కార్డినల్ డేవిడ్: శ్రీసభ ధ్యేయం సభ్యుల సంఖ్యను పెంచడం కాదు; మరింత మానవీయమైన ప్రపంచ నిర్మాణం

కార్డినల్ డేవిడ్
ఆసియాలో శ్రీసభ సేవను కొత్త కతోలికుల సంఖ్యతో కాకుండా, మానవ గౌరవాన్ని పరిరక్షించడం, శాంతిని ప్రోత్సహించడం, విభజనలతో నిండుతున్న ప్రపంచంలో సామూహిక మేలు కోసం అంకితభావంతో సేవ చేయడమే కొలమానంగా చూడాలని కార్డినల్ డేవిడ్ పేర్కొన్నారు.

ఆసియాలో కతోలిక శ్రీసభ తన ధ్యేయాన్ని కొత్త కతోలికుల సంఖ్యతో కొలవకూడదని, మానవ గౌరవాన్ని కాపాడడం, శాంతిని ప్రోత్సహించడం, విభజనలతో నిండిన ప్రపంచంలో సామూహిక మేలు కోసం కృషి చేయడమే తన అసలైన బాధ్యత అని Federation of Asian Bishops' Conferences (FABC) ఉపాధ్యక్షుడు కార్డినల్ పాబ్లో వర్జిలియో ఎస్. డేవిడ్ అన్నారు.

ఇండోనేషియాలోని జకార్తాలో హోటల్ ములియాలోని లియాట్రిస్ మీడియా హాల్లో జూలై 24న జరిగిన FABC 12వ ప్లీనరీ సమావేశం రెండో విలేకరుల సమావేశంలో పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ విషయాన్ని వివరించారు.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రాజకీయ ధ్రువీకరణ, జాతీయవాదం మళ్లీ పెరగడం, అంతర్జాతీయ సహకారం బలహీనపడటం వంటి సవాళ్లను ఆసియా ప్రస్తుతం ఎదుర్కొంటోందని కార్డినల్ డేవిడ్ పేర్కొన్నారు. "సినడల్ పరివర్తన మరియు ఆసియాలో వారధులు, వారధుల నిర్మాణకర్తలుగా ఉండే సేవ" అనే ప్రధాన ఇతివృత్తంతో జరిగిన వారంరోజుల సమావేశంలో ఈ వాస్తవాలే పీఠాధిపతుల చర్చలకు నేపథ్యంగా నిలిచాయని ఆయన తెలిపారు.

చెక్ వేదాంతవేత్త గురుశ్రీ టోమాస్ హాలిక్ మరియు మలేషియా పరిశోధకురాలు డాక్టర్ చూంగ్ పుయ్ యీ సమర్పించిన ప్రసంగాలను ప్రస్తావిస్తూ, ఆసియాను రూపుదిద్దుతున్న లోతైన సామాజిక, రాజకీయ మార్పులను పరిశీలించాల్సిందిగా పీఠాధిపతులకు ఆహ్వానం అందిందని కార్డినల్ డేవిడ్ చెప్పారు.

"ప్రపంచీకరణ బలహీనపడుతున్న, అంతర్జాతీయ సంస్థలు క్షీణిస్తున్న ఈ సందర్భంలో, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నిలకడగా ఉన్న కొద్ది సంస్థలలో కతోలిక శ్రీసభ ఒకటి," అని కార్డినల్ డేవిడ్ అన్నారు.

అందువల్ల శాంతి, సంభాషణ, సమరసత కోసం నైతిక స్వరంగా నిలవడం శ్రీసభకు ప్రత్యేకమైన బాధ్యత అని, ఈ విషయంలో పరిశుద్ధ పిత లియో XIV పదేపదే చేసిన పిలుపును ఆయన గుర్తుచేశారు.

శ్రీసభ సేవను సభ్యుల సంఖ్య పెంపుతో ఎన్నడూ పరిమితం చేయకూడదని కార్డినల్ డేవిడ్ స్పష్టం చేశారు.

"మా ప్రధాన లక్ష్యం కేవలం కతోలికుల సంఖ్యను పెంచడం కాదు," అని ఆయన అన్నారు.

సువార్త ప్రచారం అంటే దేవుని స్వరూపంలో, పోలికలో సృష్టించబడిన ప్రతి మానవుని గౌరవాన్ని ధృవీకరించడమేనని ఆయన వివరించారు. న్యాయం, సంఘీభావం, శాంతిపై ఆధారపడిన సమాజ నిర్మాణంలో కేవలం క్రైస్తవులతోనే కాకుండా, సమస్త మానవాళితో కలిసి నడవడానికి శ్రీసభ పిలువబడిందని ఆయన చెప్పారు.

"మనమందరం పరదైసుగా మారడానికి పిలువబడ్డాం," అని కార్డినల్ డేవిడ్ అన్నారు.

మానవ గౌరవం కాపాడబడే చోట, న్యాయం స్థాపించబడే చోట, శాంతి వికసించే చోటే దేవుని రాజ్యం ప్రత్యక్షమవుతుందని ఆయన తెలిపారు.

సమాజంలో ఆధిపత్యం లేదా ప్రత్యేక హక్కులు కోరుకోకుండా కూడా శ్రీసభ ఎలా సేవ చేయగలదో ఇండోనేషియా ఒక ఆదర్శమని కార్డినల్ డేవిడ్ పేర్కొన్నారు. జకార్తా అగ్రపీఠాధిపతి కార్డినల్ ఇగ్నేషియస్ సుహార్యో సామూహిక మేలు, సామాజిక న్యాయం, సృష్టి సంరక్షణ, అవినీతి నిర్మూలన వంటి విలువలను ప్రాముఖ్యంగా ప్రస్తావించడాన్ని ఆయన ప్రశంసించారు. ఈ విలువలు కేవలం కతోలిక సమాజానికే కాకుండా, అందరికీ సంబంధించినవని చెప్పారు.

వివిధ మతాలు, సంస్కృతులకు చెందిన ప్రజలు కూడా ఈ విలువలను పంచుకుంటున్నారని, బహుళత్వ సమాజంలో పరస్పర సహకారానికి ఇవి బలమైన పునాదిగా నిలుస్తాయని కార్డినల్ డేవిడ్ పేర్కొన్నారు.

ఇండోనేషియా జాతీయ తత్వమైన పంచశీల పట్ల దేశం చూపుతున్న నిబద్ధతను కూడా ఆయన ప్రశంసించారు. భిన్న జాతులు, సంస్కృతులు, మతాలకు చెందిన ప్రజలు పరస్పర గౌరవంతో కలిసి జీవిస్తూ సామూహిక మేలు కోసం కృషి చేయడానికి ఇది బలమైన మార్గదర్శకమని ఆయన అభివర్ణించారు.

"మన జాతి, సంస్కృతి, మతం ఏదైనా కావచ్చు; మనమందరం సామూహిక మేలు కోసం కృషి చేస్తూ, మానవ గౌరవాన్ని కాపాడాలి," అని కార్డినల్ డేవిడ్ అన్నారు.

ఆయన వ్యాఖ్యలు FABC ప్లీనరీ సమావేశంలో పదేపదే ప్రతిధ్వనించిన ఒక ప్రధాన సందేశాన్ని ప్రతిబింబించాయి—సినడల్ శ్రీసభ విభేదాలను మరింతగా పెంచేందుకు కాదు, వారధులను నిర్మించేందుకు పిలువబడింది.