వారధుల నిర్మాణానికి ముందు ఆలకించాలి: ఆసియా శ్రీసభకు ఇండోనేషియా అగ్రపీఠాధిపతి పిలుపు

మహా పూజ్య ఆంటోనియస్ సుబియాంటో బుంజామిన్
OSCకు చెందిన మహా పూజ్య ఆంటోనియస్ సుబియాంటో బుంజామిన్, FABC 12వ ప్లీనరీ సమావేశాన్ని పరిశుద్ధాత్మ స్వరాన్ని, పరస్పరం ఒకరినొకరు, అలాగే ఆసియా ప్రజల స్వరాలను ఆలకించే “పవిత్రమైన సందర్భం”గా అభివర్ణించారు.

Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశం ప్రారంభమైన సందర్భంగా, ఇండోనేషియా కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు, ఆసియాలోని శ్రీసభ ఆలకించే శ్రీసభగా మారాలని పిలుపునిచ్చారు. నిజమైన సినడాలిటీ దేవుని స్వరాన్ని, పరస్పరం ఒకరినొకరు, అలాగే సమాజంలోని అట్టడుగు వర్గాల స్వరాలను ఆలకించడం ద్వారానే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.

"ఈ ప్లీనరీ సమావేశం కేవలం పీఠాధిపతుల సమావేశం మాత్రమే కాదు," అని OSCకు చెందిన మహా పూజ్య ఆంటోనియస్ సుబియాంటో బుంజామిన్ జూలై 21న జకార్తాలోని హోటల్ ములియాలో సమావేశమైన ప్రతినిధులతో అన్నారు. "పరిశుద్ధాత్మ స్వరాన్ని ఆలకించడానికి, పరస్పరం ఒకరినొకరు ఆలకించడానికి, ఆసియా ప్రజల స్వరాలను ఆలకించడానికి ఇది ఒక పవిత్రమైన సందర్భం," అని పేర్కొన్నారు.

ఈ ప్రారంభ కార్యక్రమంలో శ్రీసభ నాయకులు, ప్రభుత్వ ప్రతినిధులు, ఆసియా నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.

వేదికపై FABC అధ్యక్షుడు భారతదేశానికి చెందిన కార్డినల్ ఫిలిప్ నేరి ఫెర్రావో ఉపాధ్యక్షుడు ఫిలిప్పీన్స్‌కు చెందిన కార్డినల్ పాబ్లో వర్జిలియో డేవిడ్, ప్రధాన కార్యదర్శి జపాన్‌కు చెందిన కార్డినల్ టార్సిసియో ఇసావో కికూచి, ముఖ్య అతిథిగా ఇండోనేషియా మత వ్యవహారాల మంత్రి నసరుద్దీన్ ఉమర్ పాల్గొన్నారు.

ప్రతినిధులకు ఇండోనేషియాలో స్వాగతం పలుకుతూ, ఆసియాలోని స్థానిక శ్రీసభల మధ్య ఐక్యతా బంధాలను మరింత బలోపేతం చేసుకుంటూనే, ఇండోనేషియా ఆతిథ్యాన్ని వారు అనుభవిస్తారని మహా పూజ్య ఆంటోనియస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆసియా శ్రీసభ ప్రత్యేక లక్షణంగా సంభాషణను చాలా కాలంగా FABC ప్రోత్సహిస్తోందని ఆయన గుర్తు చేశారు. 1990లో ఇండోనేషియాలోని బాండుంగ్‌లో జరిగిన FABC ప్లీనరీ సమావేశంలో, పీఠాధిపతులు "త్రివిధ సంభాషణ" ఆధ్యాత్మికతను—పేదలతో, సంస్కృతులతో, ఇతర మతాలతో సంభాషణ—ప్రతిపాదించారని పేర్కొన్నారు. నేడు సృష్టి సంరక్షణ కూడా శ్రీసభ సేవలో ఒక కీలకమైన అంశంగా మారిందని ఆయన అన్నారు.

ఆలకించడం, సహకారం, భవిష్యత్తు పట్ల ఉమ్మడి దృక్పథం ద్వారా తమ సినడల్ పరివర్తనను మరింత లోతుగా పెంపొందించుకోవాలని మహా పూజ్య ఆంటోనియస్ ప్రతినిధులను ప్రోత్సహించారు.
 

ఇటీవలి పరిశుద్ధ పాపు గారి బోధనలతో సినడల్ ప్రయాణాన్ని అనుసంధానిస్తూ, మాట్లాడే ముందు ఆలకించే, తీర్పు చెప్పే ముందు తోడుగా నడిచే శ్రీసభగా మారాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఇచ్చిన పిలుపును ఆయన స్మరించారు. అలాగే సంభాషణ, ప్రేమ, సేవ ద్వారా వారధుల నిర్మాణకర్తగా మారాలని పరిశుద్ధ లియో పాపు గారు కూడా ఆ దృక్పథాన్ని మరింత బలపరిచారని తెలిపారు.

ప్రారంభ కార్యక్రమంలో భాగంగా, నుసంతర నృత్య బృందం ఇండోనేషియా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే పలు సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించింది. సుమత్రా, జావా, నుసా తెంగ్గారా ప్రాంతాల సంప్రదాయాలను ప్రతిబింబించిన ఈ ప్రదర్శనలు దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పడంతో పాటు, ఆసియా నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఘన స్వాగతం పలికాయి.

ఈ సమావేశ నిర్వహణలో సహకరించిన ఇండోనేషియా ప్రభుత్వం, ముఖ్యంగా మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మత నాయకులు, స్వచ్ఛంద సేవకులు, దాతలు, నిర్వహణ కమిటీకి మహా పూజ్య ఆంటోనియస్ కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారం సినడాలిటీకి సాక్షాత్కార రూపమని ఆయన అభివర్ణించారు.

తన ప్రసంగాన్ని ముగిస్తూ, ఈ సమావేశాన్ని పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వానికి అప్పగిస్తూ ప్రార్థించారు. ఆసియాలోని స్థానిక శ్రీసభలను బలోపేతం చేయాలని, సామాన్య విశ్వాసులను, యువతను శక్తివంతం చేయాలని, సృష్టి సంరక్షణ పట్ల మరింత శ్రద్ధ పెంపొందించాలని, ఖండమంతటా శ్రీసభ సాక్ష్యాన్ని పునరుద్ధరించాలని ఆయన ప్రార్థించారు.

సమావేశ దృక్పథాన్ని ప్రతిబింబించే ఈ ప్రార్థనతో ఆయన తన సందేశాన్ని ముగించారు: "మమ్మల్ని శాంతికి సాధనాలుగా మార్చు. FABCని శాంతికి సాధనంగా మలచు. అప్పుడు మేము మరింత గొప్ప కార్యాలను దర్శిస్తాము."