కృత్రిమ మేధస్సును చూసి భయపడవద్దు: FABC ఉపాధ్యక్షుడు కార్డినల్ డేవిడ్

FABC ఉపాధ్యక్షుడు కార్డినల్ డేవిడ్
"యంత్రం కంటే మనమే ఎక్కువ తెలివిగలవాళ్లం," అని కార్డినల్ పాబ్లో వర్జిలియో డేవిడ్ పేర్కొంటూ, కృత్రిమ మేధస్సును ముప్పుగా చూడకూడదని ఉద్ఘాటించారు.

Federation of Asian Bishops' Conferences (FABC) ఉపాధ్యక్షుడు కార్డినల్ పాబ్లో వర్జిలియో డేవిడ్ మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సును ముప్పుగా కాకుండా సువార్త ప్రచార సేవకు తోడ్పడే సాధనంగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. జకార్తాలో జరిగిన FABC 12వ ప్లీనరీ సమావేశం ముగింపు విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జూలై 26న ఇండోనేషియా రాజధాని జకార్తాలోని మరియ మాత స్వర్గారోహణ బృహద్దేవాలయం సేవా కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో, వారం రోజులపాటు కొనసాగిన ప్లీనరీ సమావేశం ముగిసిన అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు కార్డినల్ సమాధానమిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో FABC అసోసియేట్ ప్రధాన కార్యదర్శి, Office of Synodality కార్యనిర్వాహక కార్యదర్శి గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్, ఇండోనేషియా కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు పీఠాధిపతి ఆంటోనియస్ సుబియాంటో బుంజామిన్ కూడా పాల్గొన్నారు.

కృత్రిమ మేధస్సు శ్రీసభకు ముప్పుగా మారుతుందా అనే ప్రశ్నకు సమాధానంగా కార్డినల్ డేవిడ్, ప్రపంచంలోనే అత్యధిక భాషా వైవిధ్యం కలిగిన ప్రాంతాలలో ఒకటైన ఆసియాలో సమాచార వినిమయం, సువార్త ప్రచారానికి అది అందించగల సహకారాన్ని ప్రస్తావించారు.

ఇండోనేషియా పీఠాధిపతుల సమాఖ్య విడుదల చేసిన తాజా సేవాపర ప్రకటనను బహాసా ఇండోనేషియా భాషలో అందుకున్నప్పుడు, కృత్రిమ మేధస్సు ఆధారిత అనువాదం ద్వారా ఆ పత్రాన్ని ఆసియా అంతటా ఉన్న కతోలికులకు అందుబాటులోకి తీసుకురావచ్చనే ఆలోచన తనకు వెంటనే వచ్చిందని ఆయన గుర్తుచేశారు. అయితే అదే సమయంలో, కృత్రిమ మేధస్సుపై విచక్షణ లేకుండా పూర్తిగా ఆధారపడకూడదని కూడా హెచ్చరించారు.

తాను స్వయంగా పలు కృత్రిమ మేధస్సు అనువాద వేదికలను పరీక్షించిన అనుభవాన్ని పంచుకుంటూ, ముఖ్యంగా స్థానిక భాషల నుంచి అనువదించే సందర్భాల్లో లేదా సాంస్కృతిక నేపథ్యం సరిగా అందించనప్పుడు యంత్ర అనువాదాల్లో ఇప్పటికీ గణనీయమైన పొరపాట్లు కనిపిస్తాయని చెప్పారు.

కృత్రిమ మేధస్సును మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయంగా చూడకుండా, మానవుల వివేకపూర్వక మార్గనిర్దేశంతో మరింత మెరుగుపడే సాధనంగా చూడాలని ఆయన సూచించారు.

"కృత్రిమ మేధస్సును అత్యంత తెలివిగల విద్యార్థిలా చూడాలి. దానికి మీరు అందించే సమాచారం ఎంత మెరుగ్గా ఉంటే, అది కూడా అంత మెరుగ్గా పనిచేస్తుంది," అని కార్డినల్ డేవిడ్ అన్నారు.

తన అనుభవాన్ని ఉదాహరణగా చెబుతూ, వినియోగదారులు తమ సూచనలను (ప్రాంప్ట్‌లు) మరింత స్పష్టంగా రూపొందించి, సరైన నేపథ్య సమాచారాన్ని అందించిన కొద్దీ అనువాద నాణ్యత కూడా గణనీయంగా మెరుగుపడుతుందని ఆయన వివరించారు.

సాంకేతిక పురోగతి చివరికి మానవ మేధస్సు, వివేకంపైనే ఆధారపడి ఉంటుందని ఈ అనుభవం తెలియజేస్తోందని కార్డినల్ డేవిడ్ అన్నారు.

దశాబ్దాల క్రితం ఎలక్ట్రానిక్ కాలిక్యులేటర్లు వచ్చినప్పుడు వ్యక్తమైన భయాలతో, నేటి కృత్రిమ మేధస్సుపై ఉన్న ఆందోళనలను ఆయన పోల్చిచెప్పారు.

"కాలిక్యులేటర్లు వస్తే ప్రజలు గణితంలో బలహీనులవుతారని అప్పట్లో చాలామంది భావించారు. కానీ అలా జరగలేదు. గణితశాస్త్రం మరింత ఉన్నత స్థాయికి చేరుకుంది," అని ఆయన అన్నారు.

అదేవిధంగా, కృత్రిమ మేధస్సును మానవ సామర్థ్యాలను తగ్గించే అంశంగా కాకుండా, బాధ్యతాయుతంగా ఉపయోగించినప్పుడు సృజనాత్మకతను, అభ్యాసాన్ని, సహకారాన్ని మరింత బలోపేతం చేసే సాంకేతికతగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

"కృత్రిమ మేధస్సును చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎన్నో అభివృద్ధులు ముందున్నాయి. దాన్ని మరింత తెలివిగా ఉపయోగించడం మాత్రమే మనం నేర్చుకోవాలి," అని ఆయన అన్నారు.

సాంకేతికత సమస్త మానవాళి మేలు కోసం ఉపయోగపడేలా చూసే బాధ్యత యంత్రాలది కాదని, మానవులదేనని కార్డినల్ స్పష్టం చేశారు.

"యంత్రం కంటే మనమే ఎక్కువ తెలివిగలవాళ్లం. కృత్రిమ మేధస్సును అత్యుత్తమంగా వినియోగించేవారు, దాని నుంచి ఉత్తమ ఫలితాలను రాబట్టడం తెలిసిన మంచి ప్రాంప్ట్‌లను రూపొందించగల వ్యక్తులే," అని ఆయన అన్నారు.

ఆయన వ్యాఖ్యలు FABC ప్లీనరీ సమావేశంలోని ప్రధాన అంశాలలో ఒకదానిని ప్రతిధ్వనింపజేశాయి. అదేంటంటే, ఆసియాలోని శ్రీసభ సువార్త విలువల్లో స్థిరంగా నిలిచి, ఆధునిక ప్రపంచంలోని వాస్తవికతలతో ధైర్యంగా మమేకం కావాలి. కార్డినల్ డేవిడ్ అభిప్రాయం ప్రకారం, సమాచార వినిమయాన్ని బలోపేతం చేయడానికి, సహకారాన్ని పెంపొందించడానికి, ఖండవ్యాప్తంగా శ్రీసభ సువార్త ప్రచార సేవను ముందుకు తీసుకెళ్లడానికి, వివేకంతో కూడిన ఆధ్యాత్మిక విచక్షణతో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను స్వీకరించడం కూడా అందులో భాగమే.

Telugu Survey Popup Image