"ఐక్యతే ఆసియాలో శ్రీసభకు అత్యంత గొప్ప సాక్ష్యం కావాలి" – FABC అసోసియేట్ కార్యదర్శి గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్
జకార్తాలో జరుగుతున్న Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశం సందర్భంగా, రేడియో వెరిటాస్ ఆసియ (RVA), FABC అసోసియేట్ కార్యదర్శి, సినడాలిటీ కమిషన్ (Commission for Synodality) కార్యనిర్వాహక కార్యదర్శి, అలాగే ఈ ప్లీనరీ సమావేశం ప్రధాన నిర్వాహకుల్లో ఒకరైన గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్తో ప్రత్యేకంగా ముచ్చటించింది.
ఈ ఇంటర్వ్యూలో ఆయన, ఈ ఏడాది ప్లీనరీ సమావేశం ద్వారా ఆశిస్తున్న ఫలితాలు, ఆసియాలో వారధుల నిర్మాణకర్తగా శ్రీసభ నిర్వహించాల్సిన సేవ, ఖండం ఎదుర్కొంటున్న ప్రధాన సేవాపర సవాళ్లు, స్థానిక శ్రీసభల మధ్య సంఘబంధాన్ని బలోపేతం చేయడంలో FABC పాత్ర వంటి అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు.
ప్రధానాంశాలు:
ప్రశ్న: ఈ FABC ప్లీనరీ సమావేశం అనంతరం పీఠాధిపతులు తమ స్థానిక శ్రీసభలకు తీసుకెళ్లాలని మీరు ఆశిస్తున్న అత్యంత ముఖ్యమైన ఫలితం లేదా వారసత్వం ఏమిటి?
గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్:
మేము చూడాలనుకుంటున్న అత్యంత గొప్ప ఫలితాల్లో ఒకటి సినడాలిటీ జీవన విధానంగా మారడం. సినడాలిటీ అనేది కేవలం పనిచేసే విధానం లేదా నిర్ణయాలు తీసుకునే పద్ధతి మాత్రమే కాదు; అది ఒక ఆధ్యాత్మిక జీవన విధానం.
ఈ సినడల్ ఆధ్యాత్మికత విచారణలలో, మేత్రాసనాలలో, అలాగే ఆసియాలోని మొత్తం శ్రీసభలో మరింతగా వికసించాలని మేము ఆశిస్తున్నాం. సినడాలిటీ ద్వారా మనం కలిసి ప్రయాణించే, కలిసి ఎదిగే శ్రీసభగా మారడం నేర్చుకుంటాం.
ఈ సమావేశం అనంతరం పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, సామాన్య విశ్వాసుల మధ్య మరింత బలమైన సంఘబంధం ఏర్పడాలని మేము కోరుకుంటున్నాం. ఈ సమావేశం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి పీఠాధిపతుల్లో సినడల్ జీవన విధానంపై మరింత నిబద్ధతను పెంపొందించడం.
ప్రశ్న: ఈ సమావేశం ప్రధానాంశం శ్రీసభను "వారధులు మరియు వారధుల నిర్మాణకర్తలు" కావాలని పిలుస్తోంది. ఆసియా సందర్భంలో దాని అర్థం ఏమిటి?
గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్:
ఆసియాలోని చాలా ప్రాంతాల్లో కతోలికులు, సాధారణంగా క్రైస్తవులు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. అందువల్ల సమాజంలో వారధిగా నిలవడం శ్రీసభకు ప్రత్యేకమైన పిలుపు.
ఈ ఖండంలో మతాల మధ్య, జాతుల మధ్య, దేశాల మధ్య కూడా విభేదాలను మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి సందర్భంలో శాంతి, సమరసతకు సాధనంగా శ్రీసభ నిలవాలి.
ఈ సేవ శ్రీసభ వెలుపల మాత్రమే కాదు; శ్రీసభలోనూ అవసరం. పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, సామాన్య విశ్వాసుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. వాటి మధ్య ఐక్యతను పెంపొందించే శక్తిగా శ్రీసభ నిలవాలి.
వారధుల నిర్మాణకర్తగా ఉండటం అంటే ప్రజలను అనుసంధానించడం, సంభాషణను ప్రోత్సహించడం, సమాజాలు శాంతియుతంగా జీవించేందుకు తోడ్పడటం. అదే శ్రీసభ సేవ.
ఈ సమావేశంలో సుమారు 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ సినడాలిటీ స్ఫూర్తిని తమ స్వస్థలాలకు తీసుకెళ్లి, తమ తమ విశ్వాస సమాజాల్లో మార్పుకు కారకులవుతారని మేము ఆశిస్తున్నాం.
మార్పు తరచుగా ఒక వ్యక్తితోనే ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి మారితే, ఆ పరివర్తన మరెందరికో వ్యాపిస్తుంది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి విషయంలో మా నిరీక్షణ ఇదే.
ప్రశ్న: ఈ దృక్పథాన్ని సాకారం చేసుకునే క్రమంలో ఆసియాలోని శ్రీసభ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు ఏమిటి?
గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్:
సవాళ్లు అనేకం ఉన్నాయి. సామాజిక ఉద్రిక్తతలు, అస్థిరతలతో పాటు, భావజాలపరమైన ఒత్తిడులు కూడా పెరుగుతున్నాయి.
లౌకికవాదం ప్రభావం పెరుగుతోంది. వినియోగవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థలు అనేక సమాజాలపై ప్రభావం చూపుతున్నాయి. పేదరికం, అవినీతి, వలసలు, పర్యావరణ విధ్వంసం వంటి సమస్యలతో ఆసియా ఇప్పటికీ పోరాడుతోంది.
అందుకే శ్రీసభ తన అంతర్గత జీవితంలోనే కాకుండా సమాజంలో కూడా పరివర్తనకు కారకంగా నిలవాలి. మత్తయి సువార్త మనకు గుర్తు చేస్తున్నట్లుగా, మనం భూమికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా ఉండాలి. సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడంలో శ్రీసభ తన పాత్రను పోషించాలి.
ప్రశ్న: ఆసియాలోని శ్రీసభకు మీరు ఒకే ఒక్క సందేశం ఇవ్వాల్సి వస్తే అది ఏమిటి?
గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్:
ఐక్యత!
ఆసియా ఎంతో వైవిధ్యభరితమైన ఖండం. అందువల్ల మన మధ్య అనేక భేదాలు ఉన్నాయి. మనం ఆ భేదాలపైనే దృష్టి పెడితే అవే అడ్డంకులవుతాయి. కానీ మనలను ఏకం చేసేవాటిపై దృష్టి పెడితే శ్రీసభ మరింతగా అభివృద్ధి చెందుతుంది.
ప్రతి వ్యక్తికి దేవుడు ప్రత్యేకమైన పిలుపును ఇచ్చాడు. పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, సామాన్య విశ్వాసులు అందరికీ వేర్వేరు బాధ్యతలు ఉన్నప్పటికీ, అవన్నీ పరస్పరం పరిపూరకమైనవే.
నేటి మన అతిపెద్ద సవాళ్లలో ఒకటి ఉదాసీనత. శ్రీసభ సమస్యలు ఎవరో ఒకరి బాధ్యత అనే భావనకు శ్రీసభలో స్థానం లేదు.
బాప్తిస్మం ద్వారా మనమందరం దేవుని ప్రజలమవుతాం. శ్రీసభ కేవలం పీఠాధిపతులకో, గురువులకో చెందినది కాదు; బాప్తిస్మం పొందిన విశ్వాసులందరికీ చెందింది. శ్రీసభ నిర్మాణంలో ప్రతి ఒక్కరికీ ఉమ్మడి బాధ్యత ఉంది.
మనుషులతో కూడి ఉన్నందున ఏ శ్రీసభా పరిపూర్ణమైనది కాదు. దాని బలహీనతలపైనే దృష్టి పెడితే అది ఎదగలేదు. కానీ మనల్ని ఏకం చేసేవాటిని గుర్తించి, దేవుడు ప్రసాదించిన వరాలను వినియోగిస్తే శ్రీసభ నిరంతరం వికసిస్తుంది.
ప్రశ్న: ఆసియాలోని స్థానిక శ్రీసభలకు మద్దతు ఇవ్వడంలో FABC ప్రధాన సేవ ఏమిటి?
గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్:
ఆసియాలోని స్థానిక శ్రీసభల మధ్య సంఘబంధాన్ని బలోపేతం చేయడమే FABC ప్రధాన సేవ.
ఉదాహరణకు, FABC ద్వారా ఆసియా ఖండమంతటా ఉన్న కతోలిక పరిశోధనా సంస్థలను ఒక వేదికపైకి తీసుకువస్తూ, అవి పరస్పరం సహకరించేందుకు, వనరులను పంచుకునేందుకు, మరింత బలమైన పరిశోధనలు చేపట్టేందుకు ఒక నెట్వర్క్ను నిర్మిస్తున్నాం.
మరింత విస్తృతంగా చెప్పాలంటే, స్థానిక శ్రీసభలను నిర్దేశించడం, పర్యవేక్షించడం లేదా వాటిపై అధికారాన్ని చెలాయించడం FABC పని కాదు. పీఠాధిపతుల సమాఖ్యలకంటే పైస్థాయి పాలనా సంస్థగా అది వ్యవహరించదు. బదులుగా, ఆసియాలోని పీఠాధిపతుల సమాఖ్యల మధ్య సోదరభావ సహకార వేదికగా అవసరమైన చోట మద్దతు అందిస్తుంది.
స్థానిక శ్రీసభలు తమ తమ సేవాపర వాస్తవికతలకు అనుగుణంగా స్పందించే ప్రయాణంలో వాటికి తోడుగా ఉండడం, ప్రోత్సహించడం, సహకరించడం మా ప్రధాన బాధ్యత.
సంస్కృతులు, భాషలు, సామాజిక పరిస్థితుల్లో ఆసియా అత్యంత వైవిధ్యభరితమైన ఖండం. ఈ నేపథ్యంలో FABC ఒక వారధిగా పనిచేస్తూ, స్థానిక శ్రీసభలను ఒకచోటకు తీసుకువచ్చి, పరస్పరం నేర్చుకునేలా, అనుభవాలను పంచుకునేలా, సంఘబంధం మరియు సేవలో కలిసి ఎదిగేలా ప్రోత్సహిస్తోంది.