“యేసును మీ జీవితంలో ప్రభావశీలిగా చేసుకోండి”: ఆసియా డిజిటల్ మిషనరీలకు కార్డినల్ టాగ్లే పిలుపు
ఆసియా నలుమూలల నుంచి వచ్చిన కతోలిక డిజిటల్ మిషనరీలు తమ జీవితాల్లో యేసుక్రీస్తు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా నిలిచేలా అనుమతించాలని, తద్వారా ఆన్లైన్లో వారి ఉనికి, సేవ సువార్తకు నిజమైన సాక్ష్యంగా మారాలని కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 10న క్వెజోన్ సిటీలోని Radio Veritas Asia ప్రాంగణంలోని పోప్ జాన్ పాల్ II ఆడిటోరియంలో జరిగిన తొలి ఆసియా కతోలిక డిజిటల్ మిషనరీల సమ్మేళనం ఓరియెంటేషన్ కార్యక్రమంలో ప్రదర్శించిన వీడియో సందేశంలో కార్డినల్ టాగ్లే ఈ పిలుపునిచ్చారు.
ఆసియాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 100 మందికి పైగా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇతరులను ప్రభావితం చేసే వ్యక్తులు కూడా తమ జీవితాలను ప్రభావితం చేసిన వ్యక్తులు, అనుభవాల ద్వారా రూపుదిద్దుకుంటారని ఆయన గుర్తుచేశారు.
“ముఖ్యంగా యేసుకు సాక్ష్యమివ్వడం కోసం, ఇతరులను మంచి మార్గంలో ప్రభావితం చేయడం మంచిదే” అని కార్డినల్ టాగ్లే అన్నారు.
సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు నాలుగు రోజులపాటు జరుగుతున్న ఈ సమ్మేళనం “ప్రభావశీలుల నుంచి సాక్షులుగా: ఆసియాలో డిజిటల్ సువార్త ప్రచారానికి సినడల్ మార్గం” అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. డిజిటల్ వాతావరణంలో శ్రీసభ సువార్త ప్రచార సేవలో తమ పాత్రపై ఆలోచించేందుకు కతోలిక డిజిటల్ మిషనరీలు, సమాచార ప్రసారకులు, ప్రభావశీలులు ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నారు.
ప్రతిరోజూ అనేక అంశాలు తమను ప్రభావితం చేస్తున్నందున, తమ జీవితాలను ప్రభావితం చేస్తున్న వ్యక్తులు, విషయాల పట్ల డిజిటల్ మిషనరీలు అప్రమత్తంగా ఉండాలని కార్డినల్ టాగ్లే సూచించారు.
“ప్రియమైన డిజిటల్ మిషనరీలారా, మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నది ఏమిటి, ఎవరు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నారు అనే విషయాల పట్ల అప్రమత్తంగా ఉండండి” అని ఆయన అన్నారు.
ఇతరులను ప్రభావితం చేయాలనే ప్రయత్నానికి ముందే ప్రతి ప్రభావశీలుడూ ఎవరో ఒకరి ద్వారా ప్రభావితుడవుతాడని ఆయన స్పష్టం చేశారు.
“ప్రతి ప్రభావశీలుడు ఇతరులను ప్రభావితం చేయడానికి ముందు, తానే ప్రభావితుడై ఉంటాడు” అని కార్డినల్ టాగ్లే అన్నారు.
క్రైస్తవ డిజిటల్ మిషనరీల జీవితాల్లో ఈ ప్రభావ ప్రక్రియకు యేసు కేంద్రంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
“యేసు తన వాక్కు, తన ఆత్మ శక్తి ద్వారా మీ జీవితంలో, మీ దృక్పథంలో గొప్ప ప్రభావాన్ని చూపే వ్యక్తిగా నిలిచేలా మీరు అనుమతించాలని మనం ప్రార్థిస్తున్నాం” అని ఆయన అన్నారు.
తమ జీవితాలను మార్చివేసే యేసు ప్రభావాన్ని వ్యక్తిగతంగా అనుభవించినప్పుడే డిజిటల్ మిషనరీలు ఇతరులకు నిజమైన, ప్రామాణికమైన సాక్ష్యాన్ని అందించగలరని కార్డినల్ టాగ్లే చెప్పారు.
“మీ జీవితంలో యేసు చూపిన పరివర్తనాత్మక ప్రభావాన్ని అనుభవించినప్పుడు, మీరు ఇతరులకు నిజమైన, ప్రామాణికమైన, నిష్కపటమైన సాక్షులుగా నిలుస్తారు. అది వారిని కూడా ప్రభావితం చేస్తుంది” అని ఆయన అన్నారు.
“మనలను ప్రభావితం చేసిన దాని ద్వారానే మనం ఇతరులను ప్రభావితం చేస్తాం” అని ఆయన తెలిపారు.
ప్రార్థన, అధ్యయనం ద్వారా యేసుతో తమ సంబంధాన్ని మరింతగా లోతుగా చేసుకోవాలని కార్డినల్ టాగ్లే ప్రతినిధులను ప్రోత్సహించారు.
“కాబట్టి, బాగా ప్రార్థించండి, బాగా అధ్యయనం చేయండి” అని ఆయన అన్నారు. తమ జీవితాల్లో ఒక స్నేహితుడిని, ఉత్తమమైన ప్రభావాన్ని కోరుకునేవారు యేసువైపు తిరగాలని ఆయన సూచించారు.
క్రీస్తు నుంచి పొందిన వెలుగును తమలోనే దాచుకోకుండా, దానిని ఇతరులకు పంచాలని కూడా కార్డినల్ టాగ్లే డిజిటల్ మిషనరీలకు సవాలు విసిరారు.
“యేసు నామంలో ప్రభావాన్ని చూపుతూ, యేసును, ఆయన వెలుగును ప్రసరింపజేయండి” అని ఆయన అన్నారు.
ఈ ఓరియెంటేషన్ కార్యక్రమంతో సమ్మేళనం ప్రారంభమైంది. ఆసియాలోని వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన ప్రతినిధులు డిజిటల్ సువార్త ప్రచార సేవలో శిక్షణ, చర్చలు, అనుభవాల పంచుకోవడం, పరస్పర సహకారం కోసం ఈ సమ్మేళనంలో ఒకచోట చేరారు.
చివరగా కార్డినల్ టాగ్లే సమ్మేళనంలో పాల్గొంటున్న ప్రతినిధుల కోసం, ఈ సమావేశం విజయవంతం కావాలని ప్రార్థిస్తూ తన సందేశాన్ని ముగించారు.
“దేవుడు మీ అందరినీ, మీ సమ్మేళనాన్ని ఆశీర్వదించుగాక” అని ఆయన అన్నారు.
