నాలుగు దశాబ్దాల విద్యా వారసత్వానికి ఆధునిక రూపం – కర్నూలు మేత్రాసనం

జూలై 21  కర్నూలు మేత్రాసనం విద్యారంగంలో మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వేలాది మంది జీవితాలను తీర్చిదిద్దిన సెయింట్ మేరీస్ జూనియర్ కళాశాల సంపూర్ణ పునరుద్ధరణ అనంతరం నూతన రూపంతో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. కర్నూలు పీఠాధిపతి మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్, OCD కళాశాల నూతన భవనాలను ఆశీర్వదించి ప్రారంభించారు.

కార్యక్రమానికి గురువులు, మఠకన్యలు, మాజీ అధ్యాపకులు, బోధనా–బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, దాతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

నూతనంగా నిర్మించిన ప్రధాన ద్వారం వద్ద సుమారు 350 మంది విద్యార్థులు పూలతో  పీఠాధిపతికి ఘన స్వాగతం పలికారు.

కళాశాల పునరుద్ధరణకు ఆర్థిక సహకారం అందించిన "ఇటాలియన్ బిషప్స్ కాన్ఫరెన్స్" సేవలను గుర్తిస్తూ ఏర్పాటు చేసిన స్మారక శిలాఫలకాన్ని పీఠాధిపతి ఆవిష్కరించారు.

అనంతరం తరగతి గదులు, ప్రయోగశాలలు, పరిపాలనా కార్యాలయాలు, ప్రిన్సిపాల్ కార్యాలయం సహా కళాశాలలోని అన్ని విభాగాలను ఆశీర్వదించారు.

పునరుద్ధరణలో ఆధునిక తరగతి గదులు, సరికొత్త ప్రయోగశాలలు, నవీకరించిన కార్యాలయాలు, కొత్త టైల్స్, ఫాల్స్ సీలింగ్, మెరుగైన విద్యుత్ వెలుతురు, కొత్త డెస్కులు–బెంచీలు, మినరల్ వాటర్ శుద్ధి కేంద్రం, 30 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ, కొత్త ప్రహరీ గోడ, ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారం వంటి అనేక సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. దీంతో విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, ఆధునిక విద్యా వాతావరణం ఏర్పడింది.

ప్రజా సభలో ప్రసంగించిన పీఠాధిపతి మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్, OCD, విద్య అనేది కేవలం పరీక్షల్లో అధిక మార్కులు సాధించడానికి మాత్రమే కాదని, జీవితాన్ని మార్చే జ్ఞానం, విలువలు మరియు సేవాభావాన్ని పెంపొందించడానికి సాధనమని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి కూడా నాణ్యమైన విద్యకు దూరం కాకూడదన్న సంకల్పంతో మేత్రాసనం విద్యా రంగంలో నిరంతరం పెట్టుబడులు పెడుతోందని ఆయన స్పష్టం చేశారు.

 విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కళాశాలకు విశిష్ట సేవలందించిన మాజీ అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం పీఠాధిపతి, ఇతర ప్రముఖులను నిర్వాహకులు సన్మానించారు. వందన సమర్పణతో కార్యక్రమం ముగియగా, అతిథులందరికీ స్నేహభోజనం ఏర్పాటు చేశారు.

సెయింట్ మేరీస్ జూనియర్ కళాశాల పునరుద్ధరణ కేవలం భవనాల ఆధునీకరణ మాత్రమే కాదు; పేద మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన, విలువల ఆధారిత విద్యను అందించాలన్న కర్నూలు మేత్రాసన నిబద్ధతకు ప్రతీకగా నిలిచింది.