'వారధులు, వారధుల నిర్మాణకర్తలుగా మారండి' — ఆసియా శ్రీసభకు FABC తుది సందేశం
Federation of Asian Bishops' Conferences (FABC) జూలై 26న తన 12వ ప్లీనరీ సమావేశాన్ని ముగిస్తూ, "ఆసియా ప్రజలకు సందేశం"ను అధికారికంగా ప్రకటించింది. విభజనలు, అసమానతలు, వేగవంతమైన మార్పులతో కూడిన సమాజాల్లో "వారధులు, వారధుల నిర్మాణకర్తలుగా" మారుతూ, తమ సినడల్ ప్రయాణాన్ని మరింత లోతుగా కొనసాగించాలని ఆసియా అంతటా ఉన్న శ్రీసభకు ఈ సందేశం పిలుపునిచ్చింది.
"మీరు అంతకంటే గొప్ప సంగతులు చూస్తారు" (యోహాను 1:50) అనే శీర్షికతో రూపొందించిన ఈ సందేశాన్ని జకార్తాలోని మరియ మాత స్వర్గారోహణ కేథడ్రల్లో జరిగిన ముగింపు దివ్యబలిపూజ అనంతరం అగ్రపీఠాధిపతి గిల్బర్ట్ ఆర్మియా గార్సెరా వాచించారు. గోవా మరియు దమణ్ అగ్రపీఠాధిపతి, FABC అధ్యక్షుడు కార్డినల్ ఫిలిప్పే నేరి ఫెర్రావో, ప్లీనరీ సమావేశ సభ్యుల తరఫున ఈ సందేశంపై సంతకం చేశారు.
"ఆసియాలోని సద్భావన కలిగిన ప్రజలందరికీ" ఉద్దేశించి విడుదల చేసిన ఈ సందేశం, "సినడల్ పరివర్తన మరియు ఆసియాలో వారధులు, వారధుల నిర్మాణకర్తలుగా ఉండే సేవ" అనే అంశంతో వారం రోజులపాటు జరిగిన ప్లీనరీ సమావేశంలో ఆసియా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు, ప్రతినిధులు, భాగస్వాములు, మిత్రులు పొందిన ఆధ్యాత్మిక ఫలితాలను ప్రతిబింబిస్తోంది.
నతనయేలు ఉద్దేశించి యేసు చెప్పిన "మీరు అంతకంటే గొప్ప సంగతులు చూస్తారు" అనే మాటల నుంచి స్ఫూర్తి పొందిన పీఠాధిపతులు, ఈ ప్లీనరీ సమావేశం తమను భయాలు, పరిమితులను అధిగమించి దేవుని రాజ్యంపై నూతన దృక్పథం వైపు నడిపించిందని తెలిపారు.
సందేశంలో, సినడాలిటీ అనేది "కేవలం కలిసి పనిచేసే విధానం మాత్రమే కాదు; సువార్త ప్రచారం వైపు నడిపించే పరివర్తన మార్గం" అని పేర్కొన్నారు. నిజమైన నవీకరణ శ్రీసభ నిర్మాణాలు, సంస్థల్లో కాకుండా, ముందుగా మనసులు, పరస్పర సంబంధాల్లో పరివర్తన కలిగినప్పుడే ప్రారంభమవుతుందని సందేశం స్పష్టం చేసింది.
ప్రార్థన, ఆలకింపు, మౌనం, పవిత్రాత్మలో సంవాదం ద్వారా గడిపిన రోజులపై ప్రతిబింబిస్తూ, ఆసియాలోని సాంస్కృతిక, మతపర, సామాజిక వైవిధ్యాన్ని ఆలింగనం చేసుకుంటూ నిరంతర సినడల్ పరివర్తన ద్వారా వారధులను నిర్మించేందుకు ఆసియా శ్రీసభ పిలువబడిందనే విస్తృత ఏకాభిప్రాయానికి తాము వచ్చామని పీఠాధిపతులు పేర్కొన్నారు.
ఈ సందేశం ప్రస్తుతం ఆసియా ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను ప్రస్తావించింది. ధ్రువీకరణ, బలహీనపడుతున్న అంతర్జాతీయ సంస్థలు, వలసలు, పర్యావరణ విధ్వంసం, పెరుగుతున్న సామాజిక, ఆర్థిక అసమానతలు, క్షీణిస్తున్న ప్రజాస్వామ్య వాతావరణం, వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను ఇందులో గుర్తించారు.
అయితే ఈ పరిస్థితులను కేవలం అడ్డంకులుగా కాకుండా, విద్య, అంతర్మత సంభాషణ, ఆతిథ్యం, సృష్టి సంరక్షణ, మానవ గౌరవం, సంఘీభావం పట్ల మరింత నిబద్ధత ద్వారా సువార్త ప్రచారానికి కొత్త అవకాశాలుగా చూడాలని పీఠాధిపతులు పిలుపునిచ్చారు.
శ్రీసభలో సంఘబంధం, భాగస్వామ్యం, ఉమ్మడి బాధ్యతలను బలహీనపరుస్తున్న అంతర్గత సవాలుగా తమాచార్యవాదాన్ని కూడా పీఠాధిపతులు గుర్తించారు. ఆలకింపు, ఉమ్మడి ఆధ్యాత్మిక విచక్షణ, సేవక నాయకత్వంతో కూడిన నిరంతర సేవాపర, సినడల్ పరివర్తనకు వారు పిలుపునిచ్చారు.
ఈ సందేశంలో ప్రధాన ప్రతీకగా, దేవునికీ మానవాళికీ మధ్య, అలాగే ప్రజల మధ్య "జీవముగల వారధి" అయిన క్రీస్తును ప్రతిపాదించారు. క్రీస్తును అనుసరించడం అంటే ప్రతి స్థానిక సందర్భంలోనూ వారధుల నిర్మాణకర్తలుగా మారడమేనని పీఠాధిపతులు పేర్కొన్నారు.
జకార్తాలోని మరియ మాత స్వర్గారోహణ కేథడ్రల్ను ఇస్తిక్లాల్ మసీదుతో అనుసంధానించే స్నేహ సొరంగం (Tunnel of Friendship) సందర్శన ఈ సందేశాన్ని మరింత బలపరిచిందని వారు తెలిపారు. ఆ అనుభవం, "అడ్డుగోడలు కాదు, వారధులు నిర్మించడానికి క్రీస్తు విశ్వాసం పిలుస్తోంది" అనే సత్యాన్ని శక్తివంతంగా గుర్తుచేసిందని పేర్కొన్నారు.
స్థానిక శ్రీసభల మధ్య సంఘబంధాన్ని మరింత బలోపేతం చేయాలని పరిశుద్ధ పిత లియో XIV చేసిన పిలుపును కూడా ఈ సందేశం ప్రతిధ్వనించింది. తద్వారా ఆసియాలోని సాంస్కృతిక, మతపర వైవిధ్యంతో కూడిన సమాజాల్లో శ్రీసభ తన సేవను మరింత సమర్థవంతంగా నిర్వహించగలదని పీఠాధిపతులు తెలిపారు.
ప్లీనరీ సమావేశం ముగింపులో, తాము తమ స్థానిక శ్రీసభలకు తిరిగి వెళ్లి లోతుగా ఆలకించే, సరిహద్దులను దాటి సేవ చేసే, పేదలను, బలహీనులను తోడ్పడే, పర్యావరణ పరివర్తనను ప్రోత్సహించే, ఇతర మతాలు, సంస్కృతులకు చెందిన ప్రజలతో కలిసి సత్యం, న్యాయం, శాంతి, ఉమ్మడి గృహ సంరక్షణ కోసం పనిచేసే సువార్త ప్రచార సినడల్ శ్రీసభగా సేవ చేయాలని పీఠాధిపతులు ప్రతిజ్ఞ చేశారు.
ఈ సేవను ఆసియా మాత మరియ మధ్యవర్తిత్వానికి అప్పగిస్తూ, "జీవముగల వారధి" అయిన క్రీస్తు తమను ప్రజలందరికీ సమాధానానికి, నిరీక్షణకు సాధనాలుగా మార్చాలని వారు ప్రార్థించారు.