“ఆసియాలో యేసును మృదువుగా చాటండి”: ఆసియా డిజిటల్ మిషనరీలకు అగ్రపీఠాధిపతి గార్సెరా పిలుపు
ఆసియా అంతటా సేవచేస్తున్న కతోలిక డిజిటల్ మిషనరీలు తమ సమాచార ప్రసార సేవ ద్వారా “యేసును మృదువుగా చాటాలని”, ప్రజలను ఆలకిస్తూ, వారి సంస్కృతులను గౌరవిస్తూ, డిజిటల్ ప్రపంచంలో సత్యాన్ని, నిరీక్షణను అందించాలని ఫిలిప్పీన్స్ కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CBCP) అధ్యక్షుడు అగ్రపీఠాధిపతి గిల్బర్ట్ గార్సెరా పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 11న క్వెజోన్ సిటీలోని Radio Veritas Asia (RVA) ప్రాంగణంలోని పోప్ జాన్ పాల్ II ఆడిటోరియంలో జరిగిన తొలి ఆసియా కతోలిక డిజిటల్ మిషనరీల సమ్మేళనం ప్రారంభ దివ్యబలిపూజలో ఆయన ఈ పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు నాలుగు రోజులపాటు జరుగుతున్న ఈ సమ్మేళనంలో ఆసియా నలుమూలల నుంచి 100 మందికి పైగా కతోలిక డిజిటల్ మిషనరీలు, సమాచార ప్రసారకులు, ప్రభావశీలులు పాల్గొంటున్నారు. “ప్రభావశీలుల నుంచి సాక్షులుగా: ఆసియాలో డిజిటల్ సువార్త ప్రచారానికి సినడల్ మార్గం” అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. FABC సామాజిక సమాచార ప్రసార కార్యాలయం సహకారంతో Radio Veritas Asia ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది.
అగ్రపీఠాధిపతి గార్సెరా దివ్యబలిపూజకు అధ్యక్షత వహించారు. FABC సామాజిక సమాచార ప్రసార కార్యాలయ అధ్యక్షుడు బిషప్ మార్సెలినో ఆంటోనియో “జూనీ” మరాలిట్ జూనియర్, ఆ కార్యాలయ కార్యనిర్వాహక కార్యదర్శి గురుశ్రీ జాన్ మి షెన్, ఇతర గురువులు దివ్యబలిపూజలో పాల్గొన్నారు.
Radio Veritas Asiaతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న అగ్రపీఠాధిపతి గార్సెరా, ఈ దివ్యబలిపూజకు అధ్యక్షత వహించేందుకు ఆహ్వానాన్ని అంగీకరించడానికి ఈ ప్రదేశంతో తనకు ఉన్న ప్రత్యేక జ్ఞాపకాలే కారణమని తెలిపారు. 1986 పీపుల్ పవర్ విప్లవం అనంతరం, దివంగత కార్డినల్ జైమ్ సిన్ తనను RVA పరిపాలనా సంచాలకుడిగా నియమించారని, ఆ బాధ్యతల్లో తాను ఏడు సంవత్సరాలు కొనసాగానని ఆయన గుర్తుచేశారు.
RVAలోని వివిధ భాషా సేవలు, షార్ట్వేవ్ ప్రసారాలు ఆసియా అంతటా కతోలిక విశ్వాసాన్ని చాటాయని, మిషనరీలు సులభంగా చేరుకోలేని సమాజాలకు సైతం అవి చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
సాంకేతికత షార్ట్వేవ్ రేడియో నుంచి సామాజిక మాధ్యమాలు, పోడ్కాస్ట్లు, లైవ్స్ట్రీమ్లు, కృత్రిమ మేధస్సు వరకు మారినప్పటికీ, RVA లక్ష్యం మాత్రం మారలేదని ఆయన అన్నారు. ఆసియా ప్రజలకు సత్యాన్ని, నిరీక్షణను, సువార్తను అందించడమే ఆ లక్ష్యమని వివరించారు.
“ఆసియాలో యేసును మృదువుగా చాటడం” అనే భావనను వివరిస్తూ, ప్రజలపై గట్టిగా తమ మాటలను రుద్దకుండా, వారితో సన్నిహితంగా మెలుగుతూ సేవ చేయాలని అగ్రపీఠాధిపతి గార్సెరా పిలుపునిచ్చారు.
“ఆసియాపై మన స్వరాన్ని గట్టిగా వినిపించడం ద్వారా కాదు; ఆసియాకు దగ్గరవుతూ, దాని ప్రజలను ఆలకిస్తూ, మన ప్రజలతో కలిసి నడుస్తూ, వారికి సేవ చేస్తూ, యేసు ప్రేమను వారు వినేలా, అనుభవించేలా సున్నితంగా చాటడం ద్వారా మనం యేసును తీసుకువెళ్తాం” అని ఆయన అన్నారు.
డిజిటల్ మిషనరీలు కేవలం కంటెంట్ సృష్టికర్తలు మాత్రమే కాదని, నైతిక బాధ్యత కలిగిన సాక్షులని ఆయన గుర్తుచేశారు.
“ప్రతి శీర్షిక, ప్రతి ఛాయాచిత్రం, ప్రతి వీడియో, ప్రతి పోస్ట్, ప్రతి కథ ఒక ఎంపికను చేస్తుంది” అని ఆయన అన్నారు. ఎవరి స్వరాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం? ఎవరి స్వరాలు వినిపించకుండా మిగిలిపోతున్నాయి? అనే ప్రశ్నలను సమాచార ప్రసారకులు వేసుకోవాలని ఆయన సూచించారు.
తప్పుడు సమాచారం, కృత్రిమ మేధస్సుతో రూపొందుతున్న అసత్య సమాచారాల మధ్య క్లిక్లు, లైక్లు, ఫాలోవర్లు సత్యానికి ప్రత్యామ్నాయంగా మారకుండా జాగ్రత్త వహించాలని ఆయన హెచ్చరించారు.
“ప్రచురించే ముందు ధృవీకరించండి; తీర్పు చెప్పే ముందు ఆలకించండి; అర్థం చేసుకునే ముందు వ్యాఖ్యానించకండి; ఖండించే ముందు సందర్భాన్ని వివరించండి” అని ఆయన అన్నారు.
పేదలు, వలసదారులు, ఆదివాసీ ప్రజలు, యువత, అంచులకు నెట్టబడిన ఇతర సమాజాల స్వరాలను ప్రత్యేకంగా ఆలకించాలని అగ్రపీఠాధిపతి గార్సెరా డిజిటల్ మిషనరీలకు సూచించారు.
“ప్రజల గురించి మాట్లాడే ముందు, ప్రజలను ఆలకించడం నేర్చుకోండి” అని ఆయన అన్నారు.
వైవిధ్యభరితమైన ఆసియాలో డిజిటల్ సమాచార ప్రసారకులు వారధుల నిర్మాణకర్తలుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ద్వేషం లేకుండా సత్యాన్ని పలకాలని, ఇతరుల మానవ గౌరవాన్ని దెబ్బతీయకుండా అన్యాయాన్ని ఖండించాలని, మానవ గౌరవాన్ని నాశనం చేయకుండా విమర్శించాలని సూచించారు.
ప్రతి డిజిటల్ వేదిక ఆధునిక సువార్త ప్రసార సాధనంగా మారగలదని ఆయన అన్నారు.
“మీలో ప్రతి ఒక్కరూ ఆసియాతో మాట్లాడే స్వరంగా, ఆసియాను ఆలకించే స్వరంగా, ఆసియాకు నిరీక్షణను అందించే స్వరంగా కొనసాగాలని కోరుకుంటున్నాను” అని ఆయన అన్నారు.
దివ్యబలిపూజలో ఆసియాలోని వివిధ భాషల్లో ప్రార్థనలు, ప్రతీకాత్మక కానుకల సమర్పణ జరిగింది. ఇది సమ్మేళనంలో పాల్గొన్న ప్రతినిధుల సాంస్కృతిక, భాషా వైవిధ్యాన్ని ప్రతిబింబించింది.
“అంతిమంగా, సమాచారాన్ని మాత్రమే ప్రసారం చేయడానికి మనం పిలువబడలేదు. సత్యానికి సాక్షులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. ఆ సత్యం మరెవరో కాదు—యేసుక్రీస్తే” అని అగ్రపీఠాధిపతి గార్సెరా స్పష్టం చేశారు.
