పేదలు, వలసదారులు, వాతావరణ న్యాయం కోసం శ్రీసభ స్వరాన్ని బలోపేతం చేయాలి: FABCకి మిసెరియోర్ పిలుపు

గురుశ్రీ డాక్టర్ ఆండ్రియాస్ ఫ్రిక్
FABC 12వ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించిన మిసెరియోర్ డైరెక్టర్ జనరల్ గురుశ్రీ డాక్టర్ ఆండ్రియాస్ ఫ్రిక్, పేదలు, వలసదారులు, వాతావరణ సంక్షోభం వల్ల అత్యధికంగా ప్రభావితమవుతున్న ప్రజల తరఫున ఆసియాలోని శ్రీసభ ప్రవక్త స్వరంగా నిలవాలని పిలుపునిచ్చారు.

నేటి ప్రపంచంలో విశ్వసనీయంగా నిలవాలంటే ఆసియాలోని శ్రీసభ పేదలు, వలసదారులు, వాతావరణ సంక్షోభం వల్ల అత్యధికంగా ప్రభావితమవుతున్న ప్రజల తరఫున ప్రవక్త స్వరాన్ని మరింత బలోపేతం చేయాలని మిసెరియోర్ డైరెక్టర్ జనరల్ గురుశ్రీ డాక్టర్ ఆండ్రియాస్ ఫ్రిక్ Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు పిలుపునిచ్చారు.

జూలై 23న జకార్తాలో సమావేశమైన పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, శ్రీసభ నాయకులను ఉద్దేశించి గురుశ్రీ ఆండ్రియాస్ ఫ్రిక్ మాట్లాడుతూ, శ్రీసభ సేవ అంతర్గత పునరుద్ధరణకే పరిమితం కాకుండా న్యాయం, శాంతి, సృష్టి పరిరక్షణ కోసం నిలబడాల్సిన బాధ్యతను కూడా కలిగి ఉందని అన్నారు.

జర్మన్ కతోలిక పీఠాధిపతుల అభివృద్ధి సంస్థ మిసెరియోర్ తరఫున సమావేశంలో పాల్గొన్న గురుశ్రీ ఆండ్రియాస్ ఫ్రిక్, ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం లభించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఆసియాలోని పీఠాధిపతుల మధ్య కనిపిస్తున్న విశాల దృక్పథం, సంభాషణ స్ఫూర్తి, శ్రీసభతో పాటు సమాజం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

మిసెరియోర్ ప్రపంచవ్యాప్త సేవను పరిచయం చేస్తూ, ప్రస్తుతం 83 దేశాల్లో 1,600కు పైగా భాగస్వామ్య సంస్థల సహకారంతో దాదాపు 3,000 అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు అందిస్తోందని, వీటిలో ఆసియాలోని అనేక మేత్రాసనాలు, శ్రీసభ సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయని ఆయన తెలిపారు.

గత రెండేళ్లుగా డైరెక్టర్ జనరల్‌గా తన సేవను స్మరించుకుంటూ, "నేటి, రేపటి సవాళ్లకు శ్రీసభ విశ్వసనీయంగా, అర్థవంతంగా ఎలా స్పందించగలదు?" అనే ప్రశ్న తన సేవకు నిరంతర మార్గదర్శకంగా నిలిచిందని గురుశ్రీ ఆండ్రియాస్ ఫ్రిక్ చెప్పారు.

అదే ప్రశ్న మరింత సినడల్, మిషనరీ శ్రీసభగా ఎదగాలన్న FABC నిబద్ధతకు కూడా కేంద్రబిందువుగా ఉందని ఆయన పేర్కొన్నారు.

సమావేశ అంశమైన వారధుల నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ, శాశ్వతమైన సంబంధాల నిర్మాణ ప్రాముఖ్యతను వివరించే ఒక ప్రతీకను ఆయన ఉపయోగించారు.

"వారధులను నిర్మించడంలో ఒక భాగం సొరంగాలను నిర్మించడం కూడా. అంటే బలమైన పునాదులతో, లోతుల్లో నుంచి అనుబంధాలను నిర్మించడం," అని ఆయన అన్నారు.

నిజమైన భాగస్వామ్యం అంటే తాత్కాలిక పరిష్కారాల కంటే పరస్పర విశ్వాసం, సంఘీభావంలో ఓర్పుతో పెట్టుబడి పెట్టడమేనని ఆయన వివరించారు.

ఆరు దశాబ్దాలకు పైగా మిసెరియోర్ పేదలు, అణగారిన వర్గాలతో కలిసి పనిచేస్తూనే, వారి సమస్యలను విధాన నిర్ణేతల ముందుకు తీసుకెళ్తోందని గురుశ్రీ ఆండ్రియాస్ ఫ్రిక్ తెలిపారు. ఈ సేవ సువార్తలోని మానవ గౌరవాన్ని పరిరక్షించి, న్యాయాన్ని ప్రోత్సహించాలనే పిలుపులోనే పాతుకుపోయి ఉందని ఆయన అన్నారు.

"సమాజ అంచుల్లో జీవిస్తున్న వారి తరఫున శ్రీసభ ప్రవక్త స్వరంగా నిలిచి, న్యాయం, శాంతి, పర్యావరణ పరివర్తనకు మద్దతుదారుగా కొనసాగేందుకు మనమంతా కలిసి కట్టుబడి ఉన్నాము," అని ఆయన పేర్కొన్నారు.

నేటి శ్రీసభ ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన అంశాల్లో వాతావరణ న్యాయం ఒకటని ఆయన అన్నారు. పర్యావరణ విధ్వంసాన్ని పేదరికం, వలసలు, సహజ వనరులపై ఘర్షణలు, సామాజిక అసమానతల నుంచి వేరుచేసి చూడలేమని ఆయన స్పష్టం చేశారు.

2011 నుంచే పర్యావరణ అంశాలపై దృష్టి సారిస్తున్న FABC కృషిని అభినందించిన గురుశ్రీ ఆండ్రియాస్ ఫ్రిక్, ఈ పరస్పర అనుసంధానిత సవాళ్లకు సమగ్ర సేవాపర దృక్పథంతో ఆసియాలోని శ్రీసభ స్పందించడం కొనసాగించాలని ప్రోత్సహించారు.

మహిళలు, యువత, సామాన్య విశ్వాసుల భాగస్వామ్యం మరింత పెరిగినప్పుడే సినడాలిటీ సార్థకమవుతుందని కూడా ఆయన నొక్కిచెప్పారు. వారి స్వరాలు శ్రీసభ సేవకు అత్యంత అవసరమని ఆయన అన్నారు.

"సినడాలిటీ మహిళలు, యువత, సామాన్య విశ్వాసుల స్వరాలపై ఆధారపడి ఉంటుంది. వారికి గౌరవం, మర్యాద, సురక్షిత వాతావరణాన్ని కల్పించడం మన ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటి," అని ఆయన పేర్కొన్నారు.

పాల్గొనడం, ఉమ్మడి బాధ్యత అనే సినడల్ దృక్పథాన్ని ప్రతిబింబించేలా శ్రీసభ తన నిర్మాణాలు, విధానాలను నిరంతరం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

తన ప్రసంగాన్ని ముగిస్తూ, పేదలతో సంఘీభావంగా కలిసి నడుస్తూ, న్యాయాన్ని పరిరక్షిస్తూ, సృష్టి సంరక్షణకు అంకితభావంతో ముందుకు సాగాలని గురుశ్రీ ఆండ్రియాస్ ఫ్రిక్ పీఠాధిపతులు, ప్రతినిధులకు పిలుపునిచ్చారు.

శ్రీసభ తన అంతర్గత జీవితాన్ని ఎలా పునరుద్ధరించుకుంటుందనే దానితో మాత్రమే సినడల్ పరివర్తనను కొలవలేమని, బలహీన వర్గాల పక్షాన ఎంత విశ్వసనీయంగా నిలుస్తుందో, న్యాయం, శాంతి, సృష్టి సమగ్రత కోసం ఎంత ధైర్యంగా ప్రవక్త సాక్ష్యాన్ని అందిస్తుందో దానిపైనే అది ఆధారపడి ఉంటుందని FABC ప్లీనరీ సమావేశంలో వెలువడుతున్న ప్రధాన సందేశాల్లో ఒకదాన్ని ఆయన ప్రసంగం మరింత బలపరిచింది