సినడల్ విధానంలో ‘పవిత్రాత్మలో సంవాదం’కు ప్రాధాన్యం ఇచ్చిన FABC ఆధ్యాత్మిక ధ్యానదినం

డాక్టర్ క్రిస్టినా ఖెంగ్
2026 జూలై 22న జరిగిన FABC 12వ ప్లీనరీ సమావేశంలోని ప్రార్థన మరియు ఆత్మపరిశీలన దినంలో, డాక్టర్ క్రిస్టినా ఖెంగ్ "కాన్వర్సేషన్స్ ఇన్ ది స్పిరిట్" కార్యక్రమానికి మార్గనిర్దేశనం చేశారు.

జూలై 22న Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధుల కోసం కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే నిర్వహించిన ఒకరోజు ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమం, సాధారణ ఆధ్యాత్మిక ప్రసంగంతో ముగియకుండా, ప్రార్థన, ఆలకింపు, మౌనం, ఉమ్మడి వివేచనతో కూడిన ప్రత్యేకమైన సినడల్ విధానమైన "పవిత్రాత్మలో సంవాదం"తో కొనసాగింది.

జకార్తాలోని హోటల్ ములియా వాండా హాలులో జరిగిన గంటన్నరపాటు ఈ సమావేశం, దేవుని వాక్యంతో రూపుదిద్దుకున్న శిష్యులుగా, సేవా కార్యంలోను ఐక్యతలోను "వారధులు" కావాలని కార్డినల్ టాగ్లే ఇచ్చిన ఆధ్యాత్మిక సందేశం అనంతరం నిర్వహించబడింది.

FABC సినడాలిటీ కమిషన్ సభ్యురాలు డాక్టర్ క్రిస్టినా ఖెంగ్ ఈ "పవిత్రాత్మలో సంవాదం" కార్యక్రమానికి మార్గనిర్దేశనం చేశారు. ఇది చర్చ లేదా వాదోపవాదం కాదని, "ఉమ్మడి ప్రార్థన" అని ఆమె వివరించారు.

సమావేశం ప్రారంభం నుంచే ప్రతినిధులు మౌనంలోకి ప్రవేశించారు. మోషే మండుతున్న పొద వద్ద దేవుని సన్నిధిని అనుభవించిన సందర్భాన్ని గుర్తుచేస్తూ, దేవుని సమక్షంలోను, ఒకరి సమక్షంలో మరొకరు కూడా ఆధ్యాత్మికంగా "తమ చెప్పులు విప్పుకోవాలని" డాక్టర్ ఖెంగ్ వారిని ఆహ్వానించారు. ఈ ప్రతీక ద్వారా సమావేశంలోను, సహప్రతినిధుల అనుభవాలలోను దేవుని సన్నిధిని గుర్తించాలని ఆమె సూచించారు.

"పవిత్రాత్మలో సంవాదం" అనేది ముందుగానే నిర్ణయించుకున్న అభిప్రాయాలతో వచ్చే ప్రక్రియ కాదని, ఆలకింపు, ప్రార్థన, ఆత్మపరిశీలన ద్వారా పరిశుద్ధాత్మ మార్గనిర్దేశానికి మనసును తెరిచి ఉంచే ఉమ్మడి ప్రయాణమని ఆమె వివరించారు.

ఈ సమావేశం కార్డినల్ టాగ్లే ఆధ్యాత్మిక ధ్యాన ప్రసంగానికి కొనసాగింపుగా జరిగింది. "వారధులుగా మారే ప్రయాణంలో మీరు ఎలాంటి సవాళ్లు, అవకాశాలను అనుభవించారు?", "సేవా కార్యానికి, ఐక్యతకు వారధులుగా ఉండడం గురించి యేసు నుంచి ఏమి నేర్చుకోవాలని మీరు ఆశిస్తున్నారు?" అనే రెండు ప్రశ్నలపై ప్రతినిధులు ప్రార్థనాపూర్వకంగా ఆలోచించారు.

ఈ ప్రక్రియ మూడు దశల్లో కొనసాగింది.

మొదటి దశలో ప్రతి ప్రతినిధి తన వ్యక్తిగత ప్రార్థన ద్వారా పొందిన ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకున్నారు. మిగిలినవారు ఎలాంటి అంతరాయం కలిగించకుండా, వ్యాఖ్యానించకుండా, ప్రతిస్పందించకుండా శ్రద్ధగా ఆలకించారు. వాదనలు వినిపించడం కంటే, ప్రార్థనలో తాము గ్రహించిన అంశాలను నిజాయితీగా వ్యక్తపరచడానికే ప్రాధాన్యం ఇవ్వబడింది.

ఈ మొత్తం ప్రక్రియలో ఆలకింపే ప్రధానాంశంగా నిలిచింది. ఎదుటివారి మాటలను మాత్రమే కాకుండా, వాటి వెనుక ఉన్న భావోద్వేగాలను, ఆధ్యాత్మిక అనుభూతులను కూడా గ్రహించాలని ప్రతినిధులను ప్రోత్సహించారు. భిన్నమైన అభిప్రాయాలు ఉద్రిక్తతలకు దారితీసినా, వాటిని విశాల హృదయంతో, ప్రేమతో, జిజ్ఞాసతో, నేర్చుకోవాలనే మనసుతో స్వీకరించాలని సూచించారు.

ప్రతి దశ అనంతరం కొంతసేపు మౌనం పాటించారు. వెంటనే స్పందించడం కాకుండా, తమ హృదయాన్ని ఏ అంశం తాకిందో, ఏది ప్రేరణనిచ్చిందో, ఏది సవాలు విసిరిందో, తాము ఎంత శ్రద్ధగా ఆలకించగలిగారో ప్రతివ్యక్తి ఆత్మపరిశీలన చేసుకున్నారు.

రెండవ దశలో ప్రతినిధులు తమ అభిప్రాయాలను మళ్లీ చెప్పలేదు. బదులుగా, ఇతరులను ఆలకించడం ద్వారా తాము ఎలా ప్రభావితమయ్యామో పంచుకున్నారు. వ్యక్తిగత అభిప్రాయాల వ్యక్తీకరణ నుంచి, సహప్రతినిధుల అనుభవాల ద్వారా పరిశుద్ధాత్మ ఎలా కార్యాచరణ చేస్తున్నారో గుర్తించే దిశగా ఈ దశ సాగింది.

మరోసారి మౌన ప్రార్థన అనంతరం మూడవ, చివరి దశ ప్రారంభమైంది. ఈ దశలో పరిశుద్ధాత్మ తమలో ఏ విధమైన ప్రేరణను కలిగిస్తున్నారో ప్రతినిధులు కలిసి వివేచించారు. మొత్తం అనుభవాన్ని సమీక్షిస్తూ, అందరిలో ఉమ్మడిగా వెలుగులోకి వచ్చిన ముఖ్యమైన ఆధ్యాత్మిక అవగాహనలను గుర్తించారు.

ఈ విధానం, సినడల్ శ్రీసభకు మూలమైన ఆలకింపు సంస్కృతిని పెంపొందించడానికే ఉద్దేశించబడింది. వాదోపవాదాలు లేదా మెజారిటీ నిర్ణయాల ద్వారా ఏకాభిప్రాయానికి రావడం కాకుండా, ప్రార్థన, మౌనం, శ్రద్ధతో కూడిన ఆలకింపు, పరస్పర గౌరవం ద్వారా దేవుని చిత్తాన్ని ఉమ్మడిగా వివేచించే ప్రక్రియకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.

కార్డినల్ టాగ్లే ఆధ్యాత్మిక ధ్యాన ప్రసంగం అనంతరం వెంటనే "పవిత్రాత్మలో సంవాదం" నిర్వహించడం ద్వారా, ఉదయం వినిపించిన సందేశాన్ని ప్రతినిధులు ఆచరణలో పెట్టే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు. సేవా కార్యానికి, ఐక్యతకు వారధులుగా ఉండాలనే పిలుపును ఆలకించిన పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, సామాన్య విశ్వాస ప్రతినిధులు పరస్పరం లోతుగా ఆలకిస్తూ, పరిశుద్ధాత్మ మార్గనిర్దేశంలో ఉమ్మడి వివేచనను జీవనంలో ఆచరిస్తూ, FABC ప్లీనరీ సమావేశ ప్రయాణాన్ని కొనసాగించారు.