ఆసియా శ్రీసభల్లో దివ్యప్రసాద ఆధ్యాత్మికతను మరింతగా పెంపొందించండి: FABC ప్లీనరీ సమావేశానికి పరిశుద్ధ లియో పాపు గారి పిలుపు
ఆసియాలోని ప్రతి స్థానిక శ్రీసభలో దివ్యప్రసాద ఆధ్యాత్మికతను మరింతగా ప్రోత్సహించాలని, అదే శ్రీసభ సంఘబంధానికి పునాది, అలాగే ఖండమంతటా నిజమైన వారధుల నిర్మాణకర్తలుగా ఎదగడానికి కీలకమని పరిశుద్ధ లియో పాపు గారు పిలుపునిచ్చారు.
జూలై 25 మధ్యాహ్నం జకార్తాలోని హోటల్ ములియా వాండా హాల్లో జరిగిన Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశంలో ప్రదర్శించిన వీడియో సందేశం ద్వారా పరిశుద్ధ పాపు గారు ఈ సందేశాన్ని అందించారు.
ఆసియా నలుమూలల నుంచి వచ్చిన పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, సామాన్య విశ్వాసుల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఖండంలో శ్రీసభ భవిష్యత్ సేవపై వారు చేస్తున్న ఆధ్యాత్మిక విచక్షణలో తాను ఆత్మీయంగా వారితో ఏకమై ఉన్నానని తెలిపారు.
"క్రీస్తులోని ప్రియ సహోదరి సహోదరులారా, జకార్తాలో జరుగుతున్న Federation of Asian Bishops' Conferences ప్లీనరీ సమావేశంలో పాల్గొంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక అభివాదాలు," అని పరిశుద్ధ పాపు గారు అన్నారు.
ఇటీవల తాను వెలువరించిన Magnifica Humanitas ఎన్సైక్లికల్ను ప్రస్తావిస్తూ, క్రైస్తవ సంఘీభావం క్రీస్తులోనే మూలం కలిగి ఉందని, తిరుసంస్కారాల ద్వారా, ముఖ్యంగా దివ్యప్రసాదం ద్వారా అది పోషించబడుతుందని ఆయన గుర్తుచేశారు.
"క్రైస్తవ సంఘీభావం క్రీస్తు రహస్యంలోనే తన మూలాన్ని కలిగి ఉందని, తిరుసంస్కారాలలో, ముఖ్యంగా దివ్యప్రసాదంలో మనకున్న సంఘబంధం నుంచే అది ఉద్భవిస్తుందని నేను రాశాను," అని ఆయన పేర్కొన్నారు.
ఆ తరువాత ఆయన పీఠాధిపతులను నేరుగా ఉద్దేశించి ఒక ప్రత్యేక పిలుపునిచ్చారు.
"అందువల్ల, మీ స్థానిక శ్రీసభల్లో దివ్యప్రసాద ఆధ్యాత్మికతను నిరంతరం ప్రోత్సహించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను," అని ఆయన అన్నారు.
అటువంటి ఆధ్యాత్మికత, దివ్యప్రసాదంలో ప్రభువు అనుగ్రహించిన ప్రేమ వరం ద్వారా శ్రీసభ సంఘబంధాన్ని పెంపొందిస్తుందని పరిశుద్ధ పాపు గారు వివరించారు.
"ఇది దివ్యప్రసాదంలో ప్రభువు ప్రసాదించిన ప్రేమ వరం నుండి ప్రవహించే దానశీలతపై ఆధారపడిన శ్రీసభ సంఘబంధ ఆధ్యాత్మికత," అని ఆయన చెప్పారు.
దివ్యప్రసాద జీవితం మరింత బలపడితే, మేత్రాసనాల అంతర్గతంగా మాత్రమే కాకుండా ఆసియాలోని స్థానిక శ్రీసభల మధ్య కూడా సంఘబంధం బలోపేతమవుతుందని, తద్వారా అవి సువార్తకు మరింత విశ్వసనీయమైన సాక్ష్యాన్ని అందించగలవని ఆయన పేర్కొన్నారు.
"మీ స్థానిక శ్రీసభలలోనూ, వాటి మధ్యనూ బంధాలు మరింత బలపడాలని, అవి మీ వివిధ దేశాల్లో దేవుని సన్నిధికి మరింత గొప్ప సూచికగా మారాలని, తద్వారా మీరు కలిసి ఆసియా అంతటా వారధుల నిర్మాణకర్తలుగా ఎదగాలని నేను ఆశిస్తున్నాను," అని ఆయన అన్నారు.
ఈ సందేశాన్ని FABC ప్లీనరీ సమావేశ ప్రధాన ఇతివృత్తంతో పరిశుద్ధ పాపు గారు అనుసంధానించారు. యేసు నాతనియేలుతో చెప్పిన "నీవు ఇంకా గొప్ప సంగతులు చూస్తావు" అనే వాక్యాన్ని ప్రస్తావిస్తూ, క్రీస్తు మనిషికి దేవునితో ఉన్న బంధానికి మాత్రమే కాదు, విశ్వాసుల పరస్పర బంధానికీ మూలమని ఆయన వివరించారు.
"ఈరోజు ఆయన శిష్యులమైన మనకు దేవునితో మన బంధానికి మాత్రమే కాదు, ఒకరితో ఒకరికి ఉన్న బంధానికీ మూలమని తెలుసు," అని ఆయన అన్నారు.
వారంరోజులుగా కొనసాగుతున్న ఈ ప్లీనరీ సమావేశంలో ప్రతినిధులు సినడల్ పరివర్తన, సినడాలిటీపై, సినడ్ అమలు వంటి అంశాలపై చేసిన ఆలోచనలకు పరిశుద్ధ పాపు గారి సందేశం ప్రతిధ్వనించింది. ఆసియాలోని విభిన్న సంస్కృతులు, మతాల మధ్య వారధుల నిర్మాణకర్తగా శ్రీసభ తన సేవను సమర్థవంతంగా నిర్వహించాలంటే, స్థానిక శ్రీసభల మధ్య బంధం మరింత బలపడడం అత్యవసరమని సమావేశంలో పలువురు ప్రతినిధులు నొక్కిచెప్పారు.
చివరిగా, పరిశుద్ధ లియో పాపు గారు ఈ ప్లీనరీ సమావేశాన్ని శ్రీసభ ధన్య కన్య మరియమ్మ మధ్యవర్తిత్వానికి సమర్పిస్తూ, ప్రతినిధుల ఆధ్యాత్మిక విచక్షణలో ఆమె తోడుగా ఉండాలని ప్రార్థించారు.
"ప్రియమైన మిత్రులారా, మీ అందరినీ, మీ చర్చలన్నింటినీ శ్రీసభ మాత మరియతల్లి మధ్యవర్తిత్వానికి సమర్పిస్తూ, ప్రభువు మీకు జ్ఞానం, ధైర్యం అనే వరాలను ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను," అని ఆయన అన్నారు.
సమావేశంలో పాల్గొన్న వారందరికీ తన అపోస్తలిక ఆశీర్వాదాన్ని అందజేస్తూ పరిశుద్ధ పాపు గారు తన సందేశాన్ని ముగించారు.
