స్థానిక శ్రీసభ ఏదీ ఒంటరిగా ప్రయాణించదు: సినడాలిటీ హృదయం సంఘబంధమేనని సినడ్ సంప్రదింపుదారు స్పష్టం

గురుశ్రీ జియాకోమో కోస్టా, SJ
FABC 12వ ప్లీనరీ సమావేశంలో వేటికన్‌కు చెందిన సినడ్ అధికారి మాట్లాడుతూ, సినడల్ శ్రీసభ మరింత స్వతంత్రంగా మారడం ద్వారా కాదు, స్థానిక శ్రీసభల మధ్య సంఘబంధం మరింతగా బలపడడం ద్వారానే నిజమైన బలాన్ని పొందుతుందని తెలిపారు.

స్థానిక శ్రీసభలు మరింత స్వతంత్రంగా మారడమే సినడల్ శ్రీసభ లక్ష్యం కాదని, పరస్పర సంఘబంధాన్ని మరింతగా బలోపేతం చేసుకుంటూ కలిసి ఎదగడమే దాని అసలు స్వరూపమని పీఠాధిపతుల సినడ్ ప్రధాన కార్యదర్శిత్వానికి సంప్రదింపుదారైన గురుశ్రీ జియాకోమో కోస్టా, SJ Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న పీఠాధిపతులు, శ్రీసభ నాయకులకు తెలిపారు.

జూలై 24న జకార్తాలోని హోటల్ ములియా వాండా హాల్లో "సినడ్ అమలు కోసం మార్గాలు" అనే అంశంపై ప్రసంగించిన గురుశ్రీ కోస్టా, సినడాలిటీపై సినడ్ ప్రధాన సహకారుల్లో ఒకరిగా, ఈ సందేశాన్ని ప్రత్యేకంగా నొక్కిచెప్పారు.

ప్రపంచ సినడల్ ప్రక్రియ తదుపరి దశ గురించి మాట్లాడుతూ, ప్రతి స్థానిక శ్రీసభ తన పరిస్థితులకు అనుగుణంగా సినడ్‌ను అమలు చేసే బాధ్యతను కలిగి ఉన్నప్పటికీ, ఏ మేత్రాసనం గానీ, ఏ పీఠాధిపతుల సమాఖ్య గానీ ఆ ప్రయాణాన్ని ఒంటరిగా చేయడానికి ఉద్దేశించబడలేదని ఆయన వివరించారు.

"శ్రీసభ అనేది విశ్వాస సమాజాల సంఘబంధం," అని ఆయన పేర్కొంటూ, సంఘబంధం అనేది కేవలం ఒక దైవశాస్త్ర భావన మాత్రమే కాదని, దేవుని ప్రజలు కలిసి జీవిస్తూ తమ సేవను నిర్వహించే జీవన విధానమని వివరించారు.

సినడ్ ప్రధాన సూత్రాలలో ఒకదానిని పునరుద్ఘాటిస్తూ, సినడ్ అమలుకు ప్రధాన కేంద్రం స్థానిక శ్రీసభేనని గురుశ్రీ కోస్టా తెలిపారు. ప్రతి మేత్రాసనం తన సంస్కృతి, చరిత్ర, సేవాపర వాస్తవికతలకు అనుగుణంగా సినడాలిటీ ఎలా వేళ్లూనుకోవాలో ఆధ్యాత్మిక విచక్షణతో గుర్తించాల్సిన బాధ్యతను కలిగి ఉందని చెప్పారు.

అయితే ఆ బాధ్యతను స్వయం సమృద్ధిగా ఉండటంగా ఎప్పుడూ భావించకూడదని ఆయన హెచ్చరించారు.

ప్రతి స్థానిక శ్రీసభకు ప్రత్యేక వరాలు, అనుభవాలు, సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రతి శ్రీసభకు ఇతరుల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉంటాయని ఆయన అన్నారు. అందువల్ల సినడాలిటీ అనేది వేలాది మేత్రాసనాలు వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టే ప్రక్రియ కాదని, పరస్పర ఆలకింపు, సంభాషణ, ఆధ్యాత్మిక విచక్షణ ద్వారా ఒకదానినొకటి సమృద్ధి పరచుకునే ఉమ్మడి ప్రయాణమని వివరించారు.

ఈ పరస్పర వినిమయాన్ని ప్రోత్సహించేందుకు అమలు ప్రక్రియను స్థానిక, జాతీయ, ఖండస్థాయి, విశ్వజనీన స్థాయిలుగా రూపొందించారని, తద్వారా ఒక్కో స్థానిక శ్రీసభ అనుభవాలు మొత్తం శ్రీసభ జీవితాన్ని సమృద్ధి పరచగలవని ఆయన తెలిపారు.

పరిశుద్ధ పిత లియో XIV చేసిన "మరింత సువార్తస్ఫూర్తితో కూడిన జీవన విధానాన్ని" పెంపొందించాలనే పిలుపును ప్రస్తావిస్తూ, ఎవరి వద్ద ఎక్కువ అధికారం ఉందన్నది ప్రధాన ప్రశ్న కాదని, ప్రతి పిలుపు, ప్రతి సేవ శ్రీసభ ఉమ్మడి సేవలో మరింత విశ్వాసపూర్వకంగా ఎలా సహకరించగలదన్నదే ముఖ్యమని గురుశ్రీ కోస్టా చెప్పారు.

శ్రీసభ జీవితం సంబంధాలపై ఆధారపడిందని ఆయన వివరించారు. పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, సామాన్య విశ్వాసులు, విచారణ సంఘాలు, విచారణ సమితులు వేర్వేరు సేవలను నిర్వహించినప్పటికీ, వాటిలో ఏదీ ఒంటరిగా ఉండదని, పరస్పర సంఘబంధం ద్వారానే ప్రతి ఒక్కరూ శ్రీసభ సేవకు తమ వంతు కృషి అందిస్తారని తెలిపారు.

ఈ దృక్పథం ఆసియాకు ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉందని ఆయన అన్నారు. మత, సాంస్కృతిక వైవిధ్యంతో కూడిన సమాజాల్లో కతోలికులు తరచుగా అల్పసంఖ్యాకులుగా జీవిస్తున్న నేపథ్యంలో, ఈ వైవిధ్యాన్ని అడ్డంకిగా కాకుండా, ఐక్యతకు ఏకరూపత అవసరం లేదని చూపించే అవకాశంగా ఆసియా శ్రీసభలు చూడాలని ఆయన ప్రోత్సహించారు. స్థానిక శ్రీసభలు తమ భాషలు, సంప్రదాయాలు, సేవాపర పరిస్థితుల్లో పాతుకుపోయి ఉండగానే, విశ్వజనీన శ్రీసభ జీవితం, సేవలో సంపూర్ణంగా భాగస్వాములు కావచ్చని ఆయన వివరించారు.

చర్చను కేవలం కతోలిక సమాజానికే పరిమితం చేయకుండా, క్రైస్తవ ఐక్య సంభాషణ మరియు అంతర్మత సంభాషణ కూడా సినడల్ శ్రీసభ సహజ వ్యక్తీకరణలేనని గురుశ్రీ కోస్టా పేర్కొన్నారు.

అంతర్గతంగా ఆలకించడం నేర్చుకున్న శ్రీసభ, ఇతర క్రైస్తవ సంప్రదాయాల విశ్వాసులు, ఇతర మతాల అనుచరులు, సత్సంకల్పం గల ప్రతి వ్యక్తితో గౌరవం, విశాల హృదయంతో సంభాషించడానికి మరింత సిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు.

సినడ్ అమలు దశలోకి ప్రవేశిస్తున్న ఈ సమయంలో, స్థానిక శ్రీసభలు వేర్వేరు మార్గాల్లో నడవడం కాదు, తమ ప్రత్యేక వరాలను పంచుకుంటూ, ఇతరుల వరాలను స్వీకరిస్తూ కలిసి ప్రయాణించడమే లక్ష్యమని గురుశ్రీ కోస్టా FABC ప్రతినిధులకు గుర్తుచేశారు.

విభజనలు, విచ్ఛిన్నతలు పెరుగుతున్న నేటి ప్రపంచంలో, స్థానిక శ్రీసభల మధ్య ఉన్న ఈ సంఘబంధమే సువార్తకు శ్రీసభ అందించే అత్యంత శక్తివంతమైన సాక్ష్యాలలో ఒకటిగా మారవచ్చని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

Telugu Survey Popup Image