దేవుని సన్నిధిని ముందుగా గుర్తించాలి: FABC ముగింపు దివ్యబలిపూజలో కార్డినల్ ఫెర్రావో పిలుపు
ఆసియాలోని ప్రజల మధ్య దేవుడు ఇప్పటికే కార్యాచరణలో ఉన్నారనే సత్యాన్ని ముందుగా గుర్తించిన తరువాతే శ్రీసభ సువార్తను ప్రకటించాల్సి ఉంటుందని కార్డినల్ ఫెర్రావో జూలై 26న జరిగిన Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశం ముగింపు దివ్యబలిపూజలో తెలిపారు.
జకార్తాలోని మరియ మాత స్వర్గారోహణ కేథడ్రల్లో ప్రసంగించిన FABC అధ్యక్షుడు, ఆసియాలోని విభిన్న సంస్కృతులు, సమాజాల మధ్య దేవుడు ఇప్పటికే నాటిన "నిధిని" వినయంతో గుర్తించడమే శ్రీసభ సినడల్ ప్రయాణానికి ఆరంభమని అన్నారు.
మత్తయి సువార్తలోని దాచబడిన నిధి, అమూల్య ముత్యం, చేపల వల గురించిన ఉపమానాలపై ధ్యానిస్తూ, పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, సామాన్య విశ్వాసులు ఈ వారం రోజుల ప్లీనరీ సమావేశాన్ని కేవలం సమావేశాల సమాహారంగా కాకుండా ఆధ్యాత్మిక అనుభవంగా చూడాలని కార్డినల్ ఫెర్రావో ఆహ్వానించారు.
"ఈ ప్లీనరీ సమావేశమంతా మనం వేసుకున్న ప్రశ్న ఒక్కటే—ఆసియాలో శ్రీసభ ఎలా వారధిగా, వారధుల నిర్మాణకర్తగా మారగలదు?" అని ఆయన అన్నారు.
ఆ ప్రశ్నకు సమాధానం దేవుని రాజ్యం ఇప్పటికే ఉనికిలో ఉందనే సత్యాన్ని గుర్తించడంలోనే ఉందని కార్డినల్ వివరించారు. దేవుడు లేని చోట ఆయనను తీసుకెళ్లడం శ్రీసభ సేవ కాదని, ఇప్పటికే కార్యాచరణలో ఉన్న దేవుని సన్నిధిని గుర్తించి, దానిని పోషించడమే శ్రీసభ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.
"దేవుడు లేని ప్రదేశాలకు మనం దేవుణ్ణి తీసుకెళ్లడం లేదు. ఇప్పటికే అక్కడ ఉన్న, ఇప్పటికే కార్యాచరణలో ఉన్న దేవుణ్ణి గుర్తించడం మనం నేర్చుకోవాలి," అని ఆయన అన్నారు.
ఈ దృక్పథమే సినడాలిటీ హృదయమని పేర్కొంటూ, పవిత్ర గ్రంథం, దివ్య రహస్యాల ద్వారానే కాకుండా, పేదల ఆర్తనాదాల్లో, ఆదివాసీ ప్రజల జ్ఞానంలో, కుటుంబాల విశ్వాసంలో, యువత ఆశయాల్లో, వలసదారుల బాధల్లో, ఇతర మతాల ప్రజల ఆధ్యాత్మిక అన్వేషణలో కూడా మాట్లాడుతున్న పవిత్రాత్మ స్వరాన్ని ఆలకించడానికి శ్రీసభ పిలువబడిందని ఆయన వివరించారు.
సమృద్ధమైన సంస్కృతులు, ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయాలు, యువ జనాభాతో ఆసియా ఆశీర్వదించబడిన ఖండమని కార్డినల్ ఫెర్రావో పేర్కొన్నారు. అదే సమయంలో పేదరికం, బలవంతపు వలసలు, సాయుధ ఘర్షణలు, రాజకీయ ధ్రువీకరణ, వివక్ష, పర్యావరణ విధ్వంసం వంటి సవాళ్లను కూడా ఈ ఖండం ఎదుర్కొంటోందని గుర్తుచేశారు.
అయితే ఈ పరిస్థితులు దేవుని సన్నిధిని మరుగునపరచవని, వాటి ద్వారా సమాజంతో ఆలకింపు, సంభాషణ, వినయంతో మమేకమవ్వాలని శ్రీసభను ఆహ్వానిస్తున్నాయని ఆయన అన్నారు.
సినడల్ ప్రయాణానికి అడ్డంకిగా నిలిచే ధోరణులపై కూడా ఆయన హెచ్చరించారు. తమాచార్యవాదం, అతిగా కేంద్రీకరణ, భయం, పోటీ మనస్తత్వం, ఒక వ్యక్తి లేదా ఒక వర్గం వద్దనే అన్ని సమాధానాలు ఉన్నాయనే భావన శ్రీసభలో సంఘబంధాన్ని, భాగస్వామ్యాన్ని బలహీనపరుస్తాయని చెప్పారు.
"నిర్ణయ ప్రక్రియ అందరికీ అందుబాటులో లేకపోతే భాగస్వామ్యం వికసించదు. కొన్ని స్వరాలు నిరంతరం విస్మరించబడితే సంఘబంధం పెరగదు," అని ఆయన అన్నారు.
సువార్తలోని దాచబడిన నిధి కోసం తన సర్వస్వాన్ని అమ్ముకున్న వ్యక్తి ఉదాహరణను మళ్లీ ప్రస్తావిస్తూ, అది నేటి శ్రీసభకు అవసరమైన పరివర్తనకు ప్రతీక అని కార్డినల్ ఫెర్రావో వివరించారు.
"ఆ నిధి అంత విలువైనది కాబట్టి, దాన్ని పొందడానికి మిగతావన్నీ విడిచిపెట్టడం సముచితం," అని పేర్కొంటూ, దేవుని కార్యానికి అడ్డుగా నిలిచే మనస్తత్వాలను, నిర్మాణాలను విడిచిపెట్టాలని ఆయన శ్రీసభను పిలుపునిచ్చారు.
ప్లీనరీ సమావేశం ముగిసే సందర్భంగా, సమావేశ స్ఫూర్తిని తమ స్థానిక శ్రీసభలకు తీసుకెళ్లాలని ఆయన ప్రతినిధులను ప్రోత్సహించారు.
ప్లీనరీ సమావేశంలో జరిగిన సంభాషణలు, ఆధ్యాత్మిక విచక్షణ, రూపొందించిన పత్రాలు దైనందిన సేవాపర జీవితంలో ఆచరణకు వచ్చినప్పుడే నిజమైన ఫలితాలను ఇస్తాయని ఆయన అన్నారు. మరింత లోతుగా ఆలకించే, పవిత్రాత్మ నడిపింపుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే, పేదలు, గాయపడినవారు, నిరీక్షణ కోసం అన్వేషిస్తున్న ప్రజలతో కలిసి నడిచే శ్రీసభను నిర్మించాలనే నిబద్ధతతో ప్రతినిధులు తమ మేత్రాసనాలకు తిరిగి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
వారం రోజులపాటు సాగిన ప్లీనరీ సమావేశం ముగిసినప్పటికీ, అది ఆసియాలో శ్రీసభకు కొత్త సేవా ప్రారంభమని కార్డినల్ ఫెర్రావో గుర్తుచేశారు. సినడల్ జీవన విధానాన్ని ఆచరిస్తూ, నిజమైన వారధుల నిర్మాణకర్తగా మారడమే ఇకపై ఆసియా శ్రీసభ ముందున్న ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.