదేశాలకు బదులుగా తరగతి గదుల్లోకి ఆహ్వానిద్దాం, దోపిడీకి బదులుగా ఆప్యాయతతో వారిని కాపాడుకుందాం."
నేడు ప్రతి చిన్నారికి సురక్షితమైన వాతావరణాన్ని అందించడం ద్వారానే రాబోయే తరాలకు న్యాయబద్ధమైన, దయాపూర్వకమైన, విద్యావంతమైన మరియు శాంతియుత సమాజాన్ని నిర్మించగలమని ఆయన ముగించారు.
