సినడాలిటీకి ఆచరణాత్మక మార్గదర్శకమే FABC ప్లీనరీ సమావేశం లక్ష్యం – మహా పూజ్య మారలిట్

మహా పూజ్య మారలిట్
పీఠాధిపతి మార్సెలినో ఆంటోనియో "జూనీ" మారలిట్ జూనియర్, FABC 12వ ప్లీనరీ సమావేశం కేవలం చర్చలకే పరిమితం కాకుండా, ఆసియా అంతటా సినడాలిటీని ఆచరణలో అమలు చేయడానికి ఉపయోగపడే కార్యాచరణ మార్గదర్శకాన్ని అందించడమే లక్ష్యంగా సాగుతోందని తెలిపారు. (ఫోటో: CBCP News)

ఆసియాలో సినడాలిటీని కేవలం చర్చలకే పరిమితం చేయకుండా, స్థానిక శ్రీసభల్లో ఆచరణలో అమలు చేయడానికి ఉపయోగపడే కార్యాచరణ మార్గదర్శకాన్ని రూపొందించడమే Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశం ప్రధాన లక్ష్యమని ఫిలిప్పీన్స్‌కు చెందిన పీఠాధిపతి మహా పూజ్య మార్సెలినో ఆంటోనియో "జూనీ" మారలిట్ జూనియర్ తెలిపారు.

"సినడల్ పరివర్తనకు పిలుపు – ఆసియాలో వారధులు మరియు వారధుల నిర్మాణకర్తలుగా ఉండే శ్రీసభ సేవ" అనే అంశంతో జూలై 20 నుంచి 26 వరకు జకార్తాలో జరుగుతున్న ఈ వారంరోజుల సమావేశంలో ఆసియా నలుమూలల నుంచి 120 మందికిపైగా కార్డినల్స్, పీఠాధిపతులు పాల్గొంటున్నారు.

జూలై 20న జరిగిన ప్రారంభ మీడియా సమావేశంలో, ప్లీనరీ సమావేశం అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న పీఠాధిపతి జూనీ, ఈ సమావేశం "కేవలం పీఠాధిపతుల సమావేశం మాత్రమే కాదు" అని అన్నారు.

"ఆసియాలోని శ్రీసభకు ఇది అత్యంత ప్రాముఖ్యమైన సందర్భం. కలిసి ప్రార్థించడానికి, ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి, కాలపు సూచనలను వివేచించడానికి, ప్రపంచంలో అత్యంత చైతన్యవంతమైన, వైవిధ్యభరితమైన ప్రాంతాల్లో ఒకటైన ఆసియాలో సువార్తను ప్రకటించడానికి కొత్త మార్గాలను అన్వేషించడానికి ఇది ఒక అరుదైన అవకాశం," అని ఆయన తెలిపారు.

FABC 50వ సాధారణ మహాసభ, 2023 బ్యాంకాక్ పత్రం, 2024 సినడాలిటీపై సినడ్ తుది పత్రం, 2025 నిరీక్షణ జూబిలీ సంవత్సరం, అలాగే పరిశుద్ధ లియో పాపు గారి పోంతిఫికేట్ ప్రారంభం వంటి కీలక పరిణామాల అనంతరం ఈ సమావేశం జరుగుతోందని పీఠాధిపతి జూనీ గుర్తుచేశారు.

ఈ వారం రోజుల సమావేశం, సినడాలిటీ గురించి కేవలం చర్చించడానికే కాకుండా, ప్రార్థన, పరస్పర ఆలకింపు, సమిష్టి వివేచనలతో కూడిన నిజమైన సినడల్ అనుభవంగా రూపొందించబడిందని ఆయన వివరించారు.

సమావేశంలో పాల్గొనేవారు పవిత్ర దివ్యబలిపూజలు, ఆధ్యాత్మిక ధ్యానాలు, "కాన్వర్సేషన్స్ ఇన్ ది స్పిరిట్", ప్రాంతీయ సమావేశాలు, బృంద చర్చల్లో పాల్గొంటారు. సాంస్కృతిక, మత వైవిధ్యం, పేదరికం, వలసలు, ఘర్షణలు, పర్యావరణ సవాళ్లు, వేగంగా మారుతున్న సామాజిక పరిస్థితుల నడుమ, సినడల్ పరివర్తనను మరింత లోతుగా ఆచరిస్తూనే, ఆసియాలో వారధుల నిర్మాణకర్తలుగా శ్రీసభ ఎలా ఎదగాలనే అంశంపై వారు వివేచన జరపనున్నారు.

ఈ ప్లీనరీ సమావేశం నుంచి రెండు ప్రధాన పత్రాలు వెలువడనున్నాయని మహా పూజ్య జూనీ తెలిపారు. వాటిలో మొదటిది, ఆసియాలోని స్థానిక శ్రీసభలు సినడల్ ప్రక్రియను అమలు చేయడానికి ఉపయోగపడే ఆచరణాత్మక "ఆసియాలో సినడాలిటీకి మార్గదర్శిని (Vademecum)"గా రూపొందించబడే తుది పత్రం. రెండవది, ఆసియా అంతటా ఉన్న కతోలికులను సినడల్ పునరుద్ధరణ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ప్రోత్సహించే "ఆసియాలోని శ్రీసభకు సందేశం."

ఈ సమావేశంలోని ప్రధాన కార్యక్రమాల్లో, పరిశుద్ధ లియో పాపు గారి ప్రత్యేక ప్రతినిధిగా కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియాస్ పాల్గొనడం, కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే నేతృత్వంలో నిర్వహించే ధ్యాన దినం, సినడాలిటీపై సినడ్ అమలుపై కార్డినల్ మారియో గ్రెక్ ప్రధానోపన్యాసం, అలాగే పరిశుద్ధ లియో పాపు గారి వీడియో సందేశం ఉన్నాయి.

సమావేశం ముగింపు సందర్భంగా జకార్తాలోని అవర్ లేడీ ఆఫ్ ది అసంప్షన్ బృహద్దేవాలయంలో దివ్యబలి అర్పించబడుతుంది. అనంతరం ప్రతినిధులు సమీపంలోని ఇస్తిక్లాల్ మసీదును సందర్శిస్తారు. ఇండోనేషియాలో మతాంతర సామరస్యానికి ప్రతీకగా నిలిచిన "ఫ్రెండ్‌షిప్ టన్నెల్" గుండా బృహద్దేవాలయం నుంచి మసీదు వరకు వారు నడుస్తారు. ఆసియాలో వారధులు మరియు వారధుల నిర్మాణకర్తలుగా శ్రీసభ ఉండాలనే సమావేశ పిలుపుకు ఇది ఒక ప్రతీకగా నిలుస్తుంది.

"ఈ సమావేశం శ్రీసభలో ఐక్యత, భాగస్వామ్యం, సువార్త ప్రకటనా సేవలకు మరింత బలాన్నిచ్చి, ఆసియా అంతటా ఉన్న కతోలికులు తమ కుటుంబాల్లో, సమాజాల్లో, దేశాల్లో, భిన్న సంస్కృతులు, మతాల మధ్య వారధులు మరియు వారధుల నిర్మాణకర్తలుగా మారేందుకు ప్రేరణ కలిగిస్తుందని మేము ఆశిస్తున్నాము," అని పీఠాధిపతి జూనీ తెలిపారు.