సినడల్ అమలుకు కేంద్రం రోమ్ కాదు, స్థానిక శ్రీసభలే: FABCలో కార్డినల్ మారియో గ్రెక్
సినడాలిటీ అమలు రోమ్ నుంచి వచ్చే ఆదేశాల ద్వారా కాదు, స్థానిక శ్రీసభల జీవితం, సేవ ద్వారా విజయవంతమవుతుందని పీఠాధిపతుల సినడ్ ప్రధాన కార్యదర్శి కార్డినల్ మారియో గ్రెక్ పేర్కొన్నారు. శ్రీసభ సినడల్ ప్రయాణాన్ని తమదిగా స్వీకరించాలని ఆయన ఆసియా పీఠాధిపతులను పిలుపునిచ్చారు.
జూలై 24న జకార్తాలోని హోటల్ ములియా వాండా హాల్లో జరిగిన Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశంలో "సినడ్ అమలు కోసం మార్గాలు" అనే అంశంపై ప్రసంగించిన కార్డినల్ గ్రెక్, ప్రపంచవ్యాప్త సినడల్ ప్రక్రియ తదుపరి దశలో నవీకరణకు కేంద్రంగా వేటికన్ కాదు, స్థానిక శ్రీసభలే నిలుస్తాయని స్పష్టం చేశారు.
"ఈ అమలు దశకు ప్రధాన అంశం స్థానిక శ్రీసభ—అంటే మీ శ్రీసభలే," అని కార్డినల్ గ్రెక్ అన్నారు.
సినడాలిటీని రోమ్ నుంచి నడిపించే ఒక కార్యక్రమంగా కాకుండా, ప్రతి మేత్రాసనంలో సువార్త ప్రకటించబడే, దివ్యబలి అర్పించబడే, దేవుని ప్రజలు కలిసి విశ్వాసయాత్ర సాగించే జీవన విధానంగా చూడాలని ఆయన తెలిపారు.
"స్థానిక శ్రీసభ అనేది విశ్వజనీన శ్రీసభకు చెందిన ఒక పరిపాలనా విభాగం మాత్రమే కాదు," అని రెండవ వాటికన్ మహాసభ బోధనలను ఉటంకిస్తూ ఆయన వివరించారు.
ఈ అంశాన్ని వివరిస్తూ, తనను పరిశుద్ధ పిత ఫ్రాన్సిస్ పీఠాధిపతుల సినడ్ ప్రధాన కార్యదర్శిగా నియమించిన తరువాత అందుకున్న తొలి లేఖలలో ఒకదాన్ని కార్డినల్ గ్రెక్ ప్రస్తావించారు. ఒక పీఠాధిపతి తనకు ఇలా రాశారని ఆయన తెలిపారు: "మేము వేటికన్కు చెందిన సామంత రాజ్యం కాదు. మేము స్థానిక శ్రీసభ. మేమే శ్రీసభ."
ఆ లేఖ కతోలిక శ్రీసభ స్వరూపానికి సంబంధించిన ఒక మౌలిక సత్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. ప్రతి స్థానిక శ్రీసభ ఒక నిర్దిష్ట ప్రాంతంలో పూర్తిగా శ్రీసభగా ఉనికిలో ఉండి, తన సాంస్కృతిక, సేవాపర పరిస్థితులకు అనుగుణంగా క్రీస్తు సేవను కొనసాగిస్తుందని వివరించారు.
2028లో జరగనున్న Ecclesial Assembly వరకు కొనసాగే అమలు దశ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేత్రాసనాల అంకితభావంపైనే ఆధారపడి ఉంటుందని కార్డినల్ గ్రెక్ తన ప్రసంగమంతా పునరుద్ఘాటించారు.
జకార్తాలో సమావేశమైన పీఠాధిపతులను ఉద్దేశించి మాట్లాడుతూ, వారు వ్యక్తిగతంగా కాకుండా, తమ స్థానిక శ్రీసభల విశ్వాస జీవితం, అనుభవాలకు ప్రతినిధులుగా FABC సమావేశంలో పాల్గొంటున్నారని గుర్తుచేశారు.
"ఒక స్థానిక శ్రీసభ తన వంతు సహకారం అందించకపోతే, అది విశ్వజనీన శ్రీసభకు అత్యంత విలువైన ఒక వరాన్ని కోల్పోయేలా చేస్తుంది," అని ఆయన అన్నారు.
ప్రతి మేత్రాసనం తనకంటూ ప్రత్యేక వరాలు, సేవాపర అనుభవాలు, సాంస్కృతిక అవగాహనలను తీసుకువస్తుందని, అవి మొత్తం శ్రీసభ సంఘబంధాన్ని బలోపేతం చేస్తాయని ఆయన వివరించారు.
"విశ్వజనీన శ్రీసభ జీవశక్తి, మీ స్థానిక శ్రీసభల జీవశక్తిలోనే నిలిచి, వాటి ద్వారానే వ్యక్తమవుతుంది," అని ఆయన పేర్కొన్నారు.
రెండవ వాటికన్ మహాసభ బోధనలను ప్రస్తావిస్తూ, కతోలిక శ్రీసభను ఆయన శ్రీసభల సంఘబంధంగా వర్ణించారు. ప్రతి స్థానిక శ్రీసభ పూర్తిస్థాయి శ్రీసభగానే ఉండి, అదే సమయంలో ఇతర శ్రీసభలతో సంఘబంధంలో కొనసాగుతుందని వివరించారు.
ఈ అమలు దశ లక్ష్యం కొత్త పత్రాలను రూపొందించడం కాదని, మేత్రాసనాలు, పీఠాధిపతుల సమాఖ్యలు, ఖండస్థాయి సమావేశాల మధ్య పరస్పర వరాల మార్పిడిని ప్రోత్సహించడమేనని ఆయన తెలిపారు.
"ప్రధాన లక్ష్యం కొత్త పత్రాలను రూపొందించడం కాదు. సంఘబంధాన్ని బలోపేతం చేసి, మన సేవకు తోడ్పడే వరాల పరస్పర వినిమయాన్ని ప్రోత్సహించడమే," అని కార్డినల్ గ్రెక్ అన్నారు.
చివరిగా, సినడాలిటీ భవిష్యత్తు తమ తమ మేత్రాసనాల్లోనే రూపుదిద్దుకుంటుందనే దృఢ విశ్వాసంతో స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని ఆయన పీఠాధిపతులను ప్రోత్సహించారు. పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, సామాన్య విశ్వాసులు కలిసి ప్రార్థిస్తూ, ఆలకిస్తూ, ఆధ్యాత్మిక విచక్షణతో సేవా ప్రయాణం సాగించే విచారణలు, స్థానిక విశ్వాస సమాజాల్లోనే సినడ్ ఆశిస్తున్న నవీకరణ వికసిస్తుందని ఆయన పేర్కొన్నారు.